TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పాపం అభిమానులు

Published on: Mon Nov 28, 2011 11:43AM

మన సినీ హీరోలను అభిమానించే వారికి కొదువలేదు...కొందరైతే తమ అభిమాన హీరో కోసం బుర్రలు పగల కొట్టారు...అలాగే తమ బుర్రలు పగల కొట్టించుకున్నారు కూడా. ఇంతా చేస్తే వారి అభిమాన హీరో వీరికి ఏం చేస్తాడని బేరీజు వేస్తే కనిపించేది శూన్యమే. అభిమానుల వెర్రి అభిమానం గురించి "నేనింతే" సినిమాలో దర్శకుడు పూరీ జగన్నాథ్ తన తమ్ముడు సాయిరాం శంకర్ నటించిన పాత్ర ద్వారా సవివరంగా చర్చించాడు. తమ అభిమాన హీరోల సినిమా రికార్డుల గురించి పడేపాట్లు, తమ వాదనే సరి అయ్యిందని బలంగా, అంతే అమాయకత్వంతో కట్టుబడే అభిమానులకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి.

కొత్తొక వింత పాతొక రోత అన్నారు పెద్దలు. అలాగే కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు కొట్టుకుపోతుంది...అది కాలధర్మం. ఈ రోజున ఈ అభిమానులు "పోకిరి" రికార్డులు సృష్టించిందనీ, దాన్ని "మగధీర" క్రాస్ చేసిందనీ, మళ్ళీ దాన్ని "దూకుడు" అధిగమించిందనీ గొడవలు పడుతూంటే వీళ్ళ అమాయకత్వానికి జాలేస్తుంది.

నిజానికి "లవకుశ" చిత్రం విడుదలయినప్పుడు నేల 5 పైసలు, బెంచీ 10 పైసలు, కుర్చీ 15 పైసలు, బాల్కనీ 25 పైసలు. టిక్కెట్ల రేట్లు అలా ఉన్నప్పుడే ఆ రోజుల్లో ఆ చిత్రం కోటి రూపాయలు వసూలు చేసింది...! ప్రస్తుతం టిక్కెట్టు రేట్లు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే...! మా సినిమా రికార్డులు క్రియేట్ చేసిందంటే మా సినిమా రికార్డులు క్రియేట్ చేసిందని చెప్పుకునే వాళ్ళకి ఏం చెప్పాలి. వారి అమాయకత్వానికి జాలిపడటం తప్ప ఏం చేయగలం చెప్పండి...?