నాయకులు బాగుపడ్డారు.. ప్రజలు నష్టపోయారు: కుల రాజకీయాలపై పవన్ షాకింగ్ కామెంట్స్

posted on: Jun 4, 2026 10:16AM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులాల పేరుతో జరుగుతున్న విద్వేష రాజకీయాలపై డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కుల సంఘాలు ఏర్పాటు చేసుకుని వాటి  ద్వారా కొందరు నాయకులు మాత్రమే బాగా బాగుపడ్డారని, ఆయా కులాల్లోని సామాన్య ప్రజలు మాత్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా తీవ్రంగా నష్టపోతున్నారనిఅన్నారు.  అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు వంటి మహనీయుడిని సైతం నేడు ఒకే ఒక్క కులానికి పరిమితం చేసే దుస్థితి మన రాష్ట్రంలో నెలకొందన్న పవన్ కల్యాణ్..  కులాల పేరుతో సమాజాన్ని విడదీసే ఈ దుర్మార్గపు రాజకీయాలకు ఎక్కడో ఒకచోట చరమగీతం పాడాలని  పిలుపునిచ్చారు. కులాల ఐక్యతే  జనసేన పార్టీ మూల సిద్ధాంతమన్నారు.

  వైసీపీ  హయాంలో కుల రాజకీయాలు, ఒకరినొకరు కులం పేరుతో దూషించుకునే సంస్కృతి పరాకాష్టకు చేరిందని విమర్శించిన పవన్ కల్యాణ్..  నిజానికి 1998 నుంచే ఈ తరహా కుల ధోరణులు మొదలైనప్పటికీ,   వైసీపీ పాలనలో ఆ ధోరణులు పీక్స్ చేరుకున్నాయనీ,  జర్నలిస్టులను సైతం కులం పేరుతో బహిరంగంగా దూషించే స్థాయికి పరిస్థితులు వచ్చాయని విమర్శించారు. గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని దారుణమైన ఘటనలను పవన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ఒక అధికార పార్టీ ఎమ్మెల్సీ, దళిత యువకుడిని దారుణంగా హత్య చేసి, ఆ మృతదేహాన్ని ఏకంగా డోర్ డెలివరీ చేసినా అప్పటి పాలకులు హంతకుడిని వెనకేసుకొచ్చారన్నారు. అంత పెద్ద దారుణం జరిగినా దళిత సంఘాలు సైతం భయంతో మాట్లాడలేని నిరంకుశ పరిస్థితిని సృష్టించారనీ,  అదేవిధంగా..  కరోనా మహమ్మారి సమయంలో కేవలం నిజాలు మాట్లాడినందుకు డాక్టర్ సుధాకర్‌ను మానసికంగా తీవ్రంగా హింసించి, ఆయన మరణానికి కారణమైనప్పుడు ఏ కుల సంఘాలూ నోరు మెదపలేదని దుయ్యబట్టారు. ఇలాంటి ఘోరాలు జరిగినప్పుడు కుల సంఘాల నాయకులు మౌనంగా ఉండిపోవడం వల్లే ఆయా నాయకులు రాజకీయంగా లబ్ధి పొందుతున్నారని, కానీ ప్రజలు మాత్రం తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. 

మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వంటి మహనీయులు కలలుగన్న కుల నిర్మూలన అనే ఆశయం నేటి రోజుల్లో పూర్తిగా సాధ్యమో కాదో తెలియదు కానీ..  కులాల మధ్య కనీస ఐక్యత, పరస్పర సహకారం ఉండటం నేటి సమాజానికి అత్యంత అవసరమని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈ విచ్ఛిన్నకర కుల రాజకీయాలకు ముగింపు పలకాలని తమ   ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుందని తెలిపారు.  ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో కులాల ఐక్యతను చాటుతూ, కేవలం అభివృద్ధి, ప్రజా సంక్షేమం ఆధారంగానే రాజకీయాలు సాగుతాయని, ఇందుకు జనసేన నాయకత్వం  కట్టుబడి ఉందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...