ఎస్ క్యూబ్(S³).. లోకేష్ సక్సెస్ ఫార్ములా!

posted on: Jun 23, 2026 2:25PM

జాతీయ రాజకీయ యవనికపై  ఏపీ మంత్రి మంత్రి నారా లోకేష్ తనదైన ముద్ర వేశారు. వేస్తున్నారు.  రిపబ్లిక్ మీడియా నెట్‌వర్క్ 'నేషన్ ఫస్ట్' అనే  థీమ్‌తో హస్తిన వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జాతీయ సదస్సులో   షేపింగ్ పవర్ గా ఇండియా  అనే  ప్యానెల్ చర్చలో  పాల్గొన్న నారా లోకేష్ ప్రపంచలొ ఇండియాను అగ్రస్థాయి ఆర్థిక శక్తిగా నిలపాలనే ప్రధాని నరేంద్ర మోదీ విశ్వగురు విజన్‌కు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా తోడ్పడుతోందో కళ్లకు కట్టారు. పెట్టుబడిదారులను ఆకర్షించడంలో, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న S³.. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ ఫార్ములాను ఆయన ఈ వేదికపై  ప్రకటించారు.

ఈ సదస్సులో జాతీయ మీడియా ప్రతినిధులు సంధించిన  క్లిష్టమైన ప్రశ్నలను  లోకేష్  తనదైన శైలిలో ఎదుర్కొని పరిణితితో సమాధానాలు ఇచ్చారు.   కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మంది ఎంపీల బలం ఉండటం వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నిధులు, ప్రాజెక్టులు దక్కుతున్నాయా?  అన్న ప్రశ్నకు ఆయన.. కేంద్ర ప్రభుత్వం పాలసీలు లేదా ప్రాజెక్టులను ఏ ఒక్కరి కోసమో కాకుండా దేశ ప్రజలందరి కోసమే ప్రవేశపెడుతుందని బదులిచ్చారు. అయితే..  ఆ ప్రాజెక్టులను అందుకోవడంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగంగా, సానుకూలంగా స్పందిస్తుందనే దానిపైనే వాటి రాక ఆధారపడి ఉంటుందని చెప్పారు. 

ఈ విషయానికి సంబంధించి లోకేష్ ఇచ్చిన ఉదాహరణకు ప్యానెల్ సభ్యులు సైతం ఫిదా అయ్యారు.   కేంద్ర రక్షణ శాఖకు సంబంధించిన ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ వస్తోందని సమాచారం అందగానే, మిగతా రాష్ట్రాలు ఇంకా ఆ దిశగా ఆలోచించకముందే ఆంధ్రప్రదేశ్ అత్యంత వేగంగా స్పందించిందన్న లోకేష్..  ఎక్కడా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా, కేవలం 37 రోజుల్లోనే ఏకంగా 600 ఎకరాల భూమిని ఆ ప్రాజెక్ట్ కోసం కేటాయించామనీ. . ఈ స్థాయి వేగం వల్లే రక్షణ శాఖ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ సొంతమైందన్నారు. ఇ ఈ వేగం కేవలం ఏపీ వృద్ధికే కాకుండా, చైనాకు ప్రత్యామ్నాయంగా గ్లోబల్ సప్లై చైన్‌లో భారతదేశాన్ని నిలబెట్టడానికి ఎంతో అవసరమని  ఉద్ఘాటించారు.

ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో తీసుకొస్తున్న విప్లవాత్మక డిజిటల్ సంస్కరణల గురించి లోకేష్ మాట్లాడినప్పుడు సదస్సులోని వారంతా సంభ్రమాశ్చర్యాలో అభినందనలు కురిపించారు. . కార్పొరేట్ సంస్థల నిర్వహణ తరహాలోనే తాము ప్రభుత్వ స్కూళ్లలో టెక్నాలజీని వాడుతున్నామన్న లోకేష్..   తాను అమరావతిలోని తన ఛాంబర్‌లో కూర్చొని డిజిటల్ స్క్రీన్ల ద్వారా రాష్ట్రంలోని ఏ స్కూల్‌లో ఏ టీచర్‌కు, ఏ విద్యార్థికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో రియల్ టైమ్‌లో పర్యవేక్షించగలనన్నారు. ఈవిధానాల వల్లే ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెరిగిందన్న లోకేష్.. ఇటీవలి కాలంలో ఏకంగా 85 వేల మంది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లను వదిలి ప్రభుత్వ స్కూళ్లలో చేరడం ఒక చారిత్రాత్మక రికార్డు అని  వెల్లడించారు. ప్రైవేటు విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా నాణ్యమైన విద్యను, డిజిటల్ మౌలిక వసతులను తాము అందిస్తున్నామని చెప్పారు.

ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నమైన రాజధాని అమరావతి నిర్మాణ కాలపరిమితిపై జాతీయ వేదిక నుంచి లోకేష్  క్లారిటీ ఇచ్చారు.  2028 సంవత్సరానికల్లా అమరావతిలో ప్రధాన ప్రభుత్వ భవనాలన్నింటినీ ప్రారంభించి తీరుతామన్నారు. సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు భవనాలను అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని చెప్పారు. అమరావతిని కేవలం ఒక పరిపాలనా నగరంగానే కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక తిరుగులేని ఎకనామిక్ పవర్‌హౌస్‌గా మార్చాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారుజ జాతీయ స్థాయిలో లోకేష్ ప్రదర్శించిన   ప్రసంగ పటిమ, స్పష్టమైన రోడ్‌మ్యాప్ భవిష్యత్ జాతీయ రాజకీయాల్లో ఆయన కీలక పాత్రను పోషించబోతున్నారన్న బలమైన సంకేతాలను ఇచ్చింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...