పుష్కరాలు గోదావరి నీటితో కాదు..కృష్ణా జలాలతోనే

posted on: Aug 5, 2016 5:01PM

కృష్ణా పుష్కరాలు ఆగస్టు 12న ప్రారంభం కానున్నాయి. 12 రోజుల పాటు జరిగే ఈ పుష్కరాలు ఆగస్టు 23న ముగియనున్నాయి. దీంతో ప్రభుత్వం ఆగమేఘాల మీద పుష్కర ఏర్పాట్లను చేస్తోంది. పుష్కరాలు ప్రారంభానికి పట్టుమని వారం రోజులే ఉన్నాయి. కృష్ణానదివైపు చూస్తే నీటి జాడలేదు. పుష్కర స్నానాలు కష్టమే..ఇక షవర్లే దిక్కు.. ఏంట్రా దేవుడా అనుకుంటున్న పరిస్థితుల్లో గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో నదిలోకి నీటి ప్రవాహం పెరిగింది. ఆ నీటిని పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌ వద్దకు తరలించి కాస్త ఊపిరి పీల్చుకున్నారు అధికారులు.

 

అయితే దీనిపై సంప్రదాయవాదుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. కృష్ణా పుష్కరాలేంటి..గోదావరి నీళ్లతో ఏంటి..ఏ నదికి పుష్కరాలు జరుగుతున్నాయి..మీరు ఏ నది నీటితో ఈ తంతు జరిపిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి విమర్శలను పట్టించుకోని ప్రభుత్వం ఆ దిశగా ముందుకే వెళ్లింది. వేగంగా పుష్కర పనుల్లో నిమగ్నమైంది. గతేడాది గోదావరి పుష్కరాల సమయంలో రుతుపవనాలు సకాలంలో కనికరించకపోవడంతో గోదావరి పుష్కరాల నిర్వహణ డైలమాలో పడింది..అలాంటి స్థితిలో ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీవర్షాలతో గోదారమ్మ పొంగిపొర్లి రాజమండ్రి, ధవళేశ్వరం వద్ద పుష్కలంగా నీరు ఉండటంతో పుష్కరాలు ఘనంగా ముగిశాయి. తిరిగి అలాంటి పరిస్థితే ఇప్పుడు ఏర్పడటంతో తన బిడ్డల కష్టం చూడలేకపోయింది కృష్ణమ్మ. అందుకే మూడు రాష్ట్రాలను దాటుకుంటూ బెజవాడ వైపు కదలి వస్తోంది కృష్ణవేణి.

 

మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడుతుండటంతో అక్కడ వాగులు, వంకలు ఏకమై కృష్ణలో కలుస్తున్నాయి. దీంతో కృష్ణమ్మ కదం తొక్కుతోంది. ఆల్మట్టి రిజర్వాయర్‌కు 2 లక్షల క్యూసెక్కులకు పైగా వరద రావడంతో అధికారులు ఆ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి నుంచి 2.18 లక్షల క్యూసెక్కులు, నారాయణ్‌పూర్ నుంచి 2.32 లక్షలు, జూరాల నుంచి 60 వేల క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి రావడంతో జలాశయం నిండు కుండలా మారింది. రేపు సాయంత్రానికి నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేయనుండటంతో కృష్ణాపుష్కరాలకు నీటికొరత తీరనుంది. అటు రుతుపవనాలు బలంగా ఉండటం..ఎగువ రాష్ట్రాల్లోనూ ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో పుష్కరాల నాటికి ప్రకాశం బ్యారేజ్‌కు మరింత నీరు చేరే అవకాశం ఉంది. దీంతో అధికారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. దీంతో పట్టిసీమ నీటిని నిలిపివేసి పై నుంచి వస్తున్న నీటితోనే పుష్కరాలు జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. సో కృష్ణా పుష్కరాలు కృష్ణా జలాలతోనే. 

google-ad-img
    Related Sigment News
    • Loading...