టీఎంసీలో మమతా బెనర్జీ పట్టు సడలిందా?

posted on: Jun 2, 2026 10:06AM

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో  అనూహ్య పరిణామం సంభవించింది. నిన్న మొన్నటివరకు తిరుగులేని శక్తిగా వెలిగిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అస్థిత్వం కోసం  పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి కోలుకోకముందే..  పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలు   భారీ షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత..  భవిష్యత్తు కార్యాచరణను చర్చించేందుకు  ఏర్పాటు చేసిన   కీలక సమావేశానికి పార్టీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు   గైర్హాజరు  అయ్యారు. 

ఈ పరిణామం తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉన్న అసంతృప్తిని,  ముఠా రాజకీయాలనుబహిర్గతం చేసింది. ముఖ్యంగా మమతా బెనర్జీ వారసుడిగా చలామణి అవుతున్న అభిషేక్ బెనర్జీ ఒంటెద్దు పోకడలపై పార్టీ సీనియర్లలో  ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఇటీవలే ఎన్నికల ఫలితాల అనంతరం క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన అభిషేక్ బెనర్జీపై సోనార్‌పూర్‌లో దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన కంటికి  గాయమై ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా హుగ్లీలో మరో కీలక నేత కల్యాణ్ బెనర్జీపై కూడా దాడి జరిగింది. ఈ దాడుల నేపథ్యంలో పార్టీ నేతల్లో ధైర్యం నింపేందుకు దీదీ ఏర్పాటు చేసిన సమావేశానికి మెజారిటీ ఎమ్మెల్యేలు గైర్హాజర్ కావడం తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీని దిగ్భ్రాంతికి గురి చేసింది. 

  తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు 50 మందికి పైగా ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధంగా బెంగాల్ రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది.   వీరంతా మమతా బెనర్జీ,  అభిషేక్ బెనర్జీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ..  సరికొత్త రాజకీయ కూటమిని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు చర్చ నడుస్తోంది.  ఈ తాజా సంక్షోభంపై మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నాయకులపై దాడులు జరుగుతుంటే ఆసుపత్రులు కూడా చికిత్స అందించవద్దంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని, బెంగాల్‌  ప్రస్తుతం   నియంతృత్వ ధోరణి నడుస్తోందని ఆరోపించారు.  కాగా 80 మందిలో 60 మంది ఎమ్మెల్యేలు కీలక సమావేశానికి గైర్హాజర్ కావడం చూస్తుంటే.. టీఎంసీలో  మమతా బెనర్జీ పట్టు   సడలినట్లే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...