Latest News
పోషించలేక ముగ్గురు కూతుళ్లను చెరువులోకి తోసిన తండ్రి
posted on: Mar 8, 2026 12:07PM

మహిళా దినోత్సవం రోజున తెలంగాణలో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. కామారెడ్డి పట్టణంలో ఓ తండ్రి తన ముగ్గురు చిన్నారి కూతుళ్లను చెరువులోకి తోసేయడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం, కామారెడ్డి పట్టణంలోని ఆర్పీ నగర్ ప్రాంతంలో ఇస్మాయిల్–షబీనా దంపతులు తమ ముగ్గురు కూతుళ్లు షీపత్ (8), ఆయత్ (7), మరియం (5)తో కలిసి నివసిస్తున్నారు. ఇస్మాయిల్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుండగా, షబీనా కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.
శనివారం షబీనా కూలీ పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి పిల్లలు కనిపించకపోవడంతో ఆమె ఆందోళనకు గురైంది. పిల్లలు ఎక్కడికి వెళ్లారో తెలియకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొదట విచారణలో ఇస్మాయిల్ పోలీసులకు భిన్నమైన వివరణ ఇచ్చాడు. పిల్లలకు దోశ తినిపించేందుకు తీసుకెళ్లానని, ఆ సమయంలో ఆటోకు గిరాకీ రావడంతో వారిని ఇంటికి వెళ్లమని చెప్పి తాను వెళ్లిపోయానని తెలిపాడు.
అయితే పోలీసులు పరిశీలించిన సీసీటీవీ దృశ్యాలు, ఇస్మాయిల్ చెప్పిన వివరాలకు పొంతన లేకపోవడంతో అతడిని మళ్లీ కఠినంగా విచారించారు. దీంతో చివరికి అతడు చేసిన ఘోరాన్ని ఒప్పుకున్నాడు. కుటుంబాన్ని పోషించే స్థోమత లేక, నిరాశలో ముగ్గురు కూతుళ్లను పెద్ద చెరువులోకి తోసేశానని వెల్లడించాడు. పిల్లలు చనిపోయారో లేదో నిర్ధారించుకోవడానికి సుమారు అరగంట పాటు చెరువు దగ్గరే ఉన్నానని కూడా చెప్పాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయక బృందాలతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలను వెలికితీసారు. మరో చిన్నారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.ఈ దారుణ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. మహిళా దినోత్సవం రోజునే తండ్రి చేతిలో ముగ్గురు చిన్నారులపై జరిగిన ఈ ఘటన అందరినీ కలచివేసింది.


.webp)
.webp)


