దిగ్గజ దర్శకుడు భారతీరాజా ఇక లేరు

posted on: Jun 10, 2026 9:05AM

చలనచిత్ర రంగంలో, ముఖ్యంగా దక్షిణాది సినిమాలలో అద్భుత దర్శకుడిగా గుర్తింపు పొందిన భారతీరాజా కన్నుమూశారు. ఆయన వయస్సు 84 ఏళ్లు.  గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని తన నివాసంలో బుధవారం (జూన్ 10) ఉదయం తుదిశ్వాస విడిచారు.  దక్షిణాది సినిమాల కొత్త ట్రెండ్‌ సెట్ చేసిన దిగ్గజ దర్శకుడు, నటుడు భారతీరాజా  మరణవార్త వినగానే   సినీ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.  

గత ఏడాది మార్చిలో  భారతీరాజా కుమారుడు, నటుడు మనోజ్ భారతీరాజా  గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. ఆ పుత్రశోకం భారతీరాజాను మానసికంగా తీవ్రంగా కుంగదీసింది. అప్పటినుంచి ఆయన వయోభారంతో పాటు తీవ్ర మానసిక ఒత్తిడి, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడ్డారు. గత కొన్ని నెలలుగా పలుమార్లు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందినప్పటికీ..  పరిస్థితి విషమించడంతో బుధవాంరం (జూన్ 10) ఉదయం ఆయన కన్నుమూశారు.

1941 జూలై 17న తమిళనాడులోని తేని సమీపంలో ఉన్న అల్లినగరం అనే పల్లెటూరిలో  జన్మించిన భరతీరాజా అసలు పేరు చిన్నసామి. సినిమాపై ఉన్న ఆసక్తితో పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన.. 1977లో వచ్చిన '16 వయతినిలే' అనే చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. అంతవరకు స్టూడియోల నాలుగు గోడల మధ్య, సెట్టింగుల మధ్య నడిచే సినిమాలను ఈ సినిమాతో ఆయన ఒక్కసారిగా అవుట్‌డోర్‌కు, అచ్చమైన పల్లెటూరి వాతావరణంలోకి తీసుకెళ్లారు.   శ్రీదేవి, రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి స్టార్స్‌కు ఈ సినిమా కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రాన్ని తెలుగులో 'పదహారేళ్ల వయసు' పేరుతో రీమేక్ చేయగా ఇక్కడా ఘన విజయం సాధించింది. 

భారతీరాజా కేవలం తమిళ చిత్రపరిశ్రమకే  పరిమితం కాలేదు, తెలుగు ప్రేక్షకులకు కూడా ఎన్నో అద్భుతమైన క్లాసిక్ చిత్రాలను అందించారు.  తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన  సీతాకోకచిలుక' చిత్రం ఒక సంచలనం. ఈ సినిమాకు గాను ఆయనకు జాతీయ పురస్కారంతో పాటు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు కూడా లభించింది. అలాగే.. చిరంజీవి హీరో  ఆరాధన,  కృష్ణ హీరోగా జమదగ్ని చిత్రాలకు ఆయనే దర్శకుడు. అలాగే.. నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో ఇండస్ట్రీ హిట్ అయిన  మంగమ్మ గారి మనవడు చిత్రానికి మూలకథ అందించింది కూడా భారతీరాజాయే. అలాగే 1994లో వచ్చిన  పల్నాటి పౌరుషం' సినిమాకు ఆయనే స్క్రీన్‌ప్లే అందించారు.  

దర్శకుడిగానే కాకుండా నటుడిగా, నిర్మాతగా కూడా భారతీరాజా తనదైన ముద్ర వేశారు. మణిరత్నం దర్శకత్వం వహించిన  ఆయుధ ఎళుతు  (తెలుగులో  యువ) చిత్రంలో ఆయన పోషించిన రాజకీయ నాయకుడి పాత్ర అందరినీ మెప్పించింది. అలాగే  కార్తీక్, రాధ, రేవతి వంటి ఎందరో నటీనటులను, సాంకేతిక నిపుణులను వెండితెరకు పరిచయం చేశారు భారతీ రాజా. ఐదు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో ఆయన దాదాపు 40కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. భారతీయ చలనచిత్ర రంగానికి భారతీరాజా చేసిన అసమాన సేవలకు గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన్ను ఎన్నో అవార్డులతో సత్కరించాయి

google-ad-img
    Related Sigment News
    • Loading...