Latest News

దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుమార్తెలకు రోడ్డు ప్రమాదం

posted on: Mar 23, 2026 4:10PM

 

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌పై నిన్న ఆదివారం రాత్రి సమయంలో చోటుచేసుకున్న ఈ రోడ్డు ప్రమాదం నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుమార్తెలు ప్రయాణిస్తున్న కారు ముందున్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టడంతో పలువురు గాయపడ్డారు. వారిలో ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మార్చి 22న రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో రిజిస్ట్రేషన్ నంబర్ TS05EP0001 గల టోయోటా ఫార్చ్యూనర్ కారులో నలుగురు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గచ్చిబౌలి వైపు ప్రయాణిస్తున్నారు. కారును దుర్గా సాయి ఆరేకపూడి (20) నడుపుతుండగా, కారులో మాగంటి అక్షిర నాగ (23), మాగంటి దిషిర (19), మేడిపల్లి అభిరామ్ రెడ్డి (21) ప్రయాణిస్తున్నారు.

 

 

వీరు నార్సింగి పరిధిలోని టీజీపీఏ జంక్షన్ సమీపానికి చేరుకున్న సమయంలో, వారి ముందు వెళ్తున్న డీసీఎం వాహనానికి చెందిన వెనుక టైర్ అకస్మాత్తుగా ఊడిపోయింది. దీంతో ఆ వాహనం ఒక్కసారిగా వేగం తగ్గించి రోడ్డుమధ్యలోనే ఆగిపోయింది. ఈ పరిణామాన్ని గమనించినప్పటికీ, వెనుక వస్తున్న ఫార్చ్యూనర్ కారును డ్రైవర్ అదుపు చేయలేకపోయాడు. దీంతో కారు అత్యంత వేగంగా వెళ్లి డీసీఎంను  ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. 

 

 

వారిలో మాగంటి అక్షిర నాగకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆమెను గచ్చిబౌలి లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంతో ఫార్చ్యూనర్ కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ట్రాఫిక్‌కు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డీసీఎం వాహనానికి సంబంధించిన సాంకేతిక లోపాలపై కూడా విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం మరోసారి ఔటర్ రింగ్ రోడ్‌పై వాహన భద్రత, అధిక వేగంపై ఆందోళనలు రేకెత్తించింది.

 


 

google-ad-img
    Related Sigment News
    • Loading...