కాల్వ ఎంట్రీతో అనంతలో మారిపోయిన సమీకరణలు..

posted on: Apr 3, 2017 3:17PM


టీడీపీకి కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లాలో.. మంత్రివర్గ విస్తరణ రాజకీయ సమీకరణలను, ప్రాధాన్యతలను మార్చేసింది. మూడేళ్లుగా మంత్రిగా కొనసాగిన పల్లె రఘునాథరెడ్డి పదవి కోల్పోవడం... చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు మినిస్టర్ అవటంతో.. ఈక్వేషన్స్ అన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. మంత్రిగా పరిటాల సునీత కంటిన్యూ అవుతున్నా.. శాఖ మారే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. దాంతో కాల్వ శ్రీనివాసులు.... ఇకపై జిల్లా రాజకీయాల్లో కీలకంగా మారతారనే టాక్‌ వినిపిస్తోంది.

 

అయితే కేబినెట్‌లో బెర్త్ కోసం.. చివరిదాకా ప్రయత్నించిన బీకే పార్థసారథి, చాంద్ బాషా, పయ్యావులకు నిరాశే మిగిలింది. బీసీ కోటాలో బీకే పార్థసారథి, మైనారిటీ కోటాలో చాంద్ బాషా మంత్రి పదవి కోసం పోటీ పడ్డారు. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ కూడా చివరి వరకు ప్రయత్నాలు కొనసాగించారు. కానీ.. కాల్వ శ్రీనివాసులుకు కేబినెట్ బెర్త్ దక్కటంతో.. మిగిలిన వారంతా ఆవేదనకు గురయ్యారు.

 

మంత్రివర్గ విస్తరణలో భాగంగా.. పల్లె రఘనాథరెడ్డి మంత్రి పదవి కోల్పోయారు. పుట్టపర్తి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పల్లె.. ఐదు శాఖలకు మంత్రిగా పనిచేశారు. మూడేళ్లుగా మినిస్టర్‌గా ఉండి జిల్లాకు గానీ.. నియోజకవర్గానికి గానీ.. పల్లె చేసిందేమీ లేదన్న విమర్శలూ ఉన్నాయి. నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు పెంచి పోషించారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఏదేమైనా.. మంత్రి పదవి కోల్పోయిన పల్లెకు.. చీఫ్ విప్ పదవి దక్కడం కాస్త ఊరటనిచ్చే విషయం.

 

ఇక మంత్రిగా పదవి నిలుపుకున్న పరిటాల సునీత.. శాఖ మారొచ్చన్న ప్రచారమైతే జరుగుతోంది. కేబినెట్ విస్తరణకు ముందు.. పదవి నుంచి తప్పిస్తారని ప్రచారం జరిగినా.. పదవి నిలుపుకోవటంతో.. అభిమానులు, కార్యకర్తలు ఆనందంగా ఉన్నారు. అనంతలో ముందు నుంచి రెండు మంత్రి పదవులు, చీఫ్ విప్ పదవి ఉన్నాయి. ఈసారి కూడా అవే పదవులు జిల్లాను వరించినా.. వ్యక్తులు మాత్రం మారారు. కొత్త మంత్రులతో.. జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...