మెంటలెక్కిస్తున్న మంచిరెడ్డి

 

ఇబ్రహీంపట్నం తెలుగుదేశం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి జనానికి మెంటలెక్కించేలా వున్నాడు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ అనుసరిస్తున్న ‘ఆకర్ష’ పథకంలో భాగంగా ఇతర పార్టీల్లో వున్న ఎమ్మెల్యేలకు ఎర వేసి లాక్కోవడం కొనసాగుతోంది. గత రెండు మూడు రోజులుగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని విడిచి టీఆర్ఎస్‌లో చేరబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు చూసి ఎవరూ పెద్దగా షాక్ అవలేదు. కేసీఆర్ తలచుకుంటే ఎవరైనా పార్టీ మారాల్సిందేనని అందరూ మామూలుగా వున్నారు. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చక్కగా టీఆర్ఎస్‌లో చేరిపోతే సరిపోయేది. కానీ ఆయన బుధవారం ఉదయం తెలంగాణ తెలుగుదేశం నాయకుడు ఎర్రబెల్లితో ఫోన్‌లో మాట్లాడుతూ, తన కంఠంలో ప్రాణం వుండగా తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదని, ఇప్పుడు మీడియాలో వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని చెప్పాడట. అది విని టీటీడీపీ వర్గాలు ‘మంచి’ మనిషిని అపార్థం చేసుకున్నామని అనుకున్నారట. ఆ తర్వాత గంటసేపటికే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలసి చాలాసేపు సమావేశమయ్యారు. రేపో ఎల్లుండో టీఆర్ఎస్‌లో చేరడానికి ఒప్పందం కూడా కుదిరిందని సమాచారం. మరి చేరేదేదో చేరిపోకుండా జనానికి మెంటలెక్కించే పనులేంటి మంచిరెడ్డీ?