ఎఫ్‌బీఐ కీలక అధికారికి అక్రమ ఆస్తులు...నిఘా వ్యవస్థల్లోనే ఇంత అవినీతా?

posted on: May 29, 2026 5:07PM

 

భారత్‌లో అత్యున్నత నిఘా సంస్థ సీబీఐ విచారణ తీరే పలు కీలక కేసుల్లో వివాదాస్పదమవుతోంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ. దాంతో సీబీఐ పాత్రపైనే సామాన్యుల్లో అనుమాన మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పుడు ప్రపంచ దేశాలపై నిఘా పెట్టే అమెరికాకు చెందిన సీఐఏలోని ఓ అధికారి ఎవరూ ఊహించని మోసానికి తెరలేపాడంతో నిఘా సంస్థలు నిజంగా నిఘా పెడుతున్నాయా? లేకపోతే ఇన్విస్టిగేషన్ అధికారులు స్వలాభమే చూసుకుంటున్నారా? అన్న చర్చ మొదలైంది.

ఒకటి కాదు రెండు కాదు వేలాది కోట్ల డబ్బును, బంగారాన్ని సీఐఏ అధికారి కొట్టేసిన ఉదంతం యావత్తు ప్రంపచాన్ని దిగ్భ్రాంతకి గురి చేస్తోంది. . అతడిపై పక్కా సమాచారం అందడంతో ఎఫ్‌బీఐ రంగంలోకి దిగి ఆయన నివాసంలో తనిఖీలు చేపట్టింది. ఈక్రమంలోనే ఆయన ఇంట్లో 300 కిలోల బంగారం బిస్కెట్లు, రూ.19 కోట్ల నగదు, 35 లగ్జరీ వాచీలు లభ్యం అయ్యాయి. దీంతో అతడిని అరెస్ట్ చేసి మరీ ఎఫ్‌బీఐ విచారణ జరుపుతోంది. అంతర్జాతీయ నిఘా వర్గాలను శాసించే అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రంగంలోనే ఓ అసాధారణ స్కామ్ వెలుగులోకి రావడం పెద్ద కలకలమే రేపుతోంది. 

వేల కోట్ల రహస్య ఆపరేషన్లను నడిపే ఆ సంస్థ ఖజానాకే ఒక మాజీ అధికారి కన్నం వేశాడు. ముఖ్యంగా సీఐఏ మాజీ అధికారి డేవిడ్ రష్.. అదే సంస్థకు కన్నం వేసి కోట్లాది రూపాయల ఆస్తులను కూడగట్టాడు. అయితే తాజాగా ఆయన నివాసంపై అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ జరిపిన సోదాల్లో బయటపడ్డ ఖజానాను చూసి సాక్షాత్తూ దర్యాప్తు అధికారులే నోరెళ్లబెట్టారు. ముఖ్యంగా ఆయన డేవిడ్ రష్ ఇంట్లో.. 300 కిలోల బంగారం బిస్కెట్లతో పాటు రూ.19 కోట్ల నగదు లభ్యం అయింది. అంతేకాకుండా కుప్పలు తెప్పలుగా లగ్జరీ వాచ్‌లు దొరికాయి. 

ఎఫ్‌బీఐ అధికారులు పక్కా సమాచారంతో డేవిడ్ రష్ నివాసంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఒక్కోటి ఒక కిలో బరువు తూగే ఏకంగా 300 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ బంగారం విలువ సుమారు 40 మిలియన్ డాలర్లు  అంటే.. భారత కరెన్సీలో దాదాపు రూ.382 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ బంగారంతో పాటు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 'రోలెక్స్' బ్రాండ్‌కు చెందిన 35 లగ్జరీ చేతి వాచీలు, దాదాపు 2 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.19 కోట్లు) అక్రమ నగదును అధికారులు అతని ఇంట్లోని రహస్య ప్రదేశాల నుంచి బయటకు తీశారు. అంతేకాకుండా డేవిడ్ రష్‌ను అరెస్ట్ చేసి ప్రస్తుతం విచారిస్తున్నారు.

డేవిడ్ రష్ సీఐఏలో కీలక బాధ్యతల్లో పని చేసిన సమయంలో.. అత్యంత రహస్యమైన అధికారిక ఆపరేషన్ల అవసరాల కోసమంటూ 2025, 2026 మధ్య కాలంలో ప్రభుత్వం నుంచి విడతల వారీగా భారీ ఎత్తున బంగారం, నగదును డ్రా చేసినట్లు ఎఫ్‌బీఐ గుర్తించింది. అమెరికా గూఢచర్య సంస్థలు తమ అంతర్గత ఖర్చుల వివరాలను పబ్లిక్‌గా వెల్లడించవు. ఈ లొసుగును ఆసరాగా చేసుకుని.. దేశ రక్షణ కోసం కేటాయించిన ప్రజాధనాన్ని డేవిడ్ రష్ అక్రమంగా తన సొంత నివాసానికి తరలించుకున్నాడని దర్యాప్తు సంస్థ నిర్ధారించింది. దీనిపై నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ సొమ్మును దొంగిలించడం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద ఎఫ్‌బీఐ కేసు నమోదు చేసింది.

డేవిడ్ రష్ 2015 వరకు అమెరికా నౌకాదళంలో కూడా విధులు నిర్వహించాడు. అక్కడ తాను పూర్తిస్థాయి పైలట్‌గా పని చేశానని రష్ చెప్పుకుంటున్నప్పటికీ.. అతను కేవలం ఒక రిజర్వ్ సిబ్బంది మాత్రమేనని ఎఫ్‌బీఐ బట్టబయలు చేసింది. నేవీలో ఉన్న కాలంలోనూ అతను పలు రకాల ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇకపోతే సీఐఏలో అతని అసలు హోదా ఏంటనే దానిపై ప్రస్తుతం గందరగోళం నెలకొంది. 

ఈ వ్యవహారం మొత్తంపై వర్జీనియాలోని అలెగ్జాండ్రియా కోర్టులో అధికారికంగా విచారణ జరగనుంది. తమ సొంత అధికారి ఇంత పెద్ద మొత్తంలో సంస్థను మోసం చేయడం సీఐఏ ప్రతిష్టను మసకబార్చింది. ఈ కుంభకోణం వెలుగుచూసిన నేపథ్యంలో.. సంస్థ అంతర్గత ఆర్థిక లావాదేవీలు, రహస్య నిధుల కేటాయింపులపై లోతైన సమీక్ష నిర్వహించాలని అమెరికా రక్షణ వర్గాలు నిర్ణయించాయి. సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్ స్వయంగా రంగంలోకి దిగి.. ఇలాంటి లూటీలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు కఠినమైన నిబంధనలు తీసుకువచ్చేందుకు కసరత్తు ప్రారంభించారు. మరి ఆ పర్యవేక్షణ మన దేశంలో ఎప్పిటికి మొదలవుతుందో చూడాలి.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...