Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేశినేని బ్రదర్స్ మధ్య మళ్లీ రాజుకున్న వివాదం... సీఎం రేవంత్కు ఫిర్యాదు!
posted on: Jun 28, 2026 4:08PM

హైదరాబాద్లో వేల కోట్ల భూకబ్జా యత్నం.. ఎంపీ కేశినేని చిన్నిపై కేసుకు నాని ఆరోపణలు..
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కేశినేని సోదరుల మధ్య వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. విజయవాడ ప్రస్తుత టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) లక్ష్యంగా మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నాని సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ శివార్లలోని వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు ఎంపీ చిన్ని ప్రయత్నిస్తున్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా బహిరంగ లేఖ రాయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ నగర పరిధిలోని ప్రగతి నగర్, షంషిగూడ ప్రాంతాల్లో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) పరిధిలోని సుమారు 112.72 ఎకరాల విలువైన స్థలం ఉంది. ఐటీ పార్క్ నిర్మాణం కోసం కేటాయించిన ఈ అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూమిపై ఎంపీ కేశినేని చిన్ని కన్నేశారని నాని ఆరోపించారు. మెసర్స్ ఎక్సెల్లా ప్రాపర్టీస్ అనే బినామీ సంస్థను అడ్డుపెట్టుకుని ఈ భూమిని అక్రమంగా చేజిక్కించుకోవాలని చూస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
అయితే ఈ భూమికి సంబంధించి ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు ఆదేశాలు ఇవ్వడంతో పాటు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆంక్షలు కూడా అమల్లో ఉన్నాయని మాజీ ఎంపీ గుర్తుచేశారు. ఈ తీవ్రమైన చట్టపరమైన అంశాలను దాచిపెట్టి, సుప్రీంకోర్టులో ఒక నకిలీ రాజీ ఒప్పందాన్ని చూపిస్తూ ఈ భారీ భూభాగాన్ని కొట్టేయాలని అధికార పార్టీ ఎంపీ కుట్ర పన్నుతున్నారని నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
గతంలో జిల్లా కలెక్టర్ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఈ వివాదాస్పద భూమిపై ప్రైవేటు వ్యక్తులకు ఎలాంటి హక్కులు లేవని స్పష్టమవుతోందని నాని వివరించారు. అయినప్పటికీ, అక్రమార్కులు రాత్రికి రాత్రే అక్కడ ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలకు తెరలేపారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులను రక్షించాల్సిన బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధే ఇలాంటి అక్రమాలకు పాల్పడటం దారుణమన్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి అడ్వకేట్ జనరల్ ద్వారా ఈ వ్యవహారంలో న్యాయపరంగా జోక్యం చేసుకోవాలని నాని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 'హైడ్రా' (HYDRA) యంత్రాంగాన్ని వెంటనే రంగంలోకి దించాలని డిమాండ్ చేశారు. అక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చివేయాలని కోరారు.
నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ భూములను కాజేయాలని చూస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఆయన బినామీలపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత సార్వత్రిక ఎన్నికల సమయం నుంచే కేశినేని సోదరుల మధ్య తీవ్ర రాజకీయ వైరం నడుస్తోంది. ఇప్పుడు ఏకంగా తెలంగాణ సీఎంకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది.
ఈ సంచలన ఆరోపణలపై అటు టీడీపీ వర్గాల నుంచి గానీ, ఎంపీ కేశినేని చిన్ని నుంచి గానీ ఇంకా ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. అధికార పార్టీ ఎంపీపైనే నేరుగా భూకబ్జా ఆరోపణలు రావడం, అది కూడా పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడం చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాలి. దీనిపై ఇరు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


.webp)


