మే 20 నుంచి టీఆర్ఎస్ జెండా పండుగలు...రంగంలోకి కవిత

posted on: May 11, 2026 8:11PM

 

తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్న కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ భావజాలాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు ‘జెండా పండుగ’ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ శ్రేణులకు కవిత దిశానిర్దేశం చేశారు.

మే 20 నుంచి జూన్ 20 వరకు ఈ ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. కేవలం నగరాలు, పట్టణాలకే పరిమితం కాకుండా, ప్రతి పల్లెలోనూ పార్టీ జెండాను ఎగురవేసి, పార్టీ ఉనికిని చాటాలని ఆమె కార్యకర్తలకు సూచించారు. గ్రామ స్థాయి నుంచి రాజధాని వరకు ప్రతి చోటా ఈ సంబరాలు అంబరాన్నంటేలా ప్లాన్ చేస్తున్నారు.

ఈ జెండా పండుగ సందర్భంగా పార్టీ ఆవిర్భావ సమయంలో ప్రకటించిన 'పాంచజన్య' సిద్ధాంతాలను సామాన్య ప్రజలకు వివరించనున్నారు. పార్టీ అనుసరిస్తున్న విధానాలు, తెలంగాణ సమాజం పట్ల తమకున్న బాధ్యతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సామాజిక, రాజకీయ సమస్యలపై గళమెత్తాలని కవిత పార్టీ శ్రేణులను కోరారు. కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా, స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఎక్కడికక్కడ పోరాటాలు చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు.

పార్టీ బలోపేతం కోసం చురుకైన కార్యకర్తలను గుర్తించి, వారికి తగిన బాధ్యతలు అప్పగించనున్నారు. సమాజం పట్ల అంకితభావం కలిగిన వ్యక్తులను కలుపుకుంటూ ఒక బలమైన ప్రజా సైన్యాన్ని నిర్మించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. రాజకీయ చైతన్యంతో కూడిన ఈ జన సమూహం భవిష్యత్తులో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని కవిత పిలుపునిచ్చారు.

మొత్తానికి, ఈ నెల రోజుల పాటు జరిగే జెండా పండుగ ద్వారా తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర రాజకీయాల్లో తన బలాన్ని నిరూపించుకోవాలని చూస్తోంది. రాబోయే రోజుల్లో ఈ జెండా పండుగ ఎలాంటి రాజకీయ మార్పులకు శ్రీకారం చుడుతుందో వేచి చూడాలి.

google-ad-img
    Related Sigment News
    • Loading...