Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రేవంత్ రెడ్డి సినిమా అట్టర్ ఫ్లాప్...కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
posted on: Jun 21, 2026 3:55PM
.webp)
తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒక సాధారణ సినిమా ఫెయిల్ అయితే కేవలం ఆ సినిమాను నిర్మించిన ప్రొడ్యూసర్లకు మాత్రమే నష్టం వస్తుందని, కానీ ప్రస్తుతం తెలంగాణలో నడుస్తున్న 'రేవంత్ రెడ్డి' అనే సినిమా అట్టర్ ఫ్లాప్ కావడం వల్ల ఏకంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఘోరంగా నష్టపోతున్నారని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనను ఎండగడుతూ ఆయన సినిమా పరిభాషలో చేసిన ఈ పోలిక ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం తెగ వైరల్ అవుతోంది.
ఈ 'రేవంత్ రెడ్డి' అనే సినిమాను చూస్తున్న ప్రేక్షకులు ఇప్పటికే తీవ్ర అసహనానికి గురవుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సినిమా ఫస్ట్ హాఫ్ ముగిసి, ఇంటర్వెల్ కాగానే థియేటర్లలో ఉన్న జనాలు తలలు పట్టుకుంటున్నారని, 'ఎప్పుడు పోతడు రా ఈ రేవంత్ రెడ్డి' అంటూ అందరూ తీవ్ర అసంతృప్తితో ఎదురుచూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఉన్న అభివృద్ధి వేగం పూర్తిగా మందగించిందని, కేసీఆర్ హయాంలో రైతాంగానికి అండగా నిలిచిన రైతుబంధు వంటి పథకాలు అమలు కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అన్నపూర్ణలా విలసిల్లిన తెలంగాణను కాంగ్రెస్ సర్కార్ తన పాలనా వైఫల్యాలతో అనాథ తెలంగాణగా మారుస్తోందని మండిపడ్డారు.
పాలన చేతగాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1000 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఈ ఆత్మహత్యలన్నీ ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం తన సొంత నియోజకవర్గమైన కోస్గి లాంటి ప్రాంతాల్లో కూడా శాంతిభద్రతలను కాపాడలేకపోతున్నారని, ఆలయాలపైకి బుల్డోజర్లు వెళ్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మెట్రో రైలు రెండో దశ విస్తరణ ప్రాజెక్టు సాధనలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 13 వేల 400 కోట్ల రుణాన్ని కేవలం 4 శాతం వడ్డీతో, 20 ఏళ్ల సుదీర్ఘ కాలపరిమితికి తీసుకునేలా అంతర్జాతీయ సంస్థలను ఒప్పించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని గుర్తు చేశారు. ఈ లోన్ బదిలీ ప్రక్రియ కోసం డాక్యుమెంట్ ఫీజు కింద రూ. 48 కోట్లు, ఈక్విటీ కింద రూ. 1400 కోట్లు కూడా అప్పట్లోనే చెల్లించామని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇన్ని నిధులు సమకూర్చి, ప్రణాళికలు సిద్ధం చేసినా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అభివృద్ధిని గాలికొదిలేసి కేవలం రాజకీయాలకే పరిమితమయ్యారని విమర్శించారు. సీఎం పదవి చేపట్టిన నాటి నుండి రేవంత్ రెడ్డి దాదాపు 71 సార్లు ఢిల్లీకి వెళ్లినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఆయనను అస్సలు పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను సాధించడంలో, కేంద్రం నుండి నిధులు రాబట్టడంలో రేవంత్ పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. 71 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా రాష్ట్రానికి ఒక్క పైసా అదనపు ప్రయోజనం తీసుకురాలేకపోయారని విమర్శించారు. కేవలం కిషన్ రెడ్డి వంటి నేతలతో కలిసి బీఆర్ఎస్ పై బురదజల్లడమే రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని, ఈ రాజకీయ నాటకాల వల్ల 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల భవిష్యత్తు అంధకారంలో పడుతోందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.


.webp)


