ప్రత్యేక రాష్ట్రం సాధకునిపైనే... ప్రత్యేక జిల్లాల ఒత్తిడి!

posted on: Oct 4, 2016 12:58PM

రాష్ట్రం విడిపోయి రెండుగా ఏర్పడ్డాక అటు అంధ్రాలో రాజధాని హడావిడి వుంటే... ఇటు తెలంగాణాలో జిల్లాల హడావిడి కనిపిస్తోంది. ప్రస్తుతం పది జిల్లాల తెలంగాణ... మొదట్లో 17కి చేరుతుందన్నారు. కాని, ఆ సంఖ్య పెరుగుతూ పెరుగుతూ వచ్చి 21కి చేరింది! మొత్తంగా 31జిల్లాలతో కొత్త రాష్ట్రం సరికొత్త రూపు సంతరించుకోనుంది! అయితే, రోజుకో జిల్లా చొప్పున పెరుగుతోన్న ఈ లిస్ట్ గవర్నమెంట్ మీద పని చేస్తోన్న రకరకాల ఒత్తిళ్లకు సంకేతం కావటమే ఆందోళన చెందాల్సిన విషయం... 
కొత్త జిల్లాల ఏర్పాటు... ఈ ప్రకటన సీఎం నోటి వెంట వినిపించిన మరు క్షణం నుంచీ వ్యవహారం మొత్తానికి రాజకీయ రంగు పులుముకుంది. నిజానికి పరిపాలనా సౌలభ్యం కోసం అన్న కారణం బలమైందే అయినా రాను రాను డిస్ట్రిక్ట్స్ డిస్టబెన్సులకి కారణం అయ్యాయి. మరీ ముఖ్యంగా, గద్వాల్, సిరిసిల్లా, జనగాం జిల్లాల వ్యవహారం చినికి చినికి గాలివాన అన్నట్టు నడిచింది. నిరాహార దీక్షలు, డీకే ఆరుణ లాంటి నేతల రాజీనామాలు... ఇలాంటి పరిణామాలతో ఫుల్ గా హీటెక్కింది. ఇక్కడే కేసీఆర్ పై ఎక్కడలేని ఒత్తిడి పని చేసింది...
జిల్లాల విభజన కొత్త రాష్ట్రంలో చాలా అవసరం. అందుకే, మొదట్లో అందరూ స్వాగతించారు. కాని, అందుకోసం ఒక శాస్త్రీయ పద్ధతిని ఎంచుకోకపోవటమే కొంత మంది ప్రజల్లో అసంతృప్తులకి కారణం అయింది. దానికి స్థానిక విపక్ష నేతల మద్దతు మరింత గందరగోళానికి దారి తీసింది. స్వయంగా సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున సిరిసిల్ల ప్రాంతమే జిల్లా డిమాండ్లతో అట్టుడికింది! అఖరుకు, కేటీఆర్ ముఖ్యమంత్రితో మాట్లాడి సిరిసిల్లా జిల్లాకు ఒప్పించాల్సి వచ్చింది. 
సిరిసిల్ల లాగే గద్వాల్ కూడా అనేక వివాదాలకు కారణం అయింది. కేసీఆర్ ఎందుకోగాని ఈ ప్రాంతాన్ని జిల్లా చేసేది లేదంటూ మొండికేశారు. అంతే మొండిగా డీకే అరుణ జిల్లా కోసం ఉద్యమించారు. చివరకు, జనంలో కూడా వ్యతిరేకత వస్తుందనుకున్నారో ఏమోగాని కేసీఆర్ గద్వాలకు జిల్లా హోదా ఇచ్చేశారు. ఇలాగే జరిగింది జనగం జిల్లా విషయంలో కూడా!
ఇక జిల్లా రాజకీయాల విషయంలో మరో కోణం... పేర్లు! వికారాబాద్ ను జిల్లాగా ప్రకటించిన కేసీఆర్ దానికి అనంతగిరి జిల్లా అని పేరు పెడతామని చెప్పారు. కాని, ఎంఐఎం అధినేత అందుకు అడ్డు చెప్పి పంతం నెగ్గించుకున్నారు. ఆయన ఒత్తిడి చేసి వికారాబాద్ జిల్లాగానే పేరు వుంచేశారు! మహబూబాబాద్ పరిస్థితి కూడా ఇంతే! పాత పేరే వుంటుందని ఒత్తిడికి తలొగ్గి ముఖ్యమంత్రి చెప్పారంటున్నారు. ఏ పేరు వున్నప్పటికీ పెద్దగా నష్టమేం లేనప్పటికీ... ఇలా రకరకాల ప్రెషర్స్ కి నిర్ణయాలు ప్రభావితం అయితే ఎలా అంటున్నారు విశ్లేషకులు!
కొంత మంది చెబుతోన్న దాని ప్రకారం ఇప్పటికే 31కి చేరుకున్న జిల్లాల సంఖ్య దసరా నాటికల్లా మరింత పెరిగే అవకాశం వుందంటున్నారు. అలా జరుగుతుందో లేదో చెప్పలేం. సంఖ్య ఎంత వుంటే మంచిది అన్న అవగాహన కూడా ఇప్పుడు ఎవ్వరికీ లేదు.కాకపోతే, కలెక్టర్లు, కలెక్టరేట్లు, ఇంకా ఇతర అవసరాలను దృస్టిలో పెట్టుకుని జిల్లాలు ఏర్పాటు చేస్తే మంచిది! సంఖ్య విపరీతంగా పెరిగిపోయి కలెక్టర్లు, కలెక్టరేట్లు కూడా సరిగ్గా లేని పరిస్థితి ఏర్పడితే... పరిపాలన గాడి తప్పే అవకాం పొంచి వుంది!
 

google-ad-img
    Related Sigment News
    • Loading...