ఏపీ విద్యారంగంలో లోకేష్ ముద్ర.. టెన్త్ ఫలితాలతో తేలిన వాస్తవం

posted on: May 1, 2026 11:46AM

తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు తాను దృష్టిపెట్టిన, చేపట్టిన అన్ని అంశాలలోనూ అద్భుత ఫలితాలు రాబడుతున్నారు.  పార్టీ వ్యవహారాలకు సంబంధించి ఇప్పటికే తనకంటూ ఓ బెంచ్ మార్క్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న లోకేష్.. ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా కూడా  అద్భుత విజయాన్ని సాధించారు.  గురువారం (ఏప్రిల్ 30) విడుదలైన టెన్త్ పరీక్షా ఫలితాలలో సక్సెస్ శాతం లోకేష్ వంద రోజుల యాక్షన్ ప్లాన్ సాధించిన విజయానికి అద్దం పట్టింది. 

2024లోతెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత లోకేష్  విద్యా శాఖ మంత్రిగా లోకేశ్ కీలక బాధ్యతలు చేపట్టారు. అలాగే ఐటీ శాఖ మంత్రిగా ఐటీ, పెట్టుబడుల ప్రోత్సాహం వంటి శాఖలనూ పర్యవేక్షిస్తూ.. ఆ దిశగా అనితరసాధ్యమన్న విజయాలను సాధిస్తూనే..  విద్యా శాఖపై కూడా లోకేస్ తనదైన ముద్ర వేశారు.   2026 విద్యా సంవత్సరానికి సంబంధించి విడుదలైన టెన్త్ ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా 85.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే..  ఈసారి ఉత్తీర్ణత గణనీయంగా పెరగడం విశేషం. విద్యాశాఖలో లోకేష్ ప్రవేశపెట్టిన సంస్కరణలు, ప్రణాళికాబద్ధమైన అడుగులు ఈ విజయానికి ప్రధాన కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ ఏడాది  పరీక్షలకు మొత్తం 6,18,131 మంది విద్యార్థులు హాజరు కాగా, వారిలో  5,26,954 మంది ఉత్తీర్ణత సాధించారు. ముఖ్యంగా బాలికలు 87.90 శాతంతో అగ్రస్థానంలో నిలవగా, బాలురు 82.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాల వారీగా చూస్తే పార్వతీపురం మన్యం జిల్లా 96.07 శాతంతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.  

అయితే ఈ అద్భుత ఫలితాలు రావడం వెనుక మంత్రి లోకేష్ అవిశ్రాంత కృషి ఉంది. మంత్రిగా లోకేష్ బాధ్యతలు తీసుకున్న వెంటనే విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా డిసెంబర్ 2025 నుండి మార్చి 2026 వరకు అమలు చేసిన  100 రోజుల ప్రత్యేక ప్రణాళిక విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 30 రోజుల రెసిడెన్షియల్ ప్రోగ్రామ్‌లు నిర్వహించడం.. తెలుగు  ఇంగ్లీష్ మాధ్యమాల్లో స్టడీ మెటీరియల్ అందుబాటులోకి తీసుకురావడం వంటి చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల పనితీరులో కూడా గణనీయమైన మార్పు తీసుకువచ్చారు. గత ఏడాది 72.8 శాతంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల ఉత్తీర్ణత, ఈసారి 78.39 శాతానికి పెరగడం లోకేష్ పర్యవేక్షణకు నిదర్శనంగా నిలుస్తోంది. రాష్ట్రం మొత్తంలో   ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే సున్నా శాతం ఫలితాలు వచ్చాయి.  మిగిలిన చోట్ల విద్యా ప్రమాణాలు మెరుగుపడ్డాయి. 

రాష్ట్ర ప్రగతికి పెట్టుబడుల సాధన ఎంత ముఖ్యమో, విద్యార్థుల విజయం అంతకంటే ముఖ్యమని లోకేష్ చెప్పారు.  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం ఈ ఫలితాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ లోకేష్ టీమ్‌ను అభినందించారు. విద్యాశాఖలో సాంకేతికతను జోడించడం.. ఎప్పటికప్పుడు డేటా ఆధారిత పర్యవేక్షణ చేయడం వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయన్నారు.  టెన్త్ ఫలితాలు ఏపీ విద్యారంగంలో లోకేష్ మార్క్ ప్రస్ఫుటంగా కనిపించేలా చేశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...