నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం
posted on: Jan 24, 2026 2:17PM
.webp)
హైదరాబాద్ నగరంలోని నాంపల్లి రైల్వే స్టేషన్ రోడ్డులో బచ్చ ఫర్నీచర్ షాప్లో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నాలుగు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఫర్నీచర్ షాప్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేగింది. మంటలు వేగంగా వ్యాపించడంతో దట్టమైన పొగ భవనం అంతా కమ్ముకుంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ అప్రమత్తమైంది. నాలుగు ఫైర్ ఇంజన్లతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు.
ఫర్నీచర్ షాప్లో ఎక్కువగా చెక్క సామగ్రి, సోఫాలు, కుర్చీలు, ఇతర దహన పదార్థాలు ఉండటంతో మంటలు భారీగా చెలరేగినట్లు అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదం సమయంలో భవనంలో నలుగురు పెద్దవాళ్లు, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సమాచారం వెలువడడంతో సంఘటన స్థలంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. భవనంలో చిక్కుకున్న వారి వివరాలపై స్పష్టత కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టారు.
మంటల కారణంగా నాంపల్లి స్టేషన్ రోడ్లో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులుఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించి, వాహనాలను మళ్లించారు. స్థానికులు పెద్ద సంఖ్యలో ఘటన స్థలానికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడతామని అధికారులు తెలిపారు. మంటలు పూర్తిగా ఆర్పిన అనంతరం నష్ట వివరాలు, గాయాలపై అధికారిక సమాచారం వెలువడే అవకాశం ఉంది.






