Latest News

ఎర్రబెల్లి-కొండా యుద్ధం మళ్లీ మొదలైంది...

posted on: Jun 13, 2017 3:38PM

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొండా మురళీధర్‌రావు మధ్య నడిచిన పోటీ రాజకీయాలు అక్కడి ప్రజలు కథకథలుగా చెప్పుకుంటారు. చంద్రబాబు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓరుగల్లులో ఎర్రబెల్లి హవా బాగా నడిచేది. మంత్రి పదవిలో లేకపోయినప్పటికీ... అధికార పార్టీ కావడం, ప్రభుత్వ విప్‌గా ఉండటంతో ఉమ్మడి వరంగల్‌లో ఎర్రబెల్లి మాట నెగ్గేది. అదే సమయంలో కొండా మురళి... కాంగ్రెస్‌లో ఉంటూ ఎర్రబెల్లితో ఢీ అంటే ఢీ అనేవారు. ఈ ఇద్దరి మధ్యా హత్యా రాజకీయాలు కూడా నడిచాయని చెప్పుకుంటారు. ఈ ఇద్దరి వర్గపోరుపై అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది.

 

కొండా మురళీకి నక్సల్స్‌తో సంబంధాలుండేవని చెబుతారు. అప్పట్లో ఒకసారి హన్మకొండ సెంటర్‌లో తన ప్రత్యర్ధులపై కొండా మురళి కాల్పులు జరపడం సంచలనం సృష్టించింది. అదే సమయంలో నక్సల్స్‌తో సంబంధాలున్నాయనే వంకతో కొండా మురళీని ఎర్రబెల్లి ఎన్‌కౌంటర్‌ చేయించేందుకు కుట్ర చేశారనే ఆరోపణలు ఆనాటి అసెంబ్లీలో ప్రకంపనలు సృష్టించాయి. ఎమ్మెల్యేగా ఉన్న కొండా సురేఖ... అసెంబ్లీలో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ రాజశే‌ఖర్‌రెడ్డి... కొండా మురళీకి, అతని కుటుంబానికి అండగా నిలబడ్డారని చెబుతారు. అంతేకాదు దాదాపు ఎన్‌‌కౌంటర్‌ కావాల్సిన కొండా మురళీని ఆ ప్రమాదం నుంచి వైఎస్సే తప్పించారని చెప్పుకుంటారు.

 

అయితే ఎర్రబెల్లి-కొండా మురళి మధ్య సుదీర్ఘకాలంగా నడుస్తోన్న వైరం ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నా... ఇద్దరూ ఉప్పూనిప్పులాగే కంటిన్యూ అవుతున్నారు. కొండా దంపతుల కంటే లేటుగా గులాబీ గూటికి వచ్చినప్పటికీ... జిల్లా పార్టీలో పట్టు సాధించేందుకు ఎర్రబెల్లి పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా కొండా దంపతులకు చెక్‌ పెట్టేందుకు చూస్తున్నారట. ప్రస్తుతం కొండా సురేఖ ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్‌ ఈస్ట్‌లో తన సోదరుడు ప్రదీప్ రావుకు రాబోయే ఎన్నికల్లో టికెట్టు ఇప్పించేందుకు ఎర్రబెల్లి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో ఎర్రబెల్లి-కొండా మధ్య మళ్లీ యుద్ధం మొదలైందనే టాక్ వినిపిస్తోంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...