కాంగ్రెస్, బీజేపీ వార్... ముఖ్యమంత్రిగా కుమారస్వామి..!
posted on: May 15, 2018 4:02PM

నిన్నటి వరకూ కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ కనుక గెలిస్తే యడ్యూరప్ప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని... కాంగ్రెస్ కనుక గెలిస్తే సిద్ద రామయ్య ముఖ్యమంత్రి అవుతారన్న అభిప్రాయాలు ఉన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే ప్రధాన పార్టీలు ఆ రెండే కాబట్టి.. ఆ రెండు పార్టీలకే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఇద్దరిలోనే ఎవరో ఒకరు ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి అలా అనుకోవడంలో తప్పులేదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా మరో వ్యక్తి తెరపైకి వచ్చారు. అది ఎవరో కాదు కుమార స్వామి.
నిజానికి ఈరోజు ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తరువాత.. కొద్దిసేపటికే బీజేపీ హవా కొనసాగించింది. దాదాపు అన్ని చోట్లా ఆధిక్యంలోకి వచ్చి మ్యాజిక్ ఫిగర్ కూడా దాటేసింది. కానీ ఓట్ల లెక్కింపు జరిగేకొద్ది క్షణ క్షణానికి ఫలితాలు మారుతూ.. అందరిలో ఆసక్తి రేకెత్తించాయి. దాంతో నిన్నటి వరకూ కర్ణాటక ఎన్నికల్లో హంగ్ ఏర్పడుతుందీ అనున్నారు కానీ.. ఆ పరిస్థితి లేదు.. బీజేపీనే అధికారం చేపడుతుందని అందరూ ఊహించారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ చిన్న చిన్నగా కాంగ్రెస్ కూడా పుంజుకోవడం మొదలుపెట్టిందో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. చాలా చోట్ల బీజేపీని వెనక్కి నెట్టి కాంగ్రెస్ దూసుకొచ్చింది. దాంతో బీజేపీ కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలు దక్కించుకున్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్ అందుకోలేకపోయింది. ముందునుండి అనుకున్నట్టుగానే హంగ్ ఏర్పడింది. దాంతో ఇప్పుడు జేడీఎస్ కీలకంగా మారింది.
మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జేడీఎస్ తో మంతనాలు మొదలుపెట్టేశాయి. కాంగ్రెస్ కు అధికారం రాకూడదని బీజేపీ... ఏమైనా సరే.. కర్ణాటక పీఠం బీజేపీకి దక్కకూడదన్నట్లుగా కాంగ్రెస్ వ్యవహరిస్తున్నాయి. అంతేకాదు.. ఇప్పటికే కాంగ్రెస్ నుండి గులాం నబీ అజాద్ వంటి పెద్దలు వచ్చి పావులు కదపటం మొదలెట్టారు. ఈ నేపథ్యంలోనే... జేడీఎస్ కు బయట నుంచి మద్దతు ఇస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ఓకే చెప్పినట్టు సమాచారం. తమకు అధికారం అక్కర్లేదని.. జేడీఎస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని.. కుమారస్వామి సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. దీంతో.. కాంగ్రెస్ తో కలుద్దామా? వద్దా? అన్న ఆలోచనలో ఉన్న కుమారస్వామి... వెతుక్కుంటూ వచ్చిన సీఎం పదవిని ఓకే చేసే అవకాశం ఉందంటున్నారు. వరుస దెబ్బలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జేడీఎస్.. తానే అధికారం చేపట్టే ఛాన్స్ వస్తే.. ఆ అద్భుత అవకాశాన్ని వదులుకునేది లేదు అంటున్నారు. దీంతో.. కర్ణాటక రాజకీయం ఒక్కసారిగా మారింది. ఇక బీజేపీ కూడా తమ వంతు తాము ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. మరి చూద్దాం ఆఖరికి ఏం జరుగుతుందో..






.webp)



