గోషామహల్‌లో భారీ చోరీ...నిందితుడు అరెస్ట్

posted on: May 12, 2026 8:38PM

 

బాధితుడి సోదరుడే దొంగ.. 

 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు..

హైదరాబాద్ నగరంలోని గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ ఇళ్ల దొంగతనం కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి, చోరీకి గురైన రూ.5 లక్షల నగదు, భారీగా బంగారం, వెండి ఆభరణాలు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళితే 

బాధితుడు డి. మహేష్ మే 10న కుటుంబ సభ్యులతో కలిసి ఒక వేడుకకు హాజరయ్యేందుకు ఇంటికి తాళం వేసి వెళ్లారు. అర్ధరాత్రి తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉండటం, అల్మారాలు పగులగొట్టబడినట్టు గమనించారు. ఇంట్లోని రూ.5 లక్షల నగదు, సుమారు 30 తులాల బంగారం, 1.62 కిలోల వెండి వస్తువులు దొంగతనానికి గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో గోషామహల్ పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో బేగం బజార్ ముల్తానీపురాకు చెందిన దొంతుల రాజేష్ (37) దొంగతనం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. 

దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. బాధితుడికి వరుసకు కజిన్ అయిన రాజేష్ పక్క ఇంట్లోనే నివసిస్తున్నాడు. కిరాణా దుకాణం నిర్వహిస్తూ ఆటో నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు... అయితే రాజేష్ ఆన్లైన్ లోన్ యాప్‌ల ద్వారా రుణం తీసుకున్నాడు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు మరియు అప్పులు వీటి కారణంగా దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే నిందితుడు రాజేష్, బాధితుడి కుటుంబ కదలికలను ముందుగానే గమనిస్తూ, ఇంట్లో ఉన్న బంగారం పై కన్నేశాడు..

ఈ క్రమంలోనే మే 10 రాత్రి మహేష్ కుటుంబం లంగర్ హౌస్‌లో జరిగిన వేడుకకు వెళ్లిన విషయాన్ని గమనించిన రాజేష్, రాత్రి 9.30 గంటల సమయంలో పక్కింటికి పాలు ఇచ్చే నెపంతో వెళ్లి, అక్కడి నుంచి డాబా పైకి ఎక్కి బాధితుడి ఇంట్లోకి ప్రవేశించాడు. స్క్రూడ్రైవర్ సహాయంతో రెండో, మూడో అంతస్తుల తలుపులు పగులగొట్టి అల్మారాలోని నగదు, బంగారం, వెండి వస్తువులను చిన్న సంచిలో వేసుకుని తన ఇంట్లో దాచాడు. అనంతరం ఏమీ తెలియనట్లు ఆటో తీసుకుని బయటకు వెళ్లిపోయాడు. 

పోలీసులకు అతని కదలికలపై అనుమానం రావడంతో రాజేష్ ను అదుపులోకి తీసుకోవడంతో నిజం బయటపడింది. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి రూ.5 లక్షల నగదు, టైటాన్ వాచ్, 30 తులాల బంగారు ఆభరణాలు (లాంగ్ చైన్, లక్ష్మీ డిజైన్ నెక్లెస్, కమ్మలు, బుట్టలు, ముక్కుపుడకలు, గోల్డ్ బిస్కెట్), 1.62 కిలోల వెండి వస్తువులు (కడియాలు, పట్టీలు, దీపాలు, గిన్నెలు)తో పాటు కాంస్య వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...