మేడారం జాతరకు కేంద్రం రూ.3.7 కోట్ల నిధులు
posted on: Jan 23, 2026 6:25PM
.webp)
గిరిజన కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం రూ.3 కోట్ల 70 లక్షల నిధులను విడుదల చేసింది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి చొరవతో ఈ నిధులను కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా మంజూరు చేశాయి. రెండేళ్లకు ఒకసారి నిర్వహించే మేడారం జాతరకు దేశ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు తరలివస్తుండటంతో.. భక్తులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నిధులను విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ‘గిరిజన సర్క్యూట్’ పథకం కింద ఇప్పటికే మేడారం పరిసర ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద గతంలో సుమారు రూ.80 కోట్ల వ్యయంతో ములుగు, లక్నవరం, మేడారం, తాడ్వాయి, దామరవాయి, మల్లూరు, బొగత జలపాతం వంటి ప్రాంతాల్లో పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులు కల్పించారు. రోడ్లు, వసతి సౌకర్యాలు, పర్యాటక సమాచార కేంద్రాలు, ఇతర సదుపాయాలు కల్పించడంతో ఈ ప్రాంతాలకు పర్యాటక ఆకర్షణ మరింత పెరిగింది.


.webp)
.webp)


