సినిమా టికెట్ల రేట్లపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

 

తెలుగు సినీ పరిశ్రమపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ ధరలు పెంచితే వచ్చే ఆదాయంలో 20 శాతం ఇస్తే టికెట్ రేట్ల పెంపునకు జీవో ఇస్తామని ముఖ్యమంత్రి అన్నారు. న్యూయార్క్, టోక్యో, సింగపూర్, దుబాయ్‌తో పోటీ పడేలా షూటింగ్‌లు హైదరాబాద్‌లో నిర్వహించేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. మంగళశారం సాయంత్రం హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో సీఎం రేవంత్ రెడ్డికి సినీ కార్మికులు సన్మానం చేశారు. 

ఒకప్పుడు తెలుగుచిత్ర పరిశ్రమ అంటే.. మదరాసి అని పిలిచేవారని గుర్తుచేశారు. టాలీవుడ్‌కు హైదరాబాద్‌కు తరలించాలని ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఎంతో కృషి చేశారని అన్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సాయంతో భాగ్యనగరన్నికి తీసుకొచ్చారని తెలిపారు. కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 1964లో నంది అవార్డుల కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. 

తనకు సినీ కార్మికుల కష్టాలు తెలుసని.. సినీ కార్మికులను పట్టించుకోనంత స్థాయికి ఇంకా తాను వెళ్లలేదని అన్నారు. సినీ కార్మికుల కోసం నటుడు ప్రభాకర్ రెడ్డి తన సొంత 10 ఎకరాల భూమి ఇచ్చారని సీఎం పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గద్దర్ అవార్డులు ప్రారంభించామని తెలిపారు. 

ప్రపంచ సినిమాకు హైదరాబాద్ కేరాఫ్ కావాలన్నదే తమ ఆలోచన అని చెప్పారు. సినీ కార్మికులు అండగా ఉంటే హాలీవుడ్‌ను హైదరాబాద్‌కు తీసుకొస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. కృష్ణా నగర్ లో ఒక మంచి స్థలాన్ని చూడండి నర్సరీ నుంచి 12 గా తరగతి వరకు కార్పొరేట్ స్థాయిలో స్కూల్ నిర్మించి మీ పిల్లలకు చదువు చెప్పించే బాధ్యత నేను తీసుకుంటాని సీఎం అన్నారు.  

మీ సమస్యలు తెలుసుకునేందుకే మిత్రుడు దిల్ రాజుకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించాని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు మధ్య వారధిగా ఉంటారని దిల్ రాజుకు ఆ బాధ్యతలు ఇచ్చామని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికతో మా ప్రభుత్వం ముందుకు వెళుతోందని.. ఐటీ, ఫార్మా లాగే సినీ పరిశ్రమకు మా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. మీ ఆరోగ్య సమస్యలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తామన్నారు. 

సినీ కార్మికుల  సంక్షేమానికి ఒక వెల్ఫేర్ ఫండ్ ను ఏర్పాటు చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ సంక్షేమ నిధికి రూ.10 కోట్లు ఫండ్ అందిస్తామని సీఎం తెలిపారు. కార్మికసంఘాల అసోసియేషన్ భవన్ నిర్మాణానికి ఆర్ధిక సాయం అందిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల, పొన్నం, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, సినీ నిర్మాతలు, దర్శకులు, కార్మిక సంఘాలు పాల్గోన్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu