కేసీఆర్ పాదాభివందన ప్రహసనం

posted on: Jun 20, 2015 1:35PM

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాదాభివందనాల ప్రహసనం ఇప్పుడు వివాదాస్పదమైంది. నిజాం ప్రభుత్వ కాలంలో, ఆ తర్వాత తెలంగాణ ప్రజల చేత ‘బాంచన్ నీ కాల్మొక్తా దొరా’ అనిపించుకున్న దొరల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న  ఆయన ఇప్పుడు పాదాభివందనాలు చేస్తూ బిజీగా వున్నారు. పాదాభివందనాలు చేయించుకోవడమే తప్ప చేయడం ఎరుగని దొరల బిడ్డ కేసీఆర్ ఇప్పుడు నడుం వంచి పాదాభివందనాలు చేస్తూ జనాలు షాకయ్యేలా చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు వరకూ ఆయన ఎవరికీ పాదాభివందనాలు చేసిన దాఖలాలు లేవు. అయితే మాటల్లో మాత్రం చాలామందికి పాదాభివందనాలు చేశారు. ఉద్యమకారులకు పాదాభివందనాలనో, అమరవీరులకు పాదాభివందనాలనో అనడం మామూలే. అయితే ఫిజికల్‌గా పాదాభివందనాలు చేయడం అనేది తెలంగాణ రాష్ట్రం సిద్ధించాకే జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం బిల్లుకు ఆమోదం పొందగానే కేసీఆర్ ఢిల్లీ వెళ్ళిపోయి సోనియాగాంధీ కాళ్ళమీద దఢేల్మని పడిపోయారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన సమయంలో కూడా కేసీఆర్ ఆయన కాళ్ళమీద బొక్కబోర్లా పడిపోయారు. మొన్నామధ్య ఆయనకు చిన్నప్పుడు చదువు చెప్పిన గురువు కనిపించగానే ఆయన కాళ్ళకు దణ్ణం పెట్టేశారు. అఫ్‌కోర్స్ అది మంచి పనే అనుకోండీ...! అయితే ఆయన లేటెస్ట్‌గా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌కి కూడా పాదాభివందనం చేసేశారు. ఇలా ఒక గవర్నర్‌కి పాదాభివందనం చేసిన మొదటి ముఖ్యమంత్రిగా కూడా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోనున్నారు. కేసీఆర్ చేసిన పాదాభివందనంతో ఖుషీ అయిపోవడం వల్లే గవర్నర్ పూర్తిగా తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు భారీ స్థాయిలో వినిపిస్తున్నాయి. అలాగే కేసీఆర్ లాంటి దొర ఇలా కాళ్ళమీద పడిపోవడం తెలంగాణలోని దొరలకు తలవంపులుగా అనిపిస్తున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ మన దొరల పరువు తీస్తున్నాడని వాళ్ళు తలలు బాదుకుంటున్నారట. కేసీఆర్ గారు ఇప్పటికైనా తన పాదాభివందనాల పరంపరను ఆపాలని వాళ్ళు కోరుకుంటున్నట్టు తెలుస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...