Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...యువతను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దుతాం : నారా లోకేష్
posted on: May 28, 2026 5:46PM

జెన్-జీతో లోకేష్ ఆత్మీయ భేటీ..యువతకు దిశానిర్దేశం..
యువత అంకితభావం, సమష్టి కృషి, త్యాగం అలవర్చుకోవాలని టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, విద్యా-ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. మహానాడు సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో జెన్-జీ యువతతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయాలు, సోషల్ మీడియా, మహిళా సాధికారత వంటి పలు అంశాలపై యువత అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్రానికి ఏఐ, క్వాంటం టెక్నాలజీలు వంటి ఆధునిక రంగాలు వస్తున్నాయని, మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు అవసరమని లోకేష్ తెలిపారు. ఉన్నత విద్యలో ఇప్పటికే పెద్దఎత్తున సంస్కరణలు తీసుకువచ్చామని చెప్పారు.
పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి క్లస్టర్ ఆధారిత విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 పారిశ్రామిక క్లస్టర్లను గుర్తించామని, డేటా, ఐటీ, క్వాంటం, ఆటోమోటివ్, రెన్యూవబుల్ ఎనర్జీ వంటి రంగాల్లో ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
ప్రధాన పరిశ్రమలతో పాటు అనుబంధ యూనిట్లను ఒకేచోట ఏర్పాటు చేసి బలమైన ఎకోసిస్టమ్ను నిర్మిస్తున్నామని తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యవంతులైన మానవ వనరులను తయారు చేయడానికి స్కిల్ డెవలప్మెంట్పై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు.
రాష్ట్రానికి ఇప్పటివరకు రూ.23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని, గూగుల్, ఆర్సెలార్ మిట్టల్, రిలయన్స్ వంటి సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని పేర్కొన్నారు. వచ్చిన అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని, యువతను నైపుణ్యం కలిగిన మానవ వనరులుగా తీర్చిదిద్దుతామని అన్నారు. “ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని.. అభివృద్ధి వికేంద్రీకరణ” మా ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు.
ఫేక్ కంటెంట్పై అప్రమత్తంగా ఉండాలి
సోషల్ మీడియాలో ఫేక్ కంటెంట్ విస్తృతంగా వ్యాప్తి చెందుతోందని, యువత అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. డీఎస్సీపై ప్రతిపక్ష నేతలు నిరాధార ఆరోపణలు చేసి యువతను ఆందోళనకు గురిచేశారని విమర్శించారు.
ప్రభుత్వం పారదర్శకంగా 150 రోజుల్లో డీఎస్సీ ప్రక్రియను పూర్తిచేసిందని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని యువత క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలని సూచించారు.
విజయం కోసం కష్టపడాలి
తమకు నచ్చిన రంగంలో విజయాన్ని సాధించాలంటే యువత కలిసికట్టుగా పనిచేయాలని లోకేష్ అన్నారు. “నేను టీమ్వర్క్ను విశ్వసిస్తాను. కొన్ని త్యాగాలు కూడా చేయాలి. బాబు గారితో పోటీ పడాలంటే ఆయనకంటే ఎక్కువ కష్టపడాలి” అని చెప్పారు.
“ఈరోజు నేను సాధించిన విజయానికి కోటిమంది కార్యకర్తలే కారణం. అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టకూడదు” అని యువతకు సూచించారు.
ప్రజాసేవే తన పాషన్ అని, ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో నెంబర్వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. “విజయానికి షార్ట్కట్స్ ఉండవు. కష్టపడటమే మార్గం” అని స్పష్టం చేశారు.
అమరావతి, విశాఖ, రాయలసీమ అభివృద్ధి గురించి కూడా దేశం మాట్లాడుకునేలా చేయాలని ఆకాంక్షించారు.
యువత రాజకీయాల్లోకి రావాలి
యువత రాజకీయాల్లోకి రావాలని లోకేష్ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ యువతకు అనేక అవకాశాలు కల్పిస్తోందని చెప్పారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు కూడా పొలిట్బ్యూరో సభ్యుడిగా ఎదగాలనే లక్ష్యంతో వ్యవస్థను నిర్మిస్తున్నామని తెలిపారు.
పాదయాత్రలో ఎదురైన ఇబ్బందులను గుర్తుచేసుకుంటూ, “నా స్టూల్ లాక్కున్నారు.. మైక్ లాక్కున్నారు.. ప్రతిరోజూ పోరాటమే” అన్నారు. 2019లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయానని, కానీ భయపడకుండా ముందుకు సాగడంతో 2024లో 91 వేల మెజార్టీతో గెలిచానని చెప్పారు. “ఆ రోజు భయపడి ఉంటే ఈ విజయం సాధ్యమయ్యేది కాదు” అన్నారు.
పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమని, ఒక్క పరీక్ష జీవితాన్ని నిర్ణయించదని విద్యార్థులు గుర్తించాలన్నారు. విద్యార్థులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
మహిళా సాధికారతకు మద్దతు
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అందరూ కలిసి పనిచేయాలని లోకేష్ పిలుపునిచ్చారు. మహిళా సాధికారత ప్రతి ఇంటి నుంచే ప్రారంభమవ్వాలని చెప్పారు. తమ కుటుంబంలో తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి ఈ విషయంలో స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు.
యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ ఏకైక అజెండా అని తెలిపారు. రాష్ట్రానికి రాయల్ ఎన్ఫీల్డ్ ఎంత ముఖ్యమో, పచ్చళ్లు తయారు చేసే చిన్న కంపెనీ కూడా అంతే ముఖ్యమని అన్నారు. ఎంఎస్ఎంఈల ద్వారా ఎక్కువ ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కేఎల్ యూనివర్సిటీ విద్యార్థి వేమూరి సాత్విక్, విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీకి చెందిన చరణ్ యాదవ్, సత్యసాయి పవన్ కుమార్, అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విద్యార్థిని ఖ్యాతి వర్థిని తదితరులు పాల్గొన్నారు.






