పులి పోయి చిరుత వచ్చే!
posted on: Feb 10, 2026 3:21PM

ఆంధ్రప్రదేశ్ లో వన్యప్రాణుల భయం తొలగడం లేదు. రాష్ట్రంలో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలనూ దాదాపు పక్షం రోజుల పాటు హడలెత్తించిన పులి సంచారం నుంచి బయటపడ్డామని రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకునేలోగానే సత్యసాయి జిల్లాలో చిరుత స్వైర విహారం మొదలైంది.
మడకశిర మండలం ఎల్లోటి గ్రామ పరిసరాల్లో చిరుత సంచారంతో జనం భయంతో వణికి పోతున్నారు. ఎల్లోటి గ్రామ సమీపంలోని ఓ పొలంలో జింక కళేబరం కనిపించడంతో చిరుత సంచారం వెలుగులోకి వచ్చింది. ఆ ప్రాంతానికి వచ్చి పరిశీలించిన అటవీ అధికారులు చిరుత సంచారాన్ని ధృవీకరించారు.
అంతకు ముందు కూడా గ్రామంలో మేక, కుక్కలపై చిరుత దాడి చేసి చంపేసిన సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా పిల్లలను బయటకు పంపొద్దని సూచించారు. చిరుతను సాధ్యమైనంత త్వరగా బంధించాలని గ్రామస్థులు కోరుతున్నారు.






