నాగార్జునకు క్షమాపణ చెప్పిన మంత్రి కొండా సురేఖ
posted on Nov 12, 2025 9:34AM
.webp)
ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు ఆమె క్షమాపణలు తెలిపారు. గతంలో తాను వారిపై చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ అర్థరాత్రి ట్వీట్ చేశారు. నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని, తన వ్యాఖ్యల వల్ల వారు బాధపడి ఉంటే చింతిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. అయితే, అర్థరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఆమె ఈ ట్వీట్ చేయడం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఆయన మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశ్యం నాకు లేదు. ఆయన కుటుంబ సభ్యులను నొప్పించాలన్నా, అపకీర్తి కలిగించాలన్నా ఉద్దేశ్యం నాకు ఎప్పటికీ లేదు. నా వ్యాఖ్యల వల్ల ఏవైనా అనుకోని అపోహలు కలిగినట్లయితే, దానికి నేను చింతిస్తున్నాను. తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఈ వివరణతో నాగార్జున కుటుంబంపై ఉన్న అపోహలు తొలగుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు రేపు నాంపల్లి స్పెషల్ కోర్టు లో నాగార్జున పరువు నష్టం పిటిషన్ పై విచారణ జరగనున్నది. విచారణ కు ఒక రోజు ముందు మంత్రి కొండ సురేఖ... నాగార్జునను ట్యాగ్ చేస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్ కేటీఆర్ను విమర్శించే క్రమంలో కొండా సురేఖ... హీరో నాగచైతన్య, సమంత విడాకుల అంశంపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.కొండా సురేఖ వ్యాఖ్యలపై నటుడు నాగార్జున తీవ్రంగా స్పందించారు. ఆమెపై పరువు నష్టం దావా వేశారు. మరోవైపు నాగచైతన్య, సమంత సైతం తమ విడాకులు పరస్పర అంగీకారంతో తీసుకున్న వ్యక్తిగత నిర్ణయమని, తమ పేర్లను అనవసరంగా రాజకీయ వివాదాల్లోకి లాగవద్దని నాగార్జున విజ్ఞప్తి చేశారు.