బాంబుందని జోకులు..జైల్లో పెట్టిన అధికారులు

posted on: Mar 4, 2017 5:29PM

మీకు చిన్నప్పుడు పెద్దలు చెప్పిన "నాన్నా పులి" కథ బాగా గుర్తుండే ఉంటుంది? అందులో పులి రాకపోయినా వచ్చిందని ఆబద్ధం ఆడతాడు ఒక పిల్లవాడు. రెండు సార్లు పిల్లాడి అరుపులు విన్న తండ్రి కంగారుగా వచ్చి చూస్తే...అబ్బే ఏం లేదు వూరికే సరదాగా అన్నా అంటూ చెబుతాడు..కాని ఈ సారి నిజంగా పులి వస్తుంది..అప్పుడు నాన్నా పులి..నాన్నా పులి అంటూ అరుస్తాడు...పిల్లాడు ఈసారి కూడా సరదాగా అంటున్నాడేమోనని అనుకున్న తండ్రి ఆ మాటలు పట్టించుకోడు..చివరికి పులి మేకను చంపి తీసుకెళ్లిపోతుంది..అదే ముందు ఆబద్ధం చెప్పకుండా ఉండి ఉంటే మేక బతికుండేది..

 

 

ఇప్పుడు అచ్చం అలాంటి పరిస్థితిని ఎదుర్కొంది ముంబైకి చెందిన ఓ మోడల్. వివరాల్లోకి వెళితే ముంబైకి చెందిన కాంచన్ ఠాకూర్ మోడలింగ్ చేస్తోంది. ఆమె గత గురువారం రాత్రి స్నేహితురాలితో కలిసి ఢిల్లీ వెళ్లేందుకు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎక్కుతుండగా సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ చెకింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న గార్డుతో తన వెనుక ఉన్న మహిళ బ్యాగులో బాంబు ఉందనీ, జాగ్రత్తగా తనిఖీ చేయాలని చెప్పింది. దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ గార్డు ఉన్నతాధికారులకు సమాచారం అందించి విమానాన్ని నిలిపివేశారు.

 

 

ఆమెతో పాటు విమానం ఎక్కిన ప్రతీ ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు లగేజీని కూడా కిందకి దించేశారు. ఈ హడావిడిలో తీరిగ్గా అసలు విషయాన్ని చెప్పింది కాంచన్..బాంబు అన్న మాట ఒట్టిదేననీ, సరదాగా అలా అన్నాననీ చెప్పుకొచ్చింది. దీంతో ఒక్క క్షణం షాక్‌కు గురైన అధికారులు వెంటనే తేరుకుని మోడల్ చేతికి సంకెళ్లు వేశారు. ఆమెపై ఐపీసీ సెక్షన్ 505 (1)(బి) కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఫేక్ కాల్స్‌తో సతమతమవుతున్న భద్రతా సిబ్బందికి తలనొప్పిగా మారుతోంది. ప్రయాణికులు ఇటువంటి సీరియస్ విషయాలపై కూడా జోకులు వేస్తూ పోతే ..ఒకవేళ నిజంగా బాంబు ఉండి భద్రతా సిబ్బంది పట్టించుకోకపోతే జరిగే నష్టం ఊహకు కూడా అందదు.

google-ad-img
    Related Sigment News
    • Loading...