Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...షాదీ ముబారక్ పేరుతో భారీ దోపిడీ.. రూ.21 లక్షలు స్వాహా!
posted on: Jun 14, 2026 4:48PM

తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక సంక్షేమ పథకం షాదీ ముబారక్ పేరుతో కోట్ల ఆశలు పెట్టుకున్న పేద కుటుంబాల కోసం కేటాయించిన నిధులను కొందరు కేటుగాళ్లు, ప్రభుత్వ అధికారుల కుమ్మక్కుతో కాజేసిన భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పెళ్లిళ్లు జరగకపోయినా జరిగినట్లు నకిలీ పత్రాలు సృష్టించి, లబ్ధిదారుల పేరుతో సుమారు రూ.21 లక్షల ప్రభుత్వ నిధులను స్వాహా చేసిన అంతరాష్ట్ర ముఠాను అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కేసులో బండ్లగూడ తహసీల్ కార్యాలయంలో పనిచేస్తున్న స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ధరావత్ అశోక్ కిరణ్ సహా మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. హసన్నగర్లోని ఫాతిమా కాలనీలో ఒక ఇంట్లో షాదీ ముబారక్ పథకానికి సంబంధించిన నకిలీ పత్రాలు తయారవుతున్నాయన్న సమాచారం అందడంతో అత్తాపూర్ పోలీసులు దాడులు నిర్వహించారు.
ప్రధాన నిందితుడు మహమ్మద్ ఎతిమాద్ ఉల్ హక్ ఇంట్లో నిర్వహించిన సోదాల్లో భారీ ఎత్తున నకిలీ దరఖాస్తులు, వివాహ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డులు, కంప్యూటర్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, చెక్కులు లభ్యమయ్యాయి. విచారణలో ఎతిమాద్ ఉల్ హక్ ఆధార్ ఆపరేటర్గా పనిచేస్తూ తన కంప్యూటర్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి వధువుల ఫొటోలు, వివాహ ధ్రువీకరణ పత్రాలు, గుర్తింపు కార్డులు సహా పలు కీలక పత్రాలను ఫోర్జరీ చేసినట్లు తేలింది.
అనంతరం ఆ దరఖాస్తు లను బండ్లగూడ తహసీ ల్దార్ కార్యాలయంలో సమర్పించి ప్రభుత్వ నిధులు విడుదలయ్యేలా పథకం ప్రకారం వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు.ఈ మోసంలో స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ధరావత్ అశోక్ కిరణ్ కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. క్షేత్రస్థాయి ధృవీకరణ లేకుండానే ఫైళ్లను ఆమో దించి నిధులు విడుదలయ్యేలా సహకరించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు మిగిలిన నింది తులు నకిలీ లబ్ధిదారులను సృష్టించడం, బ్యాంకు ఖాతాలు సమకూర్చడం, వచ్చిన డబ్బును పంచు కోవడం వంటి పనుల్లో భాగస్వాములైనట్లు గుర్తించారు.
ఇప్పటివరకు ఈ ముఠా రూ.21 లక్షల మేర ప్రభుత్వ నిధులను అక్రమంగా పొందినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి ఒక ల్యాప్టాప్, ఒక డెస్క్టాప్ కంప్యూటర్, ఆరు మొబైల్ ఫోన్లు, నకిలీ దరఖాస్తులు, ఫోర్జరీ చేసిన ఐడీ ప్రూఫ్లు, రూ.21 లక్షల విలువైన 21 చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరుతో జరిగే మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా మధ్యవర్తిత్వం చేస్తామని చెప్పి డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన అత్తాపూర్ పోలీసు బృందాన్ని రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఎస్. శ్రీనివాస్ అభినందించారు.






