కారులో ఉద్యమకారులకు చోటు లేదట

posted on: Mar 25, 2014 12:01PM

 

తెలంగాణలో టీఆర్ఎస్ తరఫు నుంచి అరిచేవాళ్ళే తప్ప ఎన్నికలలో గెలిచేవాళ్ళు లేనట్టు కనిపిస్తోంది. కానీ ఇప్పుడు వారు కూడా ఎన్నికలలో నిలబడటానికి పనికిరార న్నట్టుగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. ఇంతకాలం ఉద్యమకారుల్ని, కవుల్ని, కళాకారుల్ని వాడుకున్న కేసీఆర్ ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి వాళ్ళని దూరంగా పెడుతున్నాడు. ప్రజల్లో మంచి గుర్తింపు వున్న వారు కూడా కేసీఆర్‌ని టిక్కెట్ కోసం అభ్యర్థిస్తుంటే వాళ్ళని పట్టించుకోవడం లేదు. డబ్బు పెట్టి గెలిచే సత్తా వున్నవారికే టిక్కెట్లన్నట్టుగా కేసీఆర్ వ్యవహార శైలి వుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

 

అమరవీరుల కుటుంబాలకు బోలెడన్ని టిక్కెట్లు పేలాలు పంచినట్టు పంచుతానని గతంలో ప్రకటించిన కేసీఆర్ తీరా శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ టిక్కెట్ అడిగితే కాదు పొమ్మన్నాడు. తీరా ఆమె తనకి టిక్కెట్ ఇవ్వకపోతే తన కొడుకులాగా తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ మూడు రోజుల ‘డెడ్‌లైన్’ విధించేసింది. దాంతో దారికొచ్చిన కేసీఆర్ నల్లగొండ జిల్లాలోని ఓ అసెంబ్లీ టిక్కెట్‌ని ఆమెకి కేటాయించినట్టు హామీ ఇచ్చి బుజ్జగించాడు. కేసీఆర్ టిక్కెట్ ఇవ్వకపోతే శంకరమ్మకి తాము టిక్కెట్ ఇస్తామని అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం ప్రకటించడంతో కేసీఆర్‌కి ఇంతకంటే మరో దారి లేకపోయింది. అయితే శంకరమ్మ ఆవేశాన్ని చల్లార్చి, ప్రస్తుతానికి గండం నుంచి గట్టెక్కడానికే కేసీఆర్ ఆమెకి టిక్కెట్ ఇచ్చాడని తెలంగాణవాదులు భావిస్తున్నారు. కొంతకాలం తర్వాత శంకరమ్మకి ఏదో ఒక కాకమ్మ కథ చెప్పి ఆమెని మెల్లగా పోటీ నుంచి తప్పించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

 

కేసీఆర్ దగ్గరకి టిక్కెట్ కావాలని ఎవరు వచ్చినా, వాళ్ళకి టిక్కెట్ ఇవ్వడం ఇష్టం లేకపోతే ‘ఫ్యూచర్లో నిన్ను ఎమ్మెల్సీ చేస్తా’ అంటూ హామీలు ఇచ్చి పంపించేస్తున్నాడు. టీఆర్ఎస్‌కి ఇప్పటికీ తెలంగాణలో సగానికి పైగా సీట్లలో గెలిచే అభ్యర్థులే లేరు. టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలలో వున్న గెలుపు గుర్రాలకు పగ్గాలు వేయడానికి ఒకవైపు ప్రయత్నిస్తూనే మరోవైపు మా పార్టీలో గెలుపు గుర్రాలకు కొదువలేదని చెబుతున్న కేసీఆర్ చాణక్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవు.

google-ad-img
    Related Sigment News
    • Loading...