వేధింపులకు తాళలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
posted on: Jan 30, 2026 11:15AM
వేధింపులు తట్టుకోలేక ఓ మహిళా కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. పెళ్లి పేరుతో మానసికంగా వేధింపులకు గురి చేసిన ఇద్దరు యువకుల కారణంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సీత్య తండాకు చెందిన అనిత అనే మహిళా కానిస్టేబుల్ గ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కొమ్మనపల్లి తండాకు చెందిన రాజేందర్ అనే వ్యక్తి అనితకు దూరపు బంధువు, ఆమెను పెళ్లి చేసుకుం టానని చెబుతూ గత నాలుగేళ్లుగా వేధింపులకు పాల్పడుతున్నాడు.
డ్యూటీలో ఉన్న సమయంలోనూ వీడియో కాల్ చేయాలని, ఎవరితోనూ సన్నిహితంగా మాట్లాడవద్దని ఆంక్షలు విధిస్తూ అనుమానాలతో వేధిస్తుండటంతో అనిత కుటుంబ సభ్యులు రాజేందర్తో తమ కుమార్తె వివాహానికి అంగీకరించలేదు. ఈ క్రమంలో అనిత తన స్నేహితుడు జబ్బార్ లాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న రాజేందర్ జబ్బార్ లాల్కు ఫోన్ చేసిఅనితపై లేనిపోనివి చెప్పి మనసు విరిచేశాడు.
దీంతో అప్పటి నుంచీ జబ్బార్ లాల్ కూడా అనితను వేధించడం ప్రారంభించాడు. డబ్బులు ఇస్తేనే నిన్ను పెళ్లి చేసుకుంటా అంటూ ఒత్తిడి తెచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన అనిత.. రాజేందర్కు ఫోన్ చేసి మీ ఇద్దరి వల్ల నా జీవితం నాశనం అయింది. నాకు చావే దిక్కు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తే, రాజేందర్ ఛస్తే చావు అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనిత ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి రాజేందర్, జబ్బార్ లాల్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






