భారత్‌మాతాకీ జై అనలేదని... ఎమ్మెల్యే సస్పెన్షన్‌!

posted on: Mar 17, 2016 11:01AM

 

మజ్లిస్‌ నేత అసదుద్దీన్ ఓవైసీ లేవనెత్తిన కొత్త వాదం ఇప్పడు రోజురోజుకీ పెను వివాదంగా మారుతోంది. ఇప్పటి తరానికి ‘భారత్‌ మాతాకీ జై’ అన్న నినాదాన్ని నేర్పించాలంటూ ఆరెస్సెస్‌ ముఖ్యుడు మోహన్‌ భగవత్‌ మాటలకు జవాబుగా, పీక మీద కత్తి పెట్టినా కూడా తాను ఆ నినాదాన్ని చేయబోనని అసదుద్దీన్‌ వ్యాఖ్యానించారు. అసదుద్దీన్‌ వ్యాఖ్యలు పార్లమెంటుని సైతం కుదిపివేశాయి. తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీని కూడా ఈ మాటల సెగ తాకింది. మజ్లిస్‌ పార్టీకి చెందిన ‘వారిస్‌ పఠాన్‌’ అనే ఎమ్మెల్యే, మహారాష్ట్ర అసెంబ్లీలో జరుగుతున్న ఓ చర్చ సందర్భంగా... తన ప్రాణం పోయినా కూడా ‘భారత్‌ మాతాకీ జై’ నినాదాన్ని చేయబోనని తేల్చిచెప్పారు. దీంతో అధికార బీజేపీ, శివసేన సహా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ఒక్కసారిగా పఠాన్‌ మీద విరుచుకుపడ్డాయి. సదరు ఎమ్మెల్యేను ప్రస్తుత సమావేశాల నుంచి బహిష్కరించాలని ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించాయి. మొత్తానికి తెలిసే కదిపారో, తెలియకుండా చేశారో కానీ... అసదుద్దీన్‌ ఓవైసీ మరో తేనెతుట్టుని కదిపారు. ఈ వివాదానికి జోడింపుగా మరెన్ని వార్తలను వినాల్సి వస్తుందో!

google-ad-img
    Related Sigment News
    • Loading...