కేసీఆర్కి షాకిస్తున్న మజ్లిస్
posted on: Nov 11, 2014 4:07PM

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ పాతబస్తీలో బలంగా వున్న మజ్లిస్ పార్టీతో సీఎం కేసీఆర్ అనుబంధాన్ని పెంచుకున్నారు. టీఆర్ఎస్ నాయకులు మజ్లిస్ నేతల ఇళ్ళకి వెళ్ళి మరీ స్నేహబంధాన్ని పెరిగేలా చేశారు. మజ్లిస్ నాయకులు గతంలో తెలంగాణ ఏర్పాటునే తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్తో చేతులు కలిపి ‘భాయీ భాయీ’ అన్నారు. కేసీఆర్ యుద్ధ ప్రాతిపదికన మజ్లిస్తో స్నేహం పెంచుకోవడానికి గల కారణం హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో మెజారిటీ సాధించడం కోసమే అని రాజకీయ పరిశీలకులు అంటూ వుంటారు. హైదరాబాద్లో స్థిరపడిపోయిన సీమాంధ్రులు పొరపాటున కూడా టీఆర్ఎస్కి ఓటు వేయరు. ఆ లోటును తీర్చుకోవాలంటే ముస్లింలను మంచి చేసుకోవాలన్నది కేసీఆర్ రాజకీయ వ్యూహమని, అందులో భాగంగానే మజ్లిస్తో ఫ్రెండ్ షిప్ అని పరిశీలకులు అంటారు. ఎవరు ఏమనుకున్నప్పటికీ గత ఐదు నెలలుగా టీఆర్ఎస్, మజ్లిస్ మధ్య స్నేహం మూడు పువ్వులు - ఆరు కాయలు అన్నట్టుగా వుంది. మజ్లిస్ నేతలు కేసీఆర్ని పల్లెత్తు మాట కూడా అనకుండా చుప్ చాప్గా వున్నారు. కేసీఆర్ కూడా ముస్లిం అనుకూల ధోరణిని ప్రదర్శిస్తూ రాబోయే హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో అనుకున్నది సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ దశలోనే కేసీఆర్కి మజ్లిస్ నాయకులు షాక్లు ఇవ్వడం ప్రారంభించారు.
అయితే కొద్ది రోజులుగా తెలంగాణ ప్రభుత్వ విధానాల మీద మజ్లిస్ నేతలు కామెంట్లు చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కరెంటు సమస్య మీద తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నలతో ముంచెత్తడంతో టీఆర్ఎస్ నాయకులు కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ప్రణాళికల గురించి, ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం గురించి, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ లైన్ల ఏర్పాటు గురించి అక్బరుద్దీన్ ఘాటుగా ప్రశ్నలు సంధించారు. విద్యుత్ కొనుగోలుకు, ప్రాజెక్టుల ఏర్పాటుకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని ఆయన స్పష్టంగా ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ నుంచి మాత్రమే కాకుండా తమ మిత్రపక్షంగా భావిస్తున్న మజ్లిస్ నుంచి కూడా ఈ ప్రశ్నలు రావడం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఊహించని పరిణామం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ కొన్నప్పుడు ఆ ముందు జాగ్రత్త తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకు లేకుండా పోయిందన్న అక్బరుద్దీన్ ప్రశ్నకు సమాధానం దొరకలేదు. దీంతోపాటు మంగళవారం నాడు కూడా కేసీఆర్ ప్రభుత్వం మీద మజ్లిస్ దాడి కొనసాగింది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వే మీద మజ్లిస్ నాయకుడు విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో ఉన్న ఒక్క మిత్రపక్షమూ ఇలా ఎదురుదాడి చేయడంతో కేసీఆర్ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయింది.



.jpg)
.jpg)

.webp)



