కేసీఆర్ గుండె గుభేల్‌మంది! ఎందుకు?

posted on: Jun 4, 2014 3:40PM

 

తన మాటలతో అందరి గుండెల్లో మంట పుట్టించే కేసీఆర్ గుండె గుభేల్‌మన్నట్టు సమాచారం. ఎన్నికల సందర్భంగా రైతుల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన కేసీఆర్ దీనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెలుసుకోవడానికి బుధవారం నాడు బ్యాంకర్లతో సమావేశమయ్యారు. బ్యాంకుల్లో రైతుల రుణాల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బ్యాంకర్లు రకరకాల లెక్కలు వేసి, కూడికలు, తీసివేతలు చేసి చివరికి రైతుల రుణ మాఫీకి 12 వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యే అవకాశం వుందని తేల్చి చెప్పారు. ఈ ఫిగర్ విన్న కేసీఆర్ గతుక్కుమన్నట్టు సమాచారం. ఈ 12 వేల కోట్లు కూడా 2013-2014 ఆర్థిక సంవత్సరం రుణాలు మాత్రమే. అదే అంతకుముందు ఆర్థిక సంవత్సరాల రుణాలను, రైతులు బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా అడ్డంగా ఆరిపోయే అవకాశం వుందని తెలిసి కేసీఆర్ కంగు తిన్నట్టు సమాచారం. దాంతో తీవ్రంగా ఆలోచించిన కేసీఆర్ 2013-2014 ఆర్థిక సంవత్సరం రుణాలు మాత్రమే మాఫీ చేస్తామని, అది కూడా లక్ష రూపాయల లోపు రుణాలు మాత్రమే మాఫీ చేయాలని నిర్ణయించారు. అంతకుముందు సంవత్సరాల రుణాలతో తమకు సంబంధం లేదని డిసైడ్ చేశారు. అలాగే రైతులు బంగారం బ్యాంకుల్లో పెట్టి తీసుకున్న రుణాలకు కూడా తమకు ఎలాంటి సంబంధం లేదని కూడా నిర్ణయించారు. మొత్తమ్మీద 2013-2014 ఆర్థిక సంవత్సరానికి రూ. లక్ష లోపు రుణమాఫీకి సహకరించాలని బ్యాంకర్లను ఈ సందర్భంగా కేసీఆర్ కోరారు. మరో వారంరోజుల్లో మరోసారి భేటీ కావాలని కేసీఆర్ కోరారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...