కేసీఆర్ టీమ్పై సీబీఐ కోర్టు కేసు: ఎన్నెన్నో సందేహాలు!
posted on Apr 25, 2014 4:06PM
.jpg)
కేసీఆర్, హరీష్రావు, విజయశాంతి సంపాదన మీద విచారణ జరిపించాలని సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించింది. ఈ ఆదేశాల మీద స్పందిస్తూ హరీష్రావు ఇది కాంగ్రెస్ పార్టీ కుట్రే అని గగ్గోలు పెట్టగా, విజయశాంతి మాత్రం తనకేం భయం లేదని చెప్పారు. అయితే టోటల్గా ఈ అంశంలో సమాధానాలు దొరకని కొన్ని సందేహాలున్నాయి. కేసులు పెడితే, తెలంగాణ ఉద్యమం పేరుతో వసూళ్ళు చేశారన్న ఆరోపణలు కేసీఆర్ కుమారుడు కేటీఆర్ మీద, కేసీఆర్ కుమార్తె కవిత మీద కూడా వున్నాయి. అయితే వాళ్లిద్దరినీ ఈ కేసు నుంచి ఎందుకు తప్పించారనేది ఒక పెద్ద సందేహం. హరీష్రావు ఆక్రోశించినట్టు ఇది కాంగ్రెస్ కుట్ర అయితే కేసీఆర్, హరీష్రావు పేరుతోపాటు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే వున్న విజయశాంతి మీద కూడా ఎందుకు కేసు పెట్టారు? కేసీఆర్, హరీష్రావుతోపాటు విజయశాంతి మీద కూడా కేసు పెడితే ఇది కాంగ్రెస్ కుట్ర అని ఎవరూ అనుకోరని ముందు జాగ్రత్త చర్యగా ఆమెను కూడా ఈ కేసులో ఇరికించారా? మరో ఐదు రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో పోలింగ్ జరగబోతూ వుండగా, ఇప్పుడే ఈ కేసుని ఎందుకు వెలుగులోకి తెచ్చారు? ఇలాంటి సందేహాలు ఎన్నెన్నో కలుగుతున్నాయి. ఈ సందేహాలకు సమాధానాలు దొరకాలంటే మరికొంతకాలం ఆగాలి.