Latest News

ఎల్పీజీ 10 కేజీల సిలిండర్లపై కేంద్రం క్లారిటీ

posted on: Mar 23, 2026 7:26PM

 

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు దేశంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై ప్రభావం చూపుతున్నాయన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో, గ్యాస్ పొదుపు చర్యలపై ప్రభుత్వ రంగ చమురు సంస్థలు దృష్టి సారించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. గృహ వినియోగదారులకు సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండేందుకు పలు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం.

ఈ క్రమంలోనే ప్రస్తుతం వినియోగంలో ఉన్న 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ల స్థానంలో 10 కిలోల గ్యాస్‌తో సిలిండర్లను సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఈ విధానంతో అందుబాటులో ఉన్న గ్యాస్ నిల్వలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని భావించినట్టు కథనాలు సూచించాయి. అయితే ఇందుకు ప్రభుత్వ అనుమతులు అవసరమేకాకుండా, బాట్లింగ్ ప్లాంట్లలో సాంకేతిక మార్పులు కూడా అవసరమవుతాయని పేర్కొన్నారు.

ఇక యుద్ధ పరిస్థితులు కొనసాగితే వచ్చే నెలల్లో గ్యాస్ కొరత మరింత పెరిగే అవకాశముందన్న అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో గల్ఫ్ దేశాల నుంచి ఇటీవల రెండు నౌకల ద్వారా సుమారు 92,700 టన్నుల ఎల్పీజీ భారత్‌కు చేరుకున్నట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాస్ వినియోగంలో పొదుపు అవసరమని పెట్రోలియం శాఖ అధికారులు సూచిస్తున్నారు.

అయితే 14.2 కిలోల సిలిండర్లను 10 కిలోలకు తగ్గించే నిర్ణయం తీసుకున్నారన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఈ అంశంపై స్పందించిన పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ, అలాంటి ప్రతిపాదనలపై ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ప్రచారంలో ఉన్న వార్తలు ఊహాగానాలేనని పేర్కొన్నారు. దీంతో గ్యాస్ సిలిండర్ బరువు తగ్గింపు అంశంపై వస్తున్న వార్తలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టైంది. ప్రస్తుతం గృహ వినియోగదారులకు యథావిధిగా 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్లే సరఫరా కొనసాగనున్నాయి.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...