లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డిని 8 గంటలు విచారించిన సిట్

 

ఏపీలో మద్యం కుంభకోణం కేసులో వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిపై సిట్‌ అధికారుల విచారణ  ముగిసింది. విజయవాడ సిట్ ఆఫీసులో మిథున్‌రెడ్డిని దాదాపు 8 గంటల పాటు సిట్‌  అధికారుల బృందం విచారించింది. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసి సంతకాలు తీసుకుంది. వివిధ అంశాలపై ఆరా తీసిన అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై మరోసారి ఆయన్ను పిలిచే అవకాశముంది. లిక్కర్ పాలసీ రూపకల్పన, మిథున్‌రెడ్డి ప్రమేయం, డిస్టిలరీ నుంచి ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మద్యం కొనుగోళ్లపై సుదీర్ఘంగా ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. రాజ్‌ కసిరెడ్డికి చెందిన ఆడాన్‌ డిస్టిలరీ, డికార్ట్‌ నుంచి ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎంతమేర కొనుగోళ్లు చేసిందని ప్రశ్నించినట్లు సమాచారం. 

రాజ్‌ కసిరెడ్డి, ఆయన అనుచరులు చాణక్య రాజ్‌, అవినాష్‌రెడ్డిలతో మిథున్‌రెడ్డికి ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీల గురించి విజయవాడ సీపీ, సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు ప్రశ్నించారు. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇంట్లో 2 దఫాలుగా జరిగిన చర్చలపై మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ అనంతరం మళ్లీ విచారణ కొనసాగించారు. హైకోర్టు ఆదేశాల మేరకు న్యాయవాది సమక్షంలో మిథున్‌ రెడ్డిని సిట్‌  ప్రశ్నించారు. ఈ సందర్భంగా రాజ్‌ కసిరెడ్డి, అవినాష్‌ రెడ్డి, చాణక్యరాజ్‌లతో సంభాషణలపై అతడిని ఆరా తీసినట్లు తెలిసింది. లిక్కర్ పాలసీపై జరిగిన సంభాషణలపైనా ప్రశ్నలు వేసినట్లు సమాచారం. విజయసాయిరెడ్డి వెల్లడించిన వివరాల ఆధారంగా మిథున్‌రెడ్డిని సిట్‌ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం మిథున్ రెడ్డి నుంచి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసి, దానిపై ఆయన సంతకాన్ని తీసుకున్నారు