కేసీఆర్ కంటే కేటీఆర్ నాలుగు ఆకులు ఎక్కువే చదివాడా..?

posted on: Jan 13, 2016 11:49AM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి.. ఆయన వాక్చాతుర్యం గురించి.. ఆయన మాటలకు ఉన్న పదును గురించి రాజకీయానుభవం ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది. తన మాటలతోనే ప్రజలను ఆకర్షిస్తారు కేసీఆర్. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే తెలంగాణ మంత్రి కేటీఆర్.. కేసీఆర్ కంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివినట్లు కనిపిస్తుంది. తండ్రికి తగ్గ తనయుడు అని అనిపిస్తున్నాడు కేటీఆర్ వ్యాఖ్యలు చూస్తుంటే.

గ్రేటర్ ఎన్నికల పూర్తి బాధ్యతను కేటీఆర్ తన భుజాల పై వేసుకున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే కేటీఆర్ పలు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఈ సభల్లో కేటీఆర్ ప్రసంగాలు చూస్తుంటే సీమాంధ్రులను ఆకట్టుకోవడానికి బానే మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. తాను భీమవరం నుండి పోటీ చేస్తానని సరదా వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే దీనిపై విమర్శలు కూడా అలానే తలెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు అయితే ఉద్యమంలో సీమాంధ్రులను ఏకిపారేసిన కేసీఆర్ అండ్ టీం ఇప్పుడు ఓట్ల కోసం ఇలా మాట్లాడుతున్నారు అని విమర్శించారు. దీంతో ఒకానొక సందర్భంలో కేసీఆర్ కూడా కేటీఆర్ కు వార్నింగ్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. వీటన్నింటికి విషయంలో ఎదురవుతున్న ప్రశ్నలకు గాను కేటీఆర్ ఇచ్చిన క్లారిటీ చూస్తుంటే అందరూ షాకవ్వాల్సిందే. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోణంలోనే తమ మాటలు ఆచరణలు ఉంటున్నాయని అన్నారు. అంతేకాదు ఉద్యమ సమయంలో సీమాంధ్రులు కూడా మమ్మల్ని విమర్సించారు కాబట్టి మేము విమర్శించాము.. అంతేకాని మాకు ఎవరిపై ద్వేషాలు లేవు అంటూ చెప్పారు. హైదరాబాద్ లో ఉన్నవారంతా హైదరాబాదీయులేనని.. ఇక్కడ సెటిలర్లు అంటూ ఎవరూ లేరని.. ఆ మాటకొస్తే మేము కూడా సెటిలర్లమే.. మా సొంత ఊరు సిద్దిపేట అని చెప్పుకొచ్చారు.

మొత్తానికి కేటీఆర్ తన తండ్రి దగ్గర రాజకీయ పాఠాలు బాగానే నేర్చుకున్నట్టున్నారు. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి అన్న విషయం బాగా వంటపట్టినట్టుంది. మరి ముందు ముందు ఇంకెలా మాట్లాడుతారో చూద్దాం.

google-ad-img
    Related Sigment News
    • Loading...