తెలంగాణలో టీఆర్ఎస్, సీమాంధ్రలో తెలుగుదేశం: లగడపాటి
posted on: May 3, 2014 6:28PM
సర్వేల స్పెషలిస్టు లగడపాటి రాజగోపాల్ తన రాజకీయ అంచనాలను వెల్లడించారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణలో టీఆర్ఎస్ పూర్తి మెజారిటీ సాధిస్తుందని, సీమాంధ్రలో తెలుగుదేశం పూర్తి మెజారిటీ సాధిస్తుందని లగడపాటి చెప్పారు. ఒకవేళ రాష్ట్రం విడిపోకపోతే టీడీపీ, బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తుందని ఆయన వెల్లడించారు.
సీమాంధ్రలో 70 శాతానికి మించి పోలింగ్ జరిగితే తెలుగుదేశం పార్టీ సొంత బలంతోనే అధికారంలోకి వస్తుందని వివరించారు. కేంద్రంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటీని సాధిస్తాయనేది తన అంచనా అని చెప్పారు. ఎన్డీయే 272 స్థానాల మార్కు దాటుతుందని అన్నారు. ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోతుందని, ఇది కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన తనకు బాధ కలిగించే విషయమని అన్నారు.
తనకు రాజకీయంగా జన్మను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, తనకు రాజకీయగా మరణాన్ని కూడా ఇచ్చిందని లగడపాటి వ్యాఖ్యానించారు. తనపేరుతో వచ్చే ఇతర సర్వేలకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఈ సందర్భంగా లగడపాటి ప్రకటించారు. తాను కిరణ్ కుమార్ రెడ్డి పార్టీకి నైతికంగా మద్దతు ఇస్తున్నానే తప్ప ఏ పార్టీలోనూ లేనని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు తాను చెబుతున్నది తన అంచనాలు మాత్రమేనని, శాస్త్రీయంగా చేసిన ఎగ్జిట్ పోల్ వివరాలను మే 12వ తేదీ తర్వాత ప్రకటిస్తానని లగడపాటి వెల్లడించారు.



.jpg)
.jpg)
.webp)

.webp)


