తెలంగాణ రాష్ట్ర విదేశాంగ మంత్రిగా కేటీఆర్..

posted on: Jul 11, 2016 5:19PM

ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ సంబంధాలు కొత్త నిర్వచనాన్ని సంతరించుకుంటున్నాయి. ప్రపంచం గ్లోబల్ విలేజ్‌గా మారిపోతున్న ప్రస్తుత తరుణంలో ఒక దేశం మరో దేశంతో మైత్రిని కోరుకుంటోంది. ఆ సంబంధాలను మరింత మెరుగ్గా ఉంచడంతో పాటు..ఒక ప్రభుత్వానికి మరోక ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తుంది విదేశీ వ్యవహారాల శాఖ. సాధారణంగా విదేశీ వ్యవహారాలు కేంద్రప్రభుత్వానికే పరిమితం. కానీ దేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్రప్రభుత్వం సొంతంగా విదేశీ వ్యవహారాల శాఖను ఏర్పాటు చేయనుంది..అదే తెలంగాణ ప్రభుత్వం.

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినప్పటి నుంచి ఎన్‌ఆర్ఐ విభాగానికి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు భావిస్తూ వస్తున్నారు. అలాగే తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన ప్రజలు ఉపాధి నిమిత్తం గల్ఫ్, అమెరికా, ఆఫ్రికా తదితర దేశాలకు వెళ్లారు. వారి యోగ క్షేమాలు చూడటానికి కూడా ఎన్ఆర్ఐ విభాగం అవసరమని సీఎం గుర్తించారు. కాని దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా పరుగులు పెట్టించడానికి..పెద్ద ఎత్తున విదేశీ నిధులను ఆకర్షించేందుకు తనకంటూ ఓ ఎన్నారై పాలసీని రూపొందించుకోవాలని భావిస్తోంది తెలంగాణ. పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి, దేశంలోని ఉత్తమ పారిశ్రామిక రాష్ట్రాల్లో ఒకటిగా రూపొందించడానికి ఈ మంత్రిత్వశాఖ ఉపయోగపడుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు.

 

ఇదంతా బాగానే ఉంది కానీ..కొత్తగా ఏర్పాటు చేసే విదేశీ వ్యవహారాల శాఖకు మంత్రిగా ఎవరు సారథ్యం వహించబోతున్నారు..కొత్తగా ఎవరినైనా మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారా..? లేదంటే ఉన్నవాళ్లకే దీనిని అదనపు బాధ్యతగా అప్పగించబోతున్నారా..? అంటూ దీనిపై రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. అందుకు ఇంత మదనపడవలసిన పనిలేదంటున్నారు కేసీఆర్. ఎందుకంటే ఆయన ఎప్పుడో ఈ శాఖకు మంత్రిని ఫిక్స్ చేసేశారు. ఆయన మరెవరో కాదు స్వయానా కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్. విదేశీ వ్యవహారాలు చూడాలంటే ఇంగ్లీష్‌ భాషపై పట్టు అవసరం, దానికి తోడు వర్తమాన విషయాలు, బిజినెస్ డీలింగ్స్ , ప్రజంటేషన్ ఇలాంటి అంశాలపై అవగాహన ఉండాలి. అన్ని అంశాలను బేరీజు వేసుకున్న కేసీఆర్ దీనికి కేటీఆరే కరెక్ట్ అని డిసైడయ్యారు.

 

దీనికి తోడు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వివిధ దేశాల్లో పర్యటించిన కేటీఆర్..తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలపై అక్కడి పారిశ్రామిక వేత్తలకు వివరించి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులను తీసుకువచ్చారు. కొత్త మంత్రిత్వశాఖకు సంబంధించిన విధి విధానాలు, ముసాయిదాకు సంబంధించిన ప్రకటన ఒకటి రెండు రోజుల్లో వెలువడనుంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే స్వతంత్ర భారత చరిత్రలో ఒక రాష్ట్రానికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసిన తొలి వ్యక్తిగా కేటీఆర్ రికార్డుల్లోకి ఎక్కనున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...