Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పబ్లో లేడీ డీసీపీ సీక్రెట్ ఆపరేషన్...సంచలనం రేపిన మిడ్నైట్ తనిఖీలు
posted on: Jun 7, 2026 3:26PM

కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో అర్ధరాత్రి నిర్వహించిన ఓ సీక్రెట్ ఆపరేషన్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా పోలీసు తనిఖీలు అంటే భారీ బందోబస్తు, పోలీసు వాహనాలు, హడావుడి కనిపిస్తాయి. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపించింది. అర్ధరాత్రి వేళ ఎలాంటి హంగామా లేకుండా, తన భద్రతా సిబ్బందిని కూడా దూరంగా ఉంచి డీసీపీ రితిరాజ్ ఒంటరిగా పబ్లోకి ప్రవేశించారు. సాధారణ కస్టమర్లా లోపలికి వెళ్లిన ఆమె, అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలించారు.
పబ్లోని వాతావరణం, నిర్వహణ తీరు, అలాగే జరుగుతున్న అనుమానాస్పద కార్యకలాపాలను స్వయంగా గమనించిన డీసీపీ వాటిని తన మొబైల్ ఫోన్లో రికార్డు చేశారు. పరిస్థితిపై పూర్తి అవగాహన పొందిన అనంతరం స్థానిక పోలీసులకు సమాచారం అందించి వెంటనే అక్కడికి రప్పించారు. డీసీపీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు పబ్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. నిబంధనల ఉల్లంఘనలు గుర్తించడంతో పబ్ మేనేజర్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా స్థానిక పోలీసుల పనితీరుపై డీసీపీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పబ్లో జరుగుతున్న వ్యవహారాలపై ఇంతకాలం ఎందుకు చర్యలు తీసుకోలేదని అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. స్థానికుల నుంచి పలుమార్లు ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఎందుకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అర్ధరాత్రి సమయంలో ఓ మహిళా ఉన్నతాధికారి ఎలాంటి భయం లేకుండా స్వయంగా పబ్లోకి వెళ్లి పరిస్థితులను పరిశీలించడం పోలీసు వర్గాలతో పాటు ప్రజల్లోనూ చర్చకు దారితీసింది. డీసీపీ నిర్వహించిన ఈ స్పై ఆపరేషన్ గురించి తెలిసిన స్థానికులు ఆమె ధైర్యసాహసాలను ప్రశంసిస్తున్నారు. సాధారణ కస్టమర్గా ఎంట్రీ ఇచ్చి, రహస్యంగా ఆధారాలు సేకరించి, వెంటనే పోలీసులతో దాడులు నిర్వహించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.






