Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఈ శాంతి రేఖ.. పెనుముప్పునకు సంకేతమేనా?
posted on: Apr 18, 2026 2:01PM

పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ప్రస్తుతం కనిపిస్తున్న శాంతి ప్రయత్నాలు అత్యంత సున్నితమైన దశలో ఉన్నాయి. ఇప్పుడున్న ప్రశాంతతను శాశ్వత శాంతిగా భావించడం కంటే, ఒక పెద్ద ప్రమాదానికి ముందు దొరికిన చిన్న విరామంగానే అంతర్జాతీయ విశ్లేషకులు పరిగణిస్తున్నారు. సైనిక పరంగా పరస్పరం పైచేయి సాధించాలనే పట్టుదల, దేశీయంగా తమ ప్రతిష్టను కాపాడుకోవాలనే రాజకీయ నాయకత్వాల ఆకాంక్ష, అగ్రరాజ్యాల వ్యూహాత్మక ప్రయోజనాలు ఈ సంక్షోభాన్ని మరింత సంక్లిష్టంగా మారుస్తున్నాయి. ఈ మూడు అంశాల ఒత్తిడి వల్ల ప్రస్తుతం జరుగుతున్న శాంతి ప్రయత్నాలు ఏ క్షణమైనా నీరుగారిపోయే అవకాశం ఉంది.
ఇజ్రాయెల్, లెబనాన్ సరిహద్దుల్లో అమలులోకి వచ్చిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒక ఆశావహ పరిస్థితిని ఆవిష్కరించినప్పటికీ, ఇది కేవలం ఒక చిన్న రాజకీయ అవకాశంగానే కనిపిస్తోంది తప్ప ఉద్రిక్తతలను చల్లార్చే శాశ్వత పరిష్కారంగా ఎంత మాత్రం స్థిరపడే అవకాశం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
హిజ్బుల్లా వద్ద ఉన్న డ్రోన్లు, రాకెట్ల సామర్థ్యం, అలాగే ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దు భద్రత విషయంలో పడుతున్న ఆందోళనలు ఈ సంధి ద్వారా పరిష్కారం కాలేదు. కాలేవు. దౌత్యపరమైన చర్చలకు కొంత సమయం దొరికిన మాట వాస్తవమే అయినా, ఇరుపక్షాల సైనిక సమీకరణల్లో గానీ, వారి యుద్ధ ఉద్దేశాల్లో గానీ ఎటువంటి మార్పు రాలేదని నిపుణులు అంటున్నారు. ఇది కేవలం ఒక ఎత్తుగడలో భాగంగా తీసుకున్న విరామమే తప్ప, శాశ్వత పరిష్కారం కాదని క్షేత్రస్థాయి పరిస్థితులును గమనిస్తే విస్పష్టంగా అవగతమౌతుంది.
ఇక మరోవైపు, అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న దౌత్య చర్చలు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్లుగానే కనిపిస్తున్నాయి. ఇరాన్ ప్రస్తుతం పాత అణు ఒప్పందం కంటే.. కొన్ని మినహాయింపులతో కూడిన మధ్యంతర ఒప్పందానికి మొగ్గు చూపుతోంది. ఆర్థికంగా ఊపిరి పీల్చుకోవడానికి ఆంక్షల సడలింపు కోరుకుంటూనే, తన అణు కార్యక్రమాలను పూర్తిగా వదులు కోవడానికి సిద్ధంగా లేదన్న సంకేతాలిస్తోంది. అయితే.. అమెరికా ఒకవైపు చర్చల తలుపులు తెరిచి ఉంచుతూనే, మరోవైపు సైనిక చర్య ఆప్షన్ సిద్ధంగా ఉందని ప్రకటించడం ఇరు దేశాల మధ్య విశ్వాసలేమిని సూచిస్తోంది. ఈ ట్రస్ట్ డెఫిసిట్ .. అంటే విశ్వాసలేమి కారణంగా చర్చల టేబుల్ మీద కూడా యుద్ధపు నీడల పడగలు కనిపిస్తున్నాయి.
ఈ మొత్తం సంక్షోభంలో హోర్ముజ్ జలసంధి ఇరాన్ చేతిలో ఒక శక్తివంతమైన అస్త్రంగా మారింది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ఈ మార్గాన్ని అడ్డుపెట్టుకుని ఇరాన్ తన వ్యూహాలను రచిస్తోంది. నౌకల రాకపోకలకు స్వేచ్ఛ ఉంటుందని చెబుతూనే, కొన్ని షరతులను జోడించడం ద్వారా అమెరికా మరియు గల్ఫ్ దేశాలపై ఒత్తిడి పెంచుతోంది. ఈ ప్రాంతంలో చిన్నపాటి అలజడి రేగినా ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. తద్వారా తనపై ఒత్తిడి పెంచితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తాననే బలమైన హెచ్చరిక ఇరాన్ చేస్తున్నది.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమ తమ ప్రయోజనాల కోసం సమయ కొనుగోలు ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇజ్రాయెల్ తన భద్రతను కాపాడుకుంటూనే.. ప్రజల ముందు బలహీనంగా కనిపించకూడదనే ఒత్తిడిలో ఉంది. అమెరికా యుద్ధాన్ని నివారించాలని చూస్తున్నా, తన ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని తాపత్రేయపడుతోంది. లెబనాన్ వంటి దేశాలు తమ భూభాగం రణరంగం కాకూడదని కోరుకుంటున్నాయి. హిజ్బుల్లా వంటి గ్రూపులపై వాటికి పూర్తి నియంత్రణ లేదు. ఇలాంటి భిన్నమైన అజెండాలు, గందరగోళ ప్రకటనల వల్ల క్షేత్రస్థాయిలో ఉన్న సైనిక కమాండర్లు తప్పుడు అంచనాలు వేసే అవకాశం ఉంది. చిన్న పొరపాటు జరిగినా అది మహా యుద్ధానికి దారితీసే ప్రమాదం పొంచి ఉంది. తాత్కాలిక విరామం.. పెను ఉత్పాతానికి దారితీసే ప్రమాదం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
-సీతారామ కంఠమనేని


.webp)



