Latest News
పశ్చిమాసియా ఉద్రిక్తతలు...చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం
posted on: Mar 13, 2026 6:18PM

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలకమైన హర్మూజ్ జలసంధి ద్వారా చమురు, సరకు రవాణా నిలిచిపోవడం ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతోంది. అమెరికా–ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఈ మార్గంలో నౌకల రాకపోకలను అడ్డుకుంటుండటంతో వందలాది చమురు ట్యాంకర్లు సముద్రంలోనే నిలిచిపోయాయి. ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించే ఈ మార్గం ద్వారా రోజుకు సుమారు రెండు కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది.
రవాణా నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 119 డాలర్లకు పైగా చేరింది. హర్మూజ్ మార్గం త్వరగా పునఃప్రారంభం కాకపోతే సరఫరా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలు గల్ఫ్ దేశాల నుంచి ఎల్ఎన్జీపై అధికంగా ఆధారపడుతున్న నేపథ్యంలో ఈ సంక్షోభం ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది.






