Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నెలరోజుల్లో ఎంత మార్పు..!
posted on: Aug 10, 2016 3:10PM

నెల రోజుల క్రితం మందిమార్భలంతో..రాజదర్పంతో రాష్ట్రాధినేతగా ఏ బంగ్లా నుంచి బయటకు వచ్చారో..సరిగ్గా నెల తిరిగే సరికి అదే బంగ్లాలో ఆయన శవమై కనిపించారు. ఇది ఎవరి కథో ఈపాటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కలిఖ్ పుల్ అసాధారణ రీతిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిన్న ఉదయం రాజధాని ఇటానగర్లోని తన అధికారిక నివాసంలోని సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని పుల్ ఆత్మహత్య చేసుకున్నారు. సినీ వినీలాకాశంలో తారలుగా వెలుగొందాలని గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టి విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి, అవకాశాలు రాకపోవడంతో ఇక్కడ ఇమడలేక తనువు చాలించిన ఎంతోమంది తారలను మనం చూశాం. కానీ స్వతంత్ర భారతచరిత్రలో ముఖ్యమంత్రిగా చేసిన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం మనదేశంలో విచిత్రమైన..విషాదం.
అరుణాచల్ప్రదేశ్లోని మారుమూల ప్రాంతం అంజాప్ జిల్లాలో 1969 జూలై 20న జన్మించిన పుల్ హ్యూమానిటీస్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. వడ్రంగిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. 1995లో రాజకీయాల్లోకి ప్రవేశించి హయులియాంగ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తొలి విజయంతోనే సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే 2015 డిసెంబర్లో అరుణాచల్ప్రదేశ్లో ఏర్పడిన రాజకీయ సంక్షోభం పుల్ జీవితాన్ని మలుపుతిప్పింది. ప్రజాధనాన్ని నబుంటుకీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందంటూ కలిఖోపుల్ బహిరంగంగా విమర్శలు చేయడంతో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో సీఎం నబుంటుకీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు, బీజేపీ మద్ధతుతో డిసెంబర్ 17, 2015న అరుణాచల్ప్రదేశ్ ఎనిమిదవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు పుల్.
అనంతరం రాష్ట్రపతి పాలన విధించడం, పుల్ ప్రభుత్వంపై కాంగ్రెస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో ఈ ఏడాది జూలై 13న పుల్ ప్రభుత్వాన్ని రద్దు చేసి, నబుంటుకీ ప్రభుత్వాన్ని పునరుద్దరిస్తూ తీర్పు చెప్పింది సుప్రీం. దీంతో సీఎం పదవి నుంచి పుల్ గత నెలలోనే తప్పుకున్నారు. ఆయన సొంత నివాసానికి పునరుద్దరణ పనులు జరుగుతుండటంతో ఇటానగర్లోని ప్రభుత్వ నివాసంలోనే ముగ్గురు భార్యలు, నలుగురు బిడ్డలతో కలిసి జీవిస్తున్నారు. త్వరలోనే ఆ ఇంటిని ఖాళీ చేయాల్సి ఉంది. సుప్రీం తీర్పు వచ్చినప్పటి నుంచి కాస్త ముభావంగా ఉంటున్న పుల్ గత వారం రోజుల నుంచి బయటి వ్యక్తులను కలుసుకోవడానికి ఇష్టపడటం లేదు. చివరిసారిగా కాంగ్రెస్ సభ్యుడు నినాంగ్ ఎరింగ్తో మాట్లాడారు. ఈ పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. పుల్ ఇంట్లో ఎలాంటి సూసైడ్ నోటు లభించలేదు. ఒక డైరీ దొరకడంతో పోలీసులు దానిని పరిశీలిస్తున్నారు.
కలిఖోపుల్ ఆత్మహత్య విషయం తెలియగానే ముఖ్యమంత్రి పెమా ఖండూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మహత్యకు కారణాలపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశిస్తూ సీఎం ఉత్తర్వులు జారీ చేశారు. రాజకీయాల్లోకి వచ్చే ప్రతి నాయకుడి అంతిమ లక్ష్యం పదవి. దాని కోసం ఎన్ని అపజయాలు ఎదురైనా కుంగిపోకుండా తుది వరకు పోరాడుతారు లేదంటే రాజకీయాల నుంచే తప్పుకుంటారు. కానీ అవమానం జరిగిందని..కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడరు. అలా అయితే దేశంలో పదవులు కోల్పోయిన వారందరి పరిస్థితి ఏంటి..? వడ్రంగిగా జీవితం ప్రారంభించి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన పుల్ తన జీవితంలో ఎన్నో అటుపోట్లను ఎదుర్కొని ఉంటారు. అలాంటి వ్యక్తి ఇలా అర్థాంతరంగా తనువు చాలిస్తారా..?






