Latest News
భారత్ లో ఉగ్ర దాడులకు లష్కరే కుట్ర!
posted on: Apr 1, 2026 10:47AM
.webp)
భారతదేశంలో భారీ ఎత్తున ఉగ్రదాడులకు లష్కరే తయ్యిబా (ఎల్ఈటీ) కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. ఇటీవల అదుపులోకి తీసుకున్న లష్కరే ఉగ్రవాది షబ్బీర్ అహ్మద్ లోన్ను విచారించిన ఢిల్లీ పోలీసులు దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ప్రధాన నగరాలలో ఉగ్రదాడులను నిర్వహించేందుకు లష్కరే కుట్ర వెలుగులోకి వచ్చింది.
శ్రీనగర్ కు చెందిన షబ్బీర్ అహ్మద్ లోన్, గత రెండు దశాబ్దాలుగా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఆసిఫ్ దార్, సుమామా బాబర్ వంటి పాక్ ఉగ్రవాదుల ఆదేశాల మేరకు ఇక్కడ ఉగ్రకార్యకలాపాలకు సహకాం అందిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ విచారణలో అతడి నుంచి రాబట్టిన వివరాలిలా ఉన్నాయి.
దిల్లీలోని ప్రముఖ ఆలయాలు, జనం రద్దీగా ఉండే వాణిజ్య సముదాయాలే లక్ష్యంగా ఎల్ఈటీ ఇప్పటికే రెక్కీ నిర్వహించింది. అక్కడి భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీల లభ్యత, రక్షణ లోపాలను నిశితంగా పరిశీలించింది. తమ దాడుల ద్వారా భారీగా ప్రాణనష్టం కలిగించేలా ప్రణాళికలు రచించింది. ఈ దాడుల కోసం అక్రమంగా దేశంలోకి చొరబడిన విదేశీయులతో ప్రత్యేక ముఠా కూడా ఏర్పడిందని షబ్బీర్ అహ్మద్ లోన్ విచారణలో పోలీసులకు వివరించాడు.
కేవలం దాడులు మాత్రమే కాకుండా.. కశ్మీర్ లోని స్థానిక యువతను తప్పుదోవ పట్టించడానికి సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకున్నట్లు షబ్బీర్ లోన్ విచారణలో వెల్లడించాడు. ఉగ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తూ, అనేకమందిని లష్కరే సంస్థలోకి రిక్రూట్ చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిందితుడి వద్ద భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి వివిధ దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఈ నెట్వర్క్ వెనుక ఉన్న స్లీపర్ సెల్స్ కోసం ఇప్పుడు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. భద్రతా దళాలు హై అలర్ట్ ప్రకటించాయి. షబ్బీర్ లోన్ నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. రానున్న రోజుల్లో మరికొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.



.webp)


