మాట్లాడుకుందాం రమ్మని..!

గుడి, బడి, అన్న, తమ్ముడు, తండ్రి, తాత ఇలా ఎక్కడా..ఎవరి దగ్గరా స్త్రీకి రక్షణ లేకుండా పోతుంది. ఎప్పుడు ఎవరి మనుసులో ఏ దుర్బుద్ధి పడుతుందో ఆ పరమాత్ముడికి కూడా తెలియదు. తాజాగా ప్రకాశం జిల్లా కనిగిరిలో దారుణం జరిగింది. సరదాగా మాట్లాడుకుందాం అంటూ రమ్మని పిలిచిన ప్రేమికుడే ఆమెను బలవంతంగా అత్యాచారం చేయమని తన స్నేహితుడి చేతుల్లో పెట్టాడు. అక్కడితో ఆగకుండా ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..ఓ యువతి కనిగిరిలో డిగ్రీ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన కార్తీక్ అనే యువకుడికి చదువు వంటబట్టక ఖాళీగా తిరుగుతున్నాడు. ఖాళీగా ఉండేవాడు ఏం చేస్తాడు.. అమ్మాయిల చుట్టూ తిరుగుతాడు కదా.. అచ్చం అలాగే కార్తీక్‌ డిగ్రీ చదువుతున్న యువతితో స్నేహం చేస్తున్నాడు. ఆ ఫ్రెండ్‌షిప్ కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఓ రోజు కార్తీక్ మాట్లాడుకుందామంటూ ఆ యువతిని ఊరి చివర ఉన్న పొలాల వద్దకు తీసుకెళ్లాడు. తన మిత్రులు సాయి, పవన్‌లను కూడా తోడు కోసం రమ్మన్నాడు. యువతికి తోడుగా ఆమె స్నేహితురాలు వెళ్లింది. అందరు కలిసి కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. అలా అయితే వారు వార్తల్లోకి ఎక్కుతారు.

 

మాటల్లో మాటగా కార్తీక్ తన స్నేహితురాలిని రేప్ చేయమంటూ..తన స్నేహితుడు సాయికి అప్పగించాడు. ఆ మాట చెప్పడమే ఆలస్యం..సాయి ఆ యువతిని గట్టిగా పట్టుకొని..బలవంతంగా బట్టలు విప్పే ప్రయత్నం చేశాడు. ఆ అమ్మాయి ఏడుస్తూ ఎంతగా బ్రతిమలాడుతున్నా వినకుండా దుర్మార్గంగా వ్యవహరించాడు. తనను నమ్మి వచ్చిన అమ్మాయిని స్నేహితుడు అలా చేస్తుంటే ఏ మాత్రం సిగ్గు లేకుండా ఈ తతంగాన్నంతా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఆ కీచకుల బారి నుంచి ఎలాగొలా తప్పించుకున్న బాధితురాలు ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు దారుణాన్ని గురించి చెప్పింది. అయితే కుటుంబం పరువు పొతుందని భయపడిన వారు సైలెంట్‌గా ఉండిపోయారు. అయితే తమకు సహకరించలేదన్న అక్కసుతోనో..మరో కారణం చేతనో ఆ దుర్మార్గులు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..విషయం బయటకు రావడంతో యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు మృగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి ఘటనలన పాఠంగా తీసుకుని అమ్మాయిలు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలంటున్నారు పోలీసులు.