బసవతారకం క్యాన్సర్ హాస్పటల్.. ఒక మహోన్నత మానవతా ఉద్యమం!

posted on: Jun 23, 2026 9:21AM

తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు  చేపట్టిన మానవతా ఉద్యమంలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన అధ్యాయం.  నాడు తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం తెలుగుదేశం పార్టీని ఒక గొప్ప ఆత్మగౌరవ ఉద్యమంగా  ముందుకు తీసుకువచ్చిన ఆయన సమాజంలో పేదరికంతో బాధపడుతున్న ప్రజలకు అత్యుత్తమ వైద్యం అందించాలనే సంకల్పంతో బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు.  తన జీవిత భాగస్వామి అనుభవించిన ఆ క్యాన్సర్ వేదనను మరే పేద కుటుంబం   అనుభవించకూడదన్న పట్టుదలతో ఎన్టీఆర్ ఈ ఆసుపత్రిని స్థాపించారు. అందుకే తెలుగుదేశం పార్టీ ఒక ఆత్మగౌరవ ఉద్యమమైతే, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఒక గొప్ప మానవతా ఉద్యమం.  

ఈ రెండు  సంస్థల స్థాపన వెనుక ఎన్టీఆర్  దూరదృష్టి, గొప్ప సేవా తత్వం దాగి ఉన్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి.. సిల్వర్ జూబ్లీ వేడుక సందర్భంగా మాట్లాడిన పెమ్మసాని.. గత పాతికేళ్లుగా ఈ ఆసుపత్రి లక్షలాది మంది క్యాన్సర్ బాధితుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపుతూ, ఒక కొండంత ఆశాకిరణంగా నిలుస్తోందన్నారు. మధ్యతరగతి ప్రజలకు   అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్నదే ఈ సంస్థ ప్రధాన లక్ష్యమన్న ఆయన.. నాటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి   ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి విచ్చేశారనీ,  అది నాడు ఎన్టీఆర్, నారా చంద్రబాబు నాయుడులపై ఉన్న అపార గౌరవానికి నిదర్శనమనీ చెప్పారు. ఆస్తులకు వారసులు ఎందరో ఉంటారు కానీ..  తల్లిదండ్రుల మహోన్నత ఆశయాలకు వారసులు కొందరే ఉంటారు. ఆ ఆశయాలను అకుంఠిత దీక్షతో కొనసాగిస్తున్నారు  నందమూరి బాలకృష్ణ అని పెమ్మసాని చంద్రశేఖర్  ప్రశంసించారు.

ఒక చిన్న మొక్కగా ప్రారంభమైన ఈ సేవా క్షేత్రం నేడు ఒక మహా వృక్షంగా మారింది. కేవలం 100 పడకలతో  మొదలైన   బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, నేడు ఏకంగా 650 పడకల భారీ స్థాయికి ఎదగడం   గర్వకారణం. నేటి కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీతో పోలిస్తే..  ఇక్కడ ఏకంగా 40 శాతం తక్కువ వ్యయంతోనే రోగులకు అత్యుత్తమ,  అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్య సేవలు అందుతున్నాయి. కేవలం గొప్ప ఆలోచనలు ఉంటే సరిపోదు, దానికి పటిష్టమైన కార్యాచరణ తోడైనప్పుడే అది తరతరాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఈ ప్రయాణం నిర్ద్వంద్వంగా నిరూపించిందని పెమ్మసాని చెప్పారు. 

హైదరాబాద్ లో  హైటెక్ సిటీ అభివృద్ధి చెందినా, బయోటెక్నాలజీ రంగం విస్తరించినా, ఐఐటీ మరియు ట్రిపుల్ ఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు అంతర్జాతీయ గుర్తింపు సాధించినా.. అవన్నీ యాదృచ్ఛికంగా జరిగినవి కావు. అప్పడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు చూపించిన అద్భుతమైన దార్శనికత, నిరంతర పర్యవేక్షణ, అంకితభావానికి   సజీవ సాక్ష్యాలన్నారు. నేడు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలను జరుపుకోవడం తెలుగువారందరికీ ఒక పండుగ లాంటిది. రాబోయే రోజుల్లో కూడా ఈ సంస్థ మరింత మంది ప్రాణాలను రక్షించి, మానవత్వానికి నిలువెత్తు రూపంగా నిలవాలని  పెమ్మసాని ఆకాంక్షించారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...