బీఆర్ఎస్ కార్పొరేటర్లకు కాంగ్రెస్ గేలం? కేటీఆర్ ఆరోపణలు దేనికి సంకేతం?
posted on: Feb 16, 2026 11:50AM

తెలంగాణ రాజకీయాలలో బీఆర్ఎస్ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్న చందంగా మారిపోతున్నదా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. కాగా బీఆర్ఎస్ ప్రస్థుత పరిస్థితికి ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తీరే కారణమని సోదాహరణంగా చెబుతున్నారు. 2014 నుంచి అంటే తెలంగాణ ఆవిర్భావం నుంచి వరుసగా పదేళ్ల పాటు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఆ సమయంలో ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ గాలం వేసి తమ పార్టీలోకి లాగేసింది. మండలి, అసెంబ్లీలో విపక్ష పార్టీలకు చెందిన సభ్యులను గంపగుత్తగా పార్టీలో చేర్చుకుని, వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా అప్పగించిన సంగతి తెలిసిందే.
అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, పని తీరు, ప్రజా సంక్షేమం చూసి వారంతట వారే స్వచ్ఛందంగా పార్టీలో చేరారని ఘనంగా ప్రకటించుకుంది. ఇప్పుడు అదే పరిస్థితి రివర్స్ లో కనిపిస్తుంటే మాత్రం.. ప్రజాస్వామ్యం ఖూనీ, మా పార్టీ వారికి కాంగ్రెస్ గేలం అంటూ గుండెలు బాదుకుంటోంది. పైగా ఆ ఆరోపణలను స్వయంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుకు కల్వకుంట్ల తారకరామారావు నుంచే రావడంతో తెలంగాణ సమాజం ముక్కున వేలేసుకుంటోంది. నాడు రైట్ అయిన పద్ధతి, ఇప్పుడు బీఆర్ ఎస్ కు రాంగ్ గా ఎందుకు కనిపిస్తోందంటూ నిలదీస్తోంది.
తాజాగా జరిగిన మునిసిపోల్స్ లో మునిసిపాలిటీలలో వార్డుమెంబర్లు, కార్పొరేషన్ లలో కార్పొరేటర్ లుగా గెలిచిన బీఆర్ఎస్ వారికి గాలం వేసి మరీ కాంగ్రెస్ గాలం వేస్తోందనీ, గాలానికి చిక్కని వారిని బెదరింపులకు, వేధింపులకు గురి చేస్తున్నదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన ఆరోపణలపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి, స్వయానా కేటీఆర్ తండ్రి అయిన కేసీఆర్ చేసినది ఇదేగా అని నిలదీత సామాన్య జనం నుంచే వస్తున్నది. అదే మాట బీఆర్ఎస్ నేతల అంతర్గత సమావేశాల్లో కూడా వినిపిస్తోంది.
ప్రస్తుతం కేసీఆర్ రాజకీయంగా క్రియాశీలంగా లేరు.. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ పార్టీ శ్రేణులపై పట్టు సాధించడంలో విఫలం కావడమే బీఆర్ఎస్ కార్యకర్తలు పక్క చూపు చూడడానికి కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒకప్పుడు తెలంగాణ రాజకీయాలలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీఆర్ఎస్ ఇప్పుడు ఉనికి కోసం కష్టపడే పరిస్థితి రావడానికి కార్యనిర్వాహక అధ్యక్షుడు పార్టీ సభ్యుల విశ్వాసాన్ని చూరగొనడంలో వైఫల్యాంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక విషయంలో బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే.. అధికార పార్టీకి అనుబంధంగా కొనసాగడానికి ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లు రెడీ అయిపోయినట్లుగా కనిపి స్తున్నది.
కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక లో తాము తటస్థంగా ఉంటామని కేటీఆర్ అనివార్యంగా ప్రకటించాల్సిన అవసరం ఏర్పడటమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు.కేటీఆర్ నోట ఆ మాట వెలువడడానికి ముందు.. మేయర్ ఎన్నికలో బీజేపీకి మద్దతు అని ఒకసారి, కాంగ్రెస్ కు మద్దతు అని ఒకసారి ఆ పార్టీ నుంచి వచ్చిన సంకేతాలను తార్కాణంగా చూపుతున్నారు. కేటీఆర్ పార్టీ శ్రేణుల విశ్వాసం చూరగొనడంలో వైఫల్యానికి కారణం క్షేత్ర స్థాయిలో పార్టీ పటిష్ఠతపై దృష్టి పెట్టడం మాని.. కేవలం సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై దూకుడుగా విమర్శించి, తన పపైపోయిందన్న చందంగా చేతులు దులిపేసుకోవడమేనన్న అభిప్రాయం పార్టీ వర్గాల నుంచే గట్టిగా వినిపిస్తున్నది.







