Top Stories

దుమారం రేపుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు..!

  అనంతపురం జిల్లా  తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.. మొదటినుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు పేర్ని నాని, దేవినేని అవినాష్ వంటి వారు తరచూ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తమను అక్రమ కేసులు, అరెస్టులతో వేధిస్తోందని విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు.  తాము అధికారంలోకి వచ్చాక టీడీపీ శ్రేణుల అంతు చూస్తామని, ఇప్పటినుంచే జైళ్లు రిపేరు చేయించకోవాలని వైసీపీ నేతలు పేర్కొనడంపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబుది చేతగానితనం కాదని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన వైసీపీ నేతల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నా రన్నారు. మీకు నాలుగేళ్ల సమయం కావాలేమో.. మేము ఇప్పుడే ఉతికితే ఏం చేస్తారని ప్రశ్నించారు. వైసీపీ నేతలు ఇలాగే మాట్లాడితే చితక్కొట్టాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.  టీడీపీ కార్యకర్తల వైపు కాకుండా.. వైసీపీ వైపే చంద్రబాబు ఉన్నారన్నారు. కాబట్టే వారు చెలరేగిపోతున్నారన్నారు.   వారు ఇలాగే మాట్లాడితే  చితగ్గొట్టాలన్నారు. లైన్ దాటి బహిరంగంగా ఆయన అలా పిలుపునివ్వడం, బూతు పదజాలంతో విరుచుకుపడడం, తమ అధినేతకు సైతం పరోక్షంగా చురకలంటించడం వివాదాస్పదంగా మారాయి.
దుమారం రేపుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి  వ్యాఖ్యలు..! Publish Date: Jun 18, 2025 8:26PM

కడపలో టీడీపీ జెండా ఎగరేద్దాం : శ్రీనివాసులురెడ్డి

  రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి కడప నగరంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసి మునిసిపల్ కార్పొరేషన్ లో  జెండా ఎగురవేసేందుకు  తెలుగుదేశంపార్టీ శ్రేణులన్ని కష్టపడి పని చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, పోలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసులురెడ్డి పిలుపు నిచ్చారు.   బుధవారం ఎమ్మెల్యే నివాసంలో టీడీపీ కడప నగర సంస్థాగత ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ కడప నగరంలో పార్టీ సంస్థాగత నిర్మాణం లేకపోయినప్పటికి 8 నెలలు కష్టపడి బలంగా, కసిగా పనిచేసి ఎమ్మెల్యేగా ఆర్ మాధవిరెడ్డిని గెలిపించుకున్నామన్నారు.  అదే స్పూర్తితో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పనిచేసి కడప నగర కార్పొరేషన్ లో తెలుగుదేశం జెండా ఎగరేయాలని పిలుపు నిచ్చారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు  విడతల వారీగా పదవులు ఇస్తామన్నారు.   వచ్చే నెలలో నగరంలోని 50 డివిజన్లకు సంబంధించిన అభ్యర్థులను అనధికారికంగా ఖరారు చేస్తామన్నారు. ఇప్పటి నుంచే అన్ని డివిజన్లలో క్షేత్రస్థాయిలో పర్యటించి పార్టీని బలోపేతం చేయాలన్నారు. ఈ సమావేశానికి అనంతపురం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మెన్ కేశవరెడ్డి పరిశీలకులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి, పార్టీ నాయకులు బి హరిప్రసాద్, ఎస్ గోవర్థన్ రెడ్డి, జిలాని బాష తదితరులు పాల్గొన్నారు.  
కడపలో టీడీపీ జెండా ఎగరేద్దాం : శ్రీనివాసులురెడ్డి Publish Date: Jun 18, 2025 8:17PM

బనకచర్ల ప్రాజెక్టు అడ్డుకోవడమే తమ లక్ష్యం : సీఎం రేవంత్‌

  బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సచివాలయంలో అఖిలపక్ష ఎంపీలతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. మా ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగ ప్రయోజనాలే ముఖ్యమని సీఎం పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా రైతుల ప్రయోజనాలు ఎజెండాగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆ దిశగా మనందరం కలిసి పనిచేయాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. రాజకీయ లబ్ది కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయలేదని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత కేంద్ర ప్రభుత్వం 21-9-2016 అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు. ఆ సమావేశంలో మొట్టమొదట గోదావరిపై 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని ఆనాటి సీఎం కెసీఆర్ ప్రతిపాదన ఇచ్చారని తెలిపారు. ఆ సమావేశంలో హరీష్ రావుగా కూడా పాల్గొన్నారని ముఖ్యమంత్రి వెల్లడించారు.  రాయలసీమకు గోదావరి జలాల తరలింపులో సహకరిస్తానని కేసీఆర్ గతంలో చెప్పారని గుర్తు చేశారు. అపెక్స్ కౌన్సిల్ లో ఎవరేం మాట్లాడారో అంతా దస్త్రాల రూపంలోనే ఉందన్నారు. ఈ భేటీలో బనకచర్ల ప్రాజెక్టు చేపట్టవద్దని తీర్మానం చేద్దామని గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై టెక్నికల్, లీగల్, పొలిటికల్ గా అడ్డుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రధాని సహా కేంద్ర మంత్రులను కలిసి మా వాదన వివరిస్తామన్నారు. పొలిటికల్ గా మా ప్రయత్నాలు ఫలించకపోతే న్యాయపోరాటం చేస్తామన్నారు. మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అభ్యంతరం తెలిపారు. ఆనాడు తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్‌ మాట్లాడారని వివరణ ఇచ్చారు. కృష్ణానదిని కలుపుతూ గోదావరి జలాలు తీసుకెళ్తే అభ్యంతరం లేదని కేసీఆర్‌ అన్నారని గుర్తు చేశారు.  అయితే ఈ సమావేశం నుంచి బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవి చంద్ర వాకౌట్ చేశారు. సమావేశం పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో జరుగుతోందన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ వివరాలను ఆనాటి మంత్రులు ఈటెల రాజేందర్ , బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు. ఈ మీటింగ్ మినిట్స్ ను రిఫరెన్స్ గా చూపి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు బనకచర్లను గుదిబండగా మార్చే ప్రయత్నం చేస్తోందని తెలిపారు.
బనకచర్ల ప్రాజెక్టు అడ్డుకోవడమే తమ లక్ష్యం : సీఎం రేవంత్‌ Publish Date: Jun 18, 2025 7:53PM

వైసీపీ సైకోలను తయారు చేసే ఫ్యాక్టరీగా మారింది : నారా లోకేశ్

  మాజీ సీఎం జగన్ పల్నాడు రెంటపాళ్ల గ్రామ పర్యటన సందర్బంగా వైసీపీ శ్రేణులు ప్రదర్శించిన ఫ్లెక్సీలపై మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యథా అధినేత.. తథా నాయకులు, కార్యకర్తలు. వైసిపి సైకోలను తయారు చేసే ఫ్యాక్టరీగా మారింది. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా వైసీపీ పద్ధతి మారలేదు. ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేసే విధంగా వ్యవహరించడం దారుణం. ప్రజా పాలనలో ఇటువంటి చర్యలను ఉపేక్షించం అని ఎక్స్‌లో లోకేశ్ స్పష్టం చేశారు.  కాగా జగన్ పర్యటనలో కొందరు వివాదాస్పద ఫ్లకార్డులను ప్రదర్శించారు. పుష్ప సినిమా డైలాగులను ఫ్లకార్డులపై ప్రదర్శించారు. జగన్ వస్తాడు..అంతుచూస్తాడు అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. అంతేకాకుండా గంగ‌మ్మ‌త‌ల్లి జాత‌ర‌లో వేట త‌ల‌లు న‌రికిన‌ట్టు న‌రుకుతం ఒక్కొక్కడిని అంటూ జ‌గ‌న్ ఫోటోల‌తో ఉన్న ఫ్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు.ప్ర‌స్తుతం అవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.
వైసీపీ సైకోలను తయారు చేసే ఫ్యాక్టరీగా మారింది : నారా లోకేశ్ Publish Date: Jun 18, 2025 6:45PM

బనకచర్ల ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం : మంత్రి ఉత్తమ్

  ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించ తలపెట్టిన పోలవరం-బసకచర్ల ప్రాజెక్టును తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్టును తిరస్కరించాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామన్నారు. బసకచర్ల ప్రాజెక్టు తెలంగాణ నీటి హక్కులకు పెద్ద దెబ్బ అని ఈ ప్రాజెక్టు విషయంలో విభజన చట్టాన్ని కూడా ఏపీ ఉల్లంఘిస్తోందని తెలిపారు. నేను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లి రాష్ట్ర అభ్యంతరాలను కేంద్రాన్నికి సమర్పిస్తాం అని పేర్కొన్నారు.  బనకచర్ల ప్రాజెక్టుపై ఇవాళ రాష్ట్ర సచివాలయంలో అఖిలపక్ష ఎంపీలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, గోదావరి-బనకచర్ల  లింక్ ప్రాజెక్టు పై అన్ని పార్టీలతో చర్చలు జరుపుతున్నామని ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకాగా బీఆర్ఎస్ నుంచి ఎంపీ రవిచంద్ర, బీజేపీ నుంచి ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ ఎంపీలు సురేష్ షట్కర్, రఘరాం రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, రేణుకా చౌదరి, చాలమ కిరణ్ కుమార్ రెడ్డి, బలరామ్ నాయక్, మల్లు రవి, గడ్డం వంశీ కృష్ణ, ఉన్నతాధికారులు హాజరయ్యారు.  
బనకచర్ల ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం : మంత్రి ఉత్తమ్ Publish Date: Jun 18, 2025 6:27PM

పంద్రాగస్టు నుంచి జాతీయ రహదారుల్లో యాన్యువల్ ఫాస్టాగ్ పాస్

    జాతీయ రహదారులపై ప్రయాణం విషయంలో ఫాస్టాగ్ యాన్యూవల్ పాస్‌ను ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజు నుంచి అందుబాటులోకి వస్తుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్ ద్వారా తెలిపారు. ఈ యాన్యువల్ పాస్ రూ. 3 వేలు ఉంటుందని  గడ్కరీ పేర్కొన్నారు. ఏడాది పాటు 200 ట్రిప్పులు పరిమితి ఉంటుందని పేర్కొన్నారు. కార్లు, జీపులు, నాన్ కమర్షియల్ వెహికల్స్ కు ఇది వర్తిస్తుందని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారుల్లో ఈ యాన్యువల్ పాస్ పనిచేస్తుందని తెలిపారు. ఈ యాన్యువల్ పాస్ యాక్టివేషన్ కోసం రాజ్ మార్గ్ యాప్ తో పాటు NHAI, MoRTH వెబ్‌సైట్లలో త్వరలోనే ఓ లింక్ ను అందుబాటులోకి తేనున్నామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.  200 టోల్స్‌కు కేవలం రూ.15 ఖర్చవుతుందని తెలిపారు. నూతన విధానంలో వాహనదారులకు రూ. 700 వరకు ఆదా అవుతుంది. ఇది కేవలం జాతీయ రహదారులపై మాత్రమే అని రాష్ట్ర రహదారులపై ఉండే టోల్స్‌కి వర్తించదని స్పష్టం చేశారు.
పంద్రాగస్టు నుంచి జాతీయ రహదారుల్లో యాన్యువల్ ఫాస్టాగ్ పాస్ Publish Date: Jun 18, 2025 5:22PM

ఇరాన్ నుంచి విద్యార్ధులు సురక్షితంగా స్వదేశానికి

ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి ఉద్రిక్తలు చోటు చేసుకున్నా, ముఖ్యంగా ఇరుగు పొరుగు దేశాల మధ్య యుద్ధ వాతావరణం, నెలకొన్న సమయంలో, ఆయా దేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్ధులను, ఇతరత్రా, ఉద్యోగ, ఉపాధి వ్యాపకాల్లో ఆయా దేశాల్లో ఉన్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకు రావడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారుతున్నది. గతంలో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన సమయంలో ఉక్రెయిన్ లో చిక్కుకు పోయిన వందలాది మంది భారత విద్యార్ధులను మన విదేశాంగ శాఖ  ఆ దేశంతో దౌత్య పరమైన చర్చలు జరిపి సురక్షితంగా స్వదేశానికి తీసుకు వచ్చింది. ఇప్పడుమళ్ళీ మరో మారు  అలంటి పరిస్థితే ఎదురైంది.ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య యుద్ద వాతావరణం వేడెక్కుతున్న నేపథ్యంలో ఇరు దేశాల్లో చిక్కుకుపోయిన  భారతీయులు, ముఖ్యంగా ఇరాన్ లో పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయ విద్యార్ధులను సురక్షితంగా స్వదేశానికి తీసుకు వచ్చేందుకు  విదేశాంగ శాఖ  నడుం బిగించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు మూడు దేశాల విదేశీ పర్యటనలో ఉన్న  విదేశాంగ మంత్రి  ఎస్. జయశంకర్  భారతీయ విద్యార్ధులు సురక్షితంగా  సరిహద్దులు దాటేలా అనుమతించాలని చేసిన విజ్ఞప్తిని   ఇరాన్   ప్రభుత్వం వెంటనే ఆమోదించింది. అయితే.. ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ తమ గగనతలాన్ని ఇప్పటికే మూసేసిన నేపథ్యంలో, భూసరిహద్దుల్ని తెరిచి భారతీయ విద్యార్ధులను, సరిహద్దులు దాటించేందుకు ఇరాన్ అంగీకరించింది.  ఇరాన్లో  భారత్ కు చెందిన 1500 మందికి పైగా విద్యార్దులున్నారు.  వారిని తరలించడానికి సహకరించాల్సిందిగా భారత్ చేసిన అభ్యర్థనల దృష్ట్యా వారు సురక్షితంగా సరిహద్దులు దాటి వెళ్లడానికి అన్ని భూ సరిహద్దులు దాటడానికి తెరిచి ఉన్నాయని ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించారు. దీంతో ఇరాన్ లో చిక్కుకుపోయిన భారత  విద్యార్ధులు  సురక్షితంగా స్వదేశానికి చేరుకుంటారనీ, ఆందోళన చెంద వలసిన అవసరం లేదని  విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు.
ఇరాన్ నుంచి విద్యార్ధులు సురక్షితంగా స్వదేశానికి Publish Date: Jun 18, 2025 4:44PM

మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్ విడుదల

  ఇంగ్లండ్ వేదికగా 2026 జూన్ 12 నుంచి జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ రిలీజ్ చేసింది. ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరిగే తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు, శ్రీలంకతో తలపడనుంది. ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు ప్రతిష్ఠాత్మక ట్రోఫీ కోసం పోటీపడతాయి. గ‌తేడాది ఈ ట్రోఫీని న్యూజిలాండ్ జట్టు గెలుచుకున్న విష‌యం తెలిసిందే.  నెల రోజుల పాటు సాగే ఈ క్రికెట్ సమరంలో మొత్తం 33 మ్యాచ్‌లు ఇంగ్లండ్, వేల్స్‌లోని ఏడు వేర్వేరు వేదికలపై జరగనున్నాయి. టిమీండియా క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే భారత్, పాకిస్థాన్ మధ్య గ్రూప్ స్టేజ్ మ్యాచ్ జూన్ 14న జరగనుంది. ఇరు జట్ల మధ్య చివరిసారిగా 2024 అక్టోబర్ 6న ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్‌లో మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ మహిళల జట్టుపై భారత మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మరోసారి దాయాదుల పోరు కోసం భారత క్రికెట్ ఫ్యాన్స్  ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.  
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్ విడుదల Publish Date: Jun 18, 2025 4:35PM

జగన్ పర్యటనలో మరో అపశృతి…తొక్కిసలాటలో ఓ వ్యక్తి మృతి

  వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు జిల్లా పర్యటనలో మరో అపశృతి చోటు చేసుకుంది. సత్తెనపల్లి గడియార స్థంభం వద్ద ర్యాలీలో  తొక్కిసలాట జరిగింది. దీంతో జయవర్ధన్ అనే వైసీపీ కార్యకర్త సొమ్మసిల్లి పడిపోయిడటంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో  కార్యకర్త మృతి చెందారు. ఉదయం జగన్ కాన్వాయ్ లోని వాహనం ఢీ కొట్టడంతో ఓ వృద్ధుడు మరణించాడు. దీంతో వారు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు మరణించారు. అయితే కాన్వాయ్ ఢీకొని గాయపడిన వృద్ధుడిని పట్టించుకోకుండా వైఎస్ జగన్‌తోపాటు వైసీపీ నాయకులు పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీంతో ఆ పార్టీ అధినేత వ్యవహార శైలిపై టీడీపీ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి.  
జగన్  పర్యటనలో మరో అపశృతి…తొక్కిసలాటలో ఓ వ్యక్తి మృతి Publish Date: Jun 18, 2025 4:14PM

ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్.. అన్నను టార్గెట్ చేసిన షర్మిల

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు మరింత లోతుగా విచారిస్తున్నారు. ఆయన అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత.. మళ్లీ, మళ్లీ విచారణకు పిలుస్తున్నారు. గంటలకొద్దీ ఎంక్వైరీ చేస్తూ.. ఆయన నుంచి కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రణీత్ రావుని కూడా సిట్ విచారిస్తోంది. ఆధారాల ధ్వంసం, ఫోన్ ట్యాపింగ్ కోసం ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు సహా వందలాది మంది ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నవంబర్ 15న ఒక్కరోజే 600 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ట్యాపింగ్‌కు ప్రభాకర్ రావు ఆదేశాలిచ్చారని.. ఆయన డైరెక్షన్‌లోనే ఇదంతా జరిగిందని.. ఇప్పటికే అరెస్ట్ అయిన మిగతా నిందితులు తెలిపారు. మావోయిస్టు సానుభూతిపరుల పేర్ల మీద ఫోన్లను ట్యాప్ చేసినట్లు గుర్తించారు. రివ్యూ కమిటీకి కూడా మావోయిస్టుల పేర్లతోనే నెంబర్లు సమర్పించినట్లు తేలింది. ప్రతిపక్ష పార్టీలకు ఆర్థిక సాయం చేస్తున్న వారిపై నిఘా పెట్టి.. పోలీసులతో దాడులు చేయించినట్లు చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్‌తో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించారనే ఆరోపణలున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో.. కాంగ్రెస్ ఓటమికి ఫోన్ ట్యాపింగ్ ఓ కారణమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా ఆరోపించడం.. రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. 2023 ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత.. ఎస్ఐబీ ఆఫీసు నుంచి కీలకమైన హార్డ్ డిస్క్‌లు మాయమయ్యాయి. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు.. ప్రణీత్ రావు వాటిని ధ్వంసం చేసి.. మూసీ నదిలో పారేసినట్లు చెబుతున్నారు. అయినప్పటికీ.. సిట్ అధికారులు కొంత డేటాని సంపాదించారు.  దాంతో.. తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆరోపించిన వారితో పాటు సాక్ష్యులను, బాధితులను పిలిచి.. వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు.  ఇలా ఉండగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది.. ముమ్మాటికి నిజమన్నారు. ఇది.. తెలంగాణ, ఏపీ సీఎంల జాయింట్ ఆపరేషన్ అని ఆరోపించారు. కేసీఆర్, జగన్.. ఒకరికి ఒకరు అన్నట్లుగా ఉండేవారని.. వాళ్ల సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయిందని షర్మిల విమర్శించారు. తన ఫోన్ ట్యాప్ అయ్యిందని.. వైవీ సుబ్బారెడ్డి నిర్ధారించారని, తన ఫోన్ ట్యాప్ చేసిన ఆడియోని తనకు వినిపించారన్నారు. ఈ కేసులో.. ఎలాంటి విచారణకైనా వస్తానన్నారు వైఎస్ షర్మిల. మరోవైపు.. సిట్ అధికారులు ప్రభాకర్ రావును వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా.. 300 అజ్ఞాత ప్రొఫైల్స్, ఇతర కీలక వ్యక్తుల ఫోన్ల ట్యాపింగ్‌పైనే ప్రశ్నిస్తున్నారు. కేసుని ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు.. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావును.. సిట్ పదే పదే ప్రశ్నిస్తోంది. ఈ విచారణలో మరిన్ని కీలక వివరాలు బయటకొచ్చే అవకాశం ఉంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్.. అన్నను టార్గెట్ చేసిన షర్మిల Publish Date: Jun 18, 2025 4:03PM

పాక్ తో కాల్పుల విరమణలో మీ పాత్ర నిల్.. ట్రంప్ కు స్పష్టం చేసిన ప్రధాని మోడీ

పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ విషయంలో అమెరికా పాత్ర కానీ, ఆ దేశ అధ్యక్షుడి పాత్ర కానీ ఇసుమంతైనా లేదని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కే చెప్పారు. ఎలాంటి శషబిషలూ లేకుండా ట్రంప్ కు భారత్ పాకిస్థాన్ ల మధ్య ఏ విషయమైనా ద్వైపాక్షికంగానే తేల్చుకుంటామని ఇందులో మూడో దేశం ప్రమేయానికి తావేలేదని తెగేసి చెప్పేశారు.  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో పోన్ లో సంభాషించిన ప్రధాని భారత్, పాక్ మధ్య   జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా పాత్ర నిల్ అని స్పష్టం చేశారు. ట్రంప్ మోడీ ల మధ్య దాదాపు అరగంటకు పైగా సాగిన ఫోన్ సంభాషణలో మోడీ ఈ మేరకు ట్రంప్ కు స్పష్టత ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్  ట్రంప్, మోదీ మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. అంతే కాకుండా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్‌తో ట్రంప్ భేటీ కావడానికి ముందు  జరిగిన ఈ ఫోన్ సంభాషణ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి.. పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రస్ధావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్యా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దాదాపు యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్ భారత్ లక్ష్యంగా దాడులకు పాల్పడటం, అందుకు ప్రతిగా భారత్ పాకిస్థాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడం తెలిసిందే. ఆ దశలో హఠాత్తుగా ఇరు దేశాలూ కాల్పుల విరమణ ఒప్పందానికి రావడం, అందుకు తానే కారణమంటూ ట్రంప్ చెప్పుకోవడం విదితమే. అయితే అప్పట్లోనే ట్రంప్ వ్యాఖ్యలను మోడీ నిర్ద్వంద్వంగా ఖండించారు. పాక్ బతిమలాడుకోవడం వల్లే కేవలం మానవతా దృక్పథంతో కాల్పుల విరమణకు అంగీకరించినట్లు మోడీ అప్పుడే చెప్పారు. అయినా ట్రంప్ పదే పదే తన మధ్యవర్తిత్వం వల్లనే భారత్ పాక్ లు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయని చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా అధ్యక్షుడి పాత్ర ఏమీ లేదని మోడీ ఆయనే స్పష్టంగా చెప్పారు.   ఈ ఫోన్ సంభాషణ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఆ కాలంలో ఏదైనా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయా అనే అంశంపై కూడా ప్రధాని మోదీ స్పందించారు. అటువంటిదేమీ లేదని, ఆ సమయంలో భారత్-అమెరికా మధ్య ఎలాంటి వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. దీంతో కాల్పుల విరమణ విషయంలో అమెరికా జోక్యం ఉందంటూ వస్తున్న విమర్శలకు తెరపడినట్టయింది.
పాక్ తో కాల్పుల విరమణలో మీ పాత్ర నిల్.. ట్రంప్ కు స్పష్టం చేసిన ప్రధాని మోడీ Publish Date: Jun 18, 2025 3:39PM

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో లోకేష్ భేటీ

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో  ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం భేటీ  అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న నారా లోకేష్ ఉదయం ఉపరాష్ట్రపతి  జగదీప్ ధన్ ఖడ్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కాగా హోంమంత్రి అమిత్ షాతో లోకేష్ భేటీ దాదాపు పాతిక నిముషాలు సాగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించిన విజయాలను లోకేష్ ఆయనకు వివరించారు. అలాగే కేంద్రం సహాయసహకారాలతో రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి పనులు, వాటి పురోగతి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను లోకేష్ ఈ సందర్భంగా అమిత్ షాకు వివరించి చెప్పారు. ఇక ఈ నెల 21న విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరౌతున్న సందర్భంగా చేసిన ఏర్పాట్లను వివరించారు. అలాగే రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులకు కేంద్రం సహకారాన్ని కోరారు.  ఈ సందర్భంగా యువగళం పాదయాత్ర కు సంబంధించి రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ ను లోకేష్ అమిత్ షాకు అందజేశారు. ఈ సందర్భంగా సుదీర్ఘఠ పాదయాత్రతో ప్రజలలో చైతన్యాన్ని నింపారంటూ అమిత్ షా లోకేష్ ను అభినందించారు. అలాగే చంద్రబాబు సుదీర్ఘ పాలనా అనుభవం ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి బాటలో నడిపిస్తుందనీ, ఎపిసర్కారుకు కేంద్ర సహకారం కొనసాగుతుందని అమిత్ షా భరోసా పేర్కొన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో లోకేష్ భేటీ Publish Date: Jun 18, 2025 3:22PM

పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదం

  వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మాజీ సీఎం జగన్, సత్తెనపల్లి  పర్యటన సందర్బంగా నేపథ్యంలో ముందుగా జాగ్రత్తగా పల్నాడు జిల్లా సరిహద్దుల్లో పోలీసులు బారికేట్లు పెట్టారు. వైసీపీ వాహనాలను, కార్యకర్తలను అడ్డుకుంటున్నరు. దీంతో అంబటి రాంబాబు బారికేడ్లను తొలిగించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కార్యకర్తలతో కలిసి బారికేడ్లను పక్కకు నెట్టేశారు. వాహనాలతో ర్యాలీగా వెళ్లి తీరుతామని అంబటి హడావుడి చేయడంతో ఆయనకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి చొచ్చుకెళ్లేందుకు అంబటి రాంబాబు యత్నించారు.
పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదం Publish Date: Jun 18, 2025 3:15PM

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేష్.. బాలకోటిరెడ్డి కుటుంబానికి ఆర్థికసాయం

    కార్యకర్తే అధినేత అనే మాటను శిరసావహిస్తూ ఆపదవేళ వారికి అన్ని విధాల అండగా నిలుస్తున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్. గత ప్రభుత్వ పాలనలో వైసీపీ రౌడీ మూకల దాడిలో దారుణహత్యకు గురైన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబానికి పెద్దకొడుకులా జీవితాంతం అండగా ఉంటాననే హామీని లోకేష్ నిలబెట్టుకున్నారు. దివంగత వెన్నా బాలకోటిరెడ్డి ఇంటిపై తీసుకున్న రుణాన్ని మంత్రి  తీర్చారు. ఆయన సతీమణి వెన్నా నాగేంద్రమ్మకు నెలనెలా ఆర్థికసాయం అందజేస్తూ ఇంటికి పెద్దకొడుకులా అండగా నిలిచారు.  పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల బాధ్యత తీసుకున్న మంత్రి లోకేష్ అలవాల గ్రామానికి చెందిన వెన్నా బాలకోటిరెడ్డి నాలుగు దశాబ్దాల పాటు పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీనిని ఓర్చుకోలేని వైసీపీ గూండాలు అప్పటి వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అండతో ఇంట్లో నిద్రిస్తున్న బలాకోటిరెడ్డిని తుపాకీతో కాల్చిచంపారు. హత్యకు ఆరు నెలల ముందు కూడా కత్తులతో దాడికి తెగబడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత నెల 21వ తేదీన బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులను ఉండవల్లి నివాసానికి పిలుపించుకున్న మంత్రి లోకేష్.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  ఆర్థికంగా చాలా నష్టపోయామని, తాము నివసిస్తున్న ఇల్లు తాకట్టులో ఉందని లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో పార్టీ కోసం జీవితాంతం కష్టపడిన వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబానికి పెద్దకొడుకులా జీవితాంతం అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల బాధ్యత తీసుకున్న మంత్రి లోకేష్ నియోజకవర్గ పర్యటనల్లో ముందుగా కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. ఉండవల్లి నివాసంలోనూ కార్యకర్తలను నేరుగా కలుసుకుని వారికి అండగా నిలుస్తున్నారు.  
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేష్.. బాలకోటిరెడ్డి కుటుంబానికి ఆర్థికసాయం Publish Date: Jun 18, 2025 2:58PM

జగన్ కాన్వాయ్ వాహనం ఢీ కొని వృద్ధుడు మృతి

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో  ఆయన కాన్వాయ్ లోని వాహనం ఢీ కొని ఓ వృద్ధుడు మరణించాడు. గుంటూరు జిల్లా ఏటుకూరు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటనకు జగన్ బుధవారం (జూన్ 18)  భారీ కాన్వాయ్ తో తాడేపల్లి నుంచి బయలుదేరారు. ఆయన కాన్వాయ్  ఏటుకూరు బైపాస్ వద్దకు చేరిన సమయంలో ఆ బైపాస్ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ వృద్ధుడిని జగన్ కాన్వాయ్ లోని ఓ వాహనం ఢీ కొట్టింది.  దీంతో ఆ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వృద్ధుడిని స్థానికుల సమాచారం మేరకు వచ్చిన 108 వాహనంలో  గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వృద్ధుడు మరణించారు.  వృద్ధుడిని ఢీ కొట్టినా కాన్వాయ్ ఆపకుండా వెళ్లిపోవడంతో  స్థానికులు జగన్ పైనా, వైసీపీపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.    జగన్ స్వార్థ రాజకీయానికి ఓ నిండు ప్రాణం బలైందంటూ జిల్లా ఇన్ చార్జ్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  జగన్ కాన్వాయ్ లోని వాహనం వృద్ధుడిని ఢీ కొట్టిందనీ, అయినా కాన్వాయ్ ఆపకుండా వెళ్లిపోవడం దారుణమన్నారు. కాన్వాయ్ ని ఆపి గాయపడిన వృద్ధుడిని ఆస్పత్రికి తీసుకువెళ్లి ఉంటే ఆయన బతికి ఉండేవాడనీ గొట్టిపాటి అన్నారు. జగన్ వన్నీ మోసపూరిత వాగ్దానాలు, మాటలూ అని గొట్టిపాటి విమర్శించారు.  
జగన్ కాన్వాయ్ వాహనం ఢీ కొని వృద్ధుడు మృతి Publish Date: Jun 18, 2025 2:52PM

ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది వాస్తవం : షర్మిల

  బీఆర్‌ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది నిజమని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు.  గత తెలంగాణ సీఎం, అప్పటి ఏపీ సీఎం కలిసి చేసిన జాయింట్ ఆపరేషనో కాదో తెలియదు. కానీ నా ఫోన్, నా భర్త ఫోన్,నా దగ్గర వాళ్ళ ఫోన్‌లు ట్యాప్ అవుతున్నాయని స్పష్టంగా అర్ధమైందని షర్మిల తెలిపారు. ఫోన్ ట్యాప్ జరిగినట్లు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి మా ఇంటికి వచ్చి చెప్పారని ఆమె తెలిపారు. ఓ ఫోన్ కాల్ సంభాషణను కూడా వినిపించారు. ఫోన్ల ట్యాపింగ్‌పై సమగ్ర దర్యాప్తు జరగాలి అని షర్మిల డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ వేగవంతం చేయాలని ఆమె తెలిపారు.  ఆనాడు జగన్, కేసీఆర్ మధ్య ఉన్న సంబంధం చూసి రక్త సంబంధం కూడా చిన్నబోయింది. ఫోన్ ట్యాపింగ్.. తెలంగాణలో నన్ను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కేందుకు ఆ ఇద్దరు కలిసి వేసిన స్కెచ్ అని పేర్కొన్నారు.అప్పుడు జగన్, కేసీఆర్ చేసినవి అరాచకాలు. వీరి అరాచకాలతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ చాల చిన్న విషయం అన్నారు. నేను జగన్‌కు రక్తం పంచుకోని పుట్టిన చెల్లెల్ని. ఆ విషయం మరిచి నేను ఆర్థికంగా, రాజకీయంగా ఎదగకూడదు అని కుట్ర చేశారని ఏపీ పీసీసీ ఆవేదన వ్యక్తం చేశారు . నా భవిష్యత్తును పాతిపెట్టాలని ఎన్నో చేశారు. నాకు మద్దతు పలికిన వాళ్లను బెదిరించారుని ఆమె అన్నారు.  
ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది వాస్తవం :  షర్మిల Publish Date: Jun 18, 2025 2:48PM

గుంతకల్లుని వారసులకి రాసిచ్చేసిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం

ఉమ్మడి అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం  వ్యవహార శైలి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైసీపీలో ఆశించిన సీటు  దక్కలేదని పార్టీతో పాటు జిల్లా కూడా మార్చిన ఈ మాజీ మంత్రి గత ఎన్నికల్లో చివరి నిముషంలో టీడీపీ టికెట్ దక్కించుకుని గెలిచారు. అయితే గెలిచిన కొంతకాలానికి ఆయన చుట్టుపు చూపుగా కూడా గుంతకల్లు వైపు చూడటం లేదంట. నియోజకవర్గంలో వ్యవహారాలన్నీ తన వందిమాగధులకు అప్పజెప్పి వెళ్లిపోయారంట.  జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. రాయలసీమలోని వేరే నియోజకవర్గాలతో  పోలిస్తే అక్కడ రాజకీయం ఎప్పుడూ సైలెంట్‌గా నడిచిపోతుంటుంది. గుంతకల్ నియోజకవర్గంలో కేవలం రెండు మున్సిపాలిటీలు, ఒక్క మండలం  మాత్రమే ఉండడంతో పెద్దగా రాజకీయ హడావుడి కనిపించదు. ముందు నుంచి అక్కడ ఎమ్మెల్యేలు వివాదాలకు దూరమే.  2008లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏర్పడ్డ గుంతకల్లు రాష్ట్ర విభజన తర్వాత ఒకసారి టీడీపీ తరఫున జితేంద్ర గౌడ్, వైసీపీ నుంచి వెంకట్రామిరెడ్డి గెలిచారు. ఇద్దరూ కూడా ఎప్పుడూ పొలిటికల్‌గా పెద్దగా ఫోకస్ అవ్వలేదు. ఎవరిపైనా రాజకీయ  ఆరోపణలు లేవు. 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న  వెంకట్రామిరెడ్డి పోటీలో నిలవగా టీడీపీ నుంచి అనేక తర్జనభర్జనల తర్వాత కర్నూలు జిల్లా వైసీపీ నుంచి దిగుమతి నేతను తెచ్చుకున్నారు.  వైసీపీ ప్రభుత్వంలో కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంను గుంతకల్లు నుంచి పోటీలోకి దింపింది టీడీపీ. అప్పట్లో కర్నూలు జిల్లా ఆలూరు నుంచి గెలిచి జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన గుమ్మనూరుకు బెంజి కారు మంత్రి అన్న ట్యాగ్‌లైన్ కూడా ఉండేది. జిల్లా మారి వచ్చినా కూటమి హావా, అలాగే బీసీ కావడంతో గుమ్మానూరు జయరాం గుంతకల్లులో గెలవగలిగారు.  గుంతకల్లు నియోజకవర్గం, గుమ్మనూరు జయరాం అప్పటి నుంచి వార్తల్లో నిలుస్తున్నారు.  జయరాం ఎమ్మెల్యే అయిన మొదట్లో అడపాదడపా నియోజకవర్గానికి వచ్చి వెళ్తూ.. ఏదో మొక్కుబడిగా కార్యక్రమాలను నిర్వహిస్తుండేవారు. ఇప్పుడు అది కూడా లేకుండా నియోజకవర్గాన్ని పూర్తిగా పదిలేసి అక్కడ పెత్తనంం అంతా తన కొడుకు, తమ్ముళ్లకు రాసిచ్చేశారంట. అది టీడీపీ హైకమాండ్ దృష్టికి కూడా వెళ్లడంతో అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఆరా తీసే పనిలో పడిందంట. జిల్లా పార్టీ పరిశీలకులుగా ఉన్న కోవెలముడి రవీంద్ర  దృష్టికి కూడా ఈ విషయాన్ని గుంతకల్లు టీడీపీ సీనియర్ నేతలు తీసుకెళ్లారంట.  పార్టీ కార్యక్రమమైనా, ప్రభుత్వ కార్యక్రమాలు అయినా కేవలం ఎమ్మెల్యే కుమారుడు గాని లేదా తమ్ముడు కానీ మాత్రమే హాజరవుతూ షాడో ఎమ్మెల్యేల్లా వ్యవహరిస్తున్నారంట. గుంతకల్లు మున్సిపాల్టీని తన తమ్ముడు నారాయణస్వామికి , గుత్తి మున్సిపాల్టీ, పామిడి మండలాలను తన కుమారుడు గుమ్మనూరు ఈశ్వర్‌కు అప్పజెప్పిన గుమ్మనూరు జయరాం తన వ్యాపారాలు చూసుకుంటున్నారంట. ఆ క్రమంలో గుత్తితో పాటు పామిడి మండలంలో గుమ్మనూరు ఈశ్వర్ ఎలా చెబితే అలా నడుస్తోందంట. ఒక సందర్భంలో అతను  పామిడి ఎంపీడీవో ఆఫీస్‌లోకి వెళ్లి ఎంపీడీఓ చైర్‌లో కూర్చోవడం పెద్ద వివాదానికి దారి తీసింది. అంతే కాదు పామిడి మండలంలో ప్రవహించే పెన్నా నదిలో బహిరంగంగా పట్టపగలే అక్రమ ఇసుక తవ్వకాలు జరుపుతున్నాయి. అందులో మేజర్ షేర్ ఎమ్మెల్యే కుమారుడిదే అన్న ప్రచారం ఉంది. పెన్నా నదిలో  ఇసుక తవ్వకాలపై టీడీపీ నేత జెసి ప్రభాకర్ రెడ్డి  స్వయంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు బహిరంగంగా వార్నింగ్ ఇవ్వడం అప్పట్లో కలకలం రేపింది. ఇసుక అక్రమ రవాణాపై కేసు కూడా నమోదైంది. అదేకాక భూకబ్జాలు, పేకాట, మట్కా మాఫియాను ఎమ్మెల్యే అనుచరులు నిర్వహిస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దానిపై మీడియా ఫోకస్ చేస్తే సదరు జర్నలిస్టులను రైలు పట్టాలపై పడుకోబెడతారని ఎమ్మెల్యే వర్గీయులు  బహిరంగంగా హెచ్చరించడం సంచలనం రేపింది.  ఇన్ని ఆరోపణలు వస్తున్నా ఎమ్మెల్యే మాత్రం గుంతకల్లులో కాలు పెట్టకుండా తన పని తాను చూసుకుంటున్నారంట. గెలిపించిన కార్యకర్తలకు  మొహం చూపియకుండా ఉండటంతో జిల్లా టీడీపీ అధ్యక్షుడు సాంబశివుడు యాదవ్ లాంటి పార్టీ సీనియర్ నేతలే  పార్టీ కార్యక్రమలు నిర్వహించాల్సి వస్తోంది. ఏదైనా సమస్య చెప్పుకుందాం అంటే ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడం పార్టీకి అతిపెద్ద మైనస్‌గా మారుతోందంటున్నారు. లోకల్‌గా ఉన్న నాయకుల్ని కాదని ఎక్కడ నుంచో దిగుమతి చేసుకుంటే  పరిస్థితి ఇలాగే ఉంటుందని స్థానిక టీడీపీ సీనియర్లు వాపోతున్నారు.
గుంతకల్లుని వారసులకి రాసిచ్చేసిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం Publish Date: Jun 18, 2025 2:23PM

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆగస్ట్ 15 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్

  అవాంతరాలు లేని హైవే ప్రయాణం అందించడమే లక్ష్యంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.   ఫాస్టాగ్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా వార్షిక పాస్‌ను తీసుకువస్తున్నది. ఆగస్టు 15 నుంచి అందుబాటులోనికి రానున్న ఈ సాస్ జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉ:టుంది.     ఈ కొత్త  ఫాస్టాగ్   పాస్ ను 3వేల రూపాయలు చెల్లించి తీసుకుంటే.. దానిని ఉపయోగించి  ఏడాది పాటు లేదా 200 ట్రిప్పుల వరకు చెల్లుబాటు అవుతుంది.  ఈ పాస్టాగ్ పాస్ ను  కార్లు, జీపులు, వ్యాన్‌ల వంటి నాన్ కమర్షియల్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది.   ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సామాజిక మాధ్యమ వేదికగా వెల్లడించారు. రాజ్ మార్గ్ యాత్ర యాప్ ద్వారా ఈ పాస్ తీసుకోవచ్చునని తెలిపారు. 
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆగస్ట్ 15 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ Publish Date: Jun 18, 2025 1:59PM

ఇరాన్- ఇజ్రాయేల్ వార్ లో అమెరికా ఎంట్రీ ఎందుకంటే?

అమెరికా అధ్య‌క్షుడు జీ7 నుంచి హ‌డావిడిగా అమెరికా బ‌య‌లు దేరారు. ఇంత‌లో ఫ్రాన్స్ అధ్య‌క్షుడు మెక్రాన్ ఇరాన్- ఇజ్రాయెల్ మ‌ధ్య కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం కోస‌మేమో  ఈ తొంద‌ర అని అన్నారు. లేదు లేదు అంత‌క‌న్నా మించి అన్నది ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య.  ఇక్క‌డ యూఎస్ కి చేరుకోగానే సిట్యువేష‌న‌ల్ రూమ్ ని ఏర్పాటు చేశారు ట్రంప్. ఇప్ప‌టికే  ఇజ్రాయెల్ టెహ్రాన్ గ‌గ‌న త‌లాన్ని త‌న  కంట్రోల్లోకి తీసుకున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ట్రంప్ కూడా ట్రెహ్రాన్ లో నివ‌సించేవారంతా ఆ ప్రాంతం వ‌ద‌లి  వెళ్లాల్సిందిగా హెచ్చ‌రించారు. కార‌ణం.. ఇక్క‌డికి 225 కి. మీ ద‌గ్గ‌ర్లో ఇరాన్ కి చెందిన‌ న‌టాంజ్ అణు కేంద్రం ఉంటుంది. ఇక వంద కి. మీ. దూరంలో ఉండేది  ఫార్దో. ఇదీ ఒక‌ అణు కేంద్రమే. ఇక్క‌డ యురేనియం శుద్ధి సుమారు 83 శాతం చేసింది ఇరాన్. యురేనియం 90 శాతం శుద్ది అయితే చాలు ఒక అణుబాంబు త‌యారు చేయ‌డానికి. అంటే దాదాపు ద‌గ్గ‌ర‌కొచ్చేసింద‌న్న‌మాట‌.  ట్రంప్ త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా చెప్పే మాట ఏంటంటే  అణ్వాయుధం ఇరాన్ కి ఎట్టి  ప‌రిస్థితుల్లోనూ  ద‌క్క కూడ‌ద‌ని. ఎందుక‌లా? కార‌ణాలు ఏమై ఉంటాయి? అంటే.. మొద‌ట కొన్నాళ్ల  నుంచి ఇరాన్- యూఎస్ మ‌ధ్య అణు ఒప్పందం పెండింగ్ లో ఉంది. ఇందుకు ఇరాన్ ఎట్టి  ప‌రిస్తితుల్లోనూ ఒప్పుకోవ‌డం లేదు. పాయింట్ నెంబ‌ర్ టూ  పాకిస్థాన్ లా మ‌రో ఇస్లామిక్ కంట్రీ  ద‌గ్గ‌ర అణ్వాయుధం ఉంటే  ప‌రిస్థితి  మ‌రోలా మారిపోతుంది. 1960ల నాటి ఆయుధ శ్రేణి ఫైట‌ర్ జెట్లు ఉండ‌గానే ఇరాన్ ఇటు పాల‌స్తీనా హ‌మాస్ కి, అటు లెబ‌నాన్ హిజ్బుల్లాకు నిధులు, ఆయుధాల‌ు అందజేయడంతో పాటు  శిక్ష‌ణ  కూడా ఇస్తోంది. ఇది అమెరికా మిత్ర దేశం ఇజ్రాయెల్ కి ఎంత మాత్రం క్షేమ‌క‌రం కాదు. దీంతో ఇస్లామిక్ విప్ల‌వం మ‌రింత ముదిరే అవ‌కాశ‌ముంది. బేసిగ్గా ఇరాన్, ఇజ్రాయెల్ 1979 వ‌ర‌కూ మిత్ర‌దేశాలే. ఎప్పుడైతే 1980ల్లో ఇస్లామిక్ రెవ‌ల్యూష‌న్ వ‌చ్చిందో  అప్ప‌టి నుంచీ ఇజ్రాయెల్ తో వ‌ర్గ  శ‌తృత్వం ఏర్ప‌రుచుకుంది ఇరాన్. దీంతో అమెరికా  ఇరాన్ అంటేనే భ‌య‌ప‌డుతోంది. ఆ దేశానికి అణ్వాయుధం అంటేనే హ‌డ‌లిపోతోంది. ఇది మ‌రింత ఇస్లామిక‌ర‌ణ‌కు ఆస్కారం ఏర్ప‌రుస్తుంద‌న్న ఆందోళ‌న  చెందుతోంది యూఎస్.  దీంతో ఆగ‌మేఘాల మీద ఈ  యుద్ధంలోకి త‌న వంతుగా ఏర్పాట్లు చేస్తున్నారు ట్రంప్. అయితే ఇరానీ అణు నిల్వ‌లున్న న‌టాంజ్, ఫోర్దోగానీ భూమిలోలోతుల్లో భ‌ద్ర ప‌ర‌చ‌బ‌డ్డాయి. వీటిని బ‌ద్ధ‌లు కొట్టాలంటే అమెరికా ద‌గ్గ‌రున్న బంక‌ర్ బ్లాస్ట‌ర్ల ద్వారా మాత్ర‌మే సాధ్యం. ఇవి ఇర‌వై అడుగుల పొడ‌వుండే జీబీయూ 57 అనే భారీ బంక‌ర్ బ్లాస్ట‌ర్ల ద్వారా మాత్రమేపేల్చాల్సి ఉంటుంది.  ఈ బంక‌ర్ బ్లాస్ట‌ర్లు ఒక్కొక్క‌టీ 13 వేల 600 కిలోల బ‌రువుంటాయి. వీటిని అమెరిక‌న్ బీ2 స్పిరిట్ బాంబ‌ర్ల ద్వారా మాత్ర‌మే ప్ర‌యోగించ‌గ‌లం. వీటిని కొన్ని నెల‌ల క్రిత‌మే ప‌శ్చిమాసియాకు చేర్చింది యూఎస్. విమాన వాహ‌క నౌక యూఎస్ఎస్ నిమిట్స్ ని ఈ స‌రికే  ప‌శ్చిమాసియా తీరానికి  త‌ర‌లించింది  అమెరికా. ఇత‌ర స‌హాయ‌క నౌక‌లు సైతం ఈ దిశగా క‌దిలాయి. అంతే  కాదు బ్రిట‌న్ జెట్ ఫైట‌ర్లు కూడా  మొహ‌రిస్తున్నారు. ఇలా అన్నిర‌కాలుగా  ఇరాన్   అణ్వాయుధ త‌యారీ చేయ‌కుండా క‌ట్ట‌డి చేస్తోంది యూఎస్. అందులో భాగంగా మొద‌ట త‌మ మిత్ర దేశం ఇజ్రాయెల్ ని రంగంలోకి దింపింది. ఇదొక ఎమోష‌న‌ల్ డ్రామా. ఇక్క‌డ గానీ చిక్కితే.. మొద‌ట అణు ఒప్పందం గురించి అడ‌గొచ్చు. లేదంటే త‌ను కూడా ఇదే యుద్ధంలోకి దిగి ఇరాన్ ప‌ని  ప‌ట్టొచ్చ‌ని భావిస్తోంది యూఎస్.. అందుకే ఈ  ఉరుకులు ప‌రుగుల నిర్ణయాలుగా అంచ‌నా వేస్తున్నారు.. అంత‌ర్జాతీయ వ్య‌వ‌హారాల  నిపుణులు.
ఇరాన్- ఇజ్రాయేల్ వార్ లో అమెరికా ఎంట్రీ ఎందుకంటే? Publish Date: Jun 18, 2025 1:05PM

చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఓవరేక్షన్ బూమరాంగ్!

చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఓవరేక్షన్ బూమరాంగ్ అయ్యింది. ఆలూ లేదు చూలూ లేదు.. అన్న సామెత చందంగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి మద్యం కుంభకోణంలో తనను ఇరికించాలన్న కుట్ర జరుగుతోందంటూ నానా యాగీ చేశారు. చెవిరెడ్డి  ఈ యాగీ చేసే సమయానికి అసలు చెవిరెడ్డి పేరు మద్యం కుంభకోణం నిందితులలో లేనే లేదు. ఈ కేసులో అరెస్టైన నిందితులు విచారణలో తన పేరు వెల్లడించి ఉంటారన్న అనుమానంతో చెవిరెడ్డి హడావుడి చేశారు. తన వద్ద పని చేసిన వారినీ, తన స్నేహితులనూ బెదరించి, వేధించి తనకు వ్యతిరేకంగా తప్పుడు స్టేట్ మెంట్లు ఇప్పిస్తున్నారంటూ సిట్ పై ఆరోపణలు గుప్పించారు.  తనను అరెస్టు చేయడమే సిట్ లక్ష్యమైతే.. తానే స్వయంగా సిట్ కార్యాలయానికి వచ్చి స్వచ్ణందంగా అరెస్టౌతాను అంటూ గంభీరమైన ప్రకటనలు చేశారు. మీడియా ముందు సవాళ్లు చేశారు. దాదాపు తొడకొట్టి మీసం మెలేసినంత పని చేశారు. ఇంతా చేసి.. చల్లగా దేశం దాటేయడానికి ప్రయత్నించారు. అయితే బెంగళూరు విమానాశ్రయంలో అడ్డంగా దొరికిపోయారు. లుక్ ఔట్ నోటీసు ఉండటంతో ఆయనను బెంగళఊరు విమానాశ్రంయలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. సిట్ కు సమాచారం ఇచ్చారు. సిట్ హుటాహుటిన బెంగళురుకు బయలుదేరి వెళ్లింది. ఈ రోజు ఆయనను విజయవాడ తీసుకువచ్చి కోర్టులో హాజరు పరిచే అవకాశాలు ఉన్నాయి. ఇక చెవిరెడ్డి కోసం ఆయన వద్ద పదేళ్ల పాటు గన్ మెన్ గా పని చేసిన మదన్ రెడ్డి అనే హెడ్ కానిస్టేబుల్ కోర్టుకెక్కారు. సిట్ తనను చెవిరెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలంటూ వేధించిందనీ, మ్యాన్ హ్యాండిల్ చేసిందనీ పిటిషన్ దాఖలు చేశారు.  సరే సిట్ మదన్ రెడ్డి ఆరోపణలు నిర్ద్వంద్వంగా ఖండించింది. ఆ ఆరోపణలపై డీజీపీ స్థాయి అధికారితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. అసలు మదన్ రెడ్డి తమ విచారణకు సహకరించలేదని పేర్కొంది. అది పక్కన పెడితే.. చెవిరెడ్డి విషయంలో సిట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి సహా ఆరుగురిని నిందితులుగా చేరుస్తూ కోర్టులో మెమో దాఖలు చేసింది.   దీంతో మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి ఓవరేక్షన్  చేసి తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది అన్న చందంగా ముందుగానే అరెస్టు సవాళ్లు విసిరి సిట్ అదుపులోకి వెళ్లిపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఓవరేక్షన్ బూమరాంగ్! Publish Date: Jun 18, 2025 10:56AM

అమరావతి.. ఇక ఆగేదేలే?

నవ్యాంధ్రప్రదేశ్ రాజథాని అమరావతి ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ. అభివృద్ధిలో ఆకాశమే హద్దు అన్నట్లుగా దూసుకుపోతోంది. జగన్ హయాంలో ఉద్దేశపూర్వకంగా అమరావతి పురోగతిని ఆపేశారు. శ్మశాసమంటూ ఎద్దేవా చేశారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను నానా ఇబ్బందులకూ గురి చేశారు. అటువంటి  అమరావతిలో ఇప్పుడు పండుగ వాతావరణం కనిపిస్తోంది.  పెద్ద ఎత్తున నిర్మాణాలు జోరందుకున్నాయి.  అటు కేంద్రం ప్రభుత్వ సంస్థల నిర్మాణానికి కూడా రంగం సిద్ధమైంది.  రాజధాని నగరంలోని రెండు కీలక నిర్మాణాలను స్వయంగా చేపట్టడానికి కేంద్రం ముందుకు వచ్చింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.  సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం క్వార్టర్లను,  కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవనాలను కూడా కేంద్రమే నిర్మించేందుకు ముందుకు వచ్చింది కేంద్రంలో మోడీ నేతృత్వంలోని   ఎన్డీఏ సర్కార్ లో తెలుగుదేశం కూడా కీలక భాగస్వామి. దీంతో అమరావతి పురోగతికి అడ్డు అన్నదే లేకుండా పోయింది. ఇందుకు అదనంగా అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్లు, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్  నిర్మాణాలను కేంద్రమే స్వయంగా తన నిధులుతో నిర్మించేందుకు ముందుకు వచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉత్వర్లులు జారీ  చేశారు. ఆ వెంటనే ఆ నిర్మాణాలకు అవసరమయ్యే నిధులను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ విడుద చేసేసింది. ఈ నిధుల విడుదల విషయాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి  మనోహర్ లాల్ ఖట్టర్ స్వయంగా వెల్లడించారు.  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్ల నిర్మాణానికి  1,329 కోట్ల రూపాయలు, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి  .1,459 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేసింది.  కేంద్రం ఈ నిర్ణయంతో  అమరావతి నిర్మాణం నిర్దుష్టకాలంలో పూర్తి కావడమే కాకుండా, ఇక ఏ శక్తీ దీనిని నిలువరించలేదని కూడా స్పష్టమైంది. 
అమరావతి.. ఇక ఆగేదేలే? Publish Date: Jun 18, 2025 10:38AM

కోల్ కతా విమానాశ్రయంలో కొడాలి నాని అరెస్ట్!?

వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా గుర్తింపు పొంది.. బూతుల నానిగా ప్రసిద్ధి పొందిన కొడాలి నానిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. కోల్ కతా విమానాశ్రయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కోల్ కతా విమానాశ్రయం నుంచి శ్రీలంక వెళ్లేందుకుర ప్రయత్నించిన నానిని అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని అదుపులోనికి తీసుకున్నారు. కొడాలి నానిపై లుక్ ఔట్ నోటీసు ఉండటంతో ఆయన విమానాశ్రయంలో అడ్డుకుని అదుపులోనికి తీసుకున్నారు.   వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో నాని ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా.. ఎక్కడ మాట్లాడినా చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, జనసేన  అధినేత పవన్ కల్యాణ్‌పై బూతుల పంచాంగం విప్పేవారు.  అటువంటి కొడాలి నాని వైసీపీ పరాజయం తరువాత నుంచీ నోరు విప్పడానికే భయంతో వణుకుతున్న పరిస్థతి. గుడివాడ నుంచి వరుసగా ఐదుసార్లు విజయం సాధించిన కొడాలి నాని ఒక్క పరాజయంతో నియోజకవర్గం ముఖం చూడడానికి కూడా భయపడే పరిస్థితికి దిగజారారు.  అసలు గత ఎన్నికలలో వైసీపీ పరాజయం తరువాత కొడాలి నాని బహిరంగంగా బయటకు వచ్చి కనిపించిన సందర్భాలను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అయితే  అప్పడప్పుడు మీడియా ముందు కనిపించినా.. తాను భయపడటం లేదు అన్న బిల్డప్ ఇచ్చుకోవడానికి ప్రయత్నించారు. అయితే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు తరువాత కొడాలి నాని ఆ మాత్రంగా కూడా మాట్లాడే ధైర్యం చేయలేదు. పూర్తిగా హైదరాబాద్ కే పరిమితమైపోయారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై  ముంబై  ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు.  అంతే ఆ తరువాత నానికి సంబంధించిన వార్త ఏదీ బయటకు రాలేదు. ఆయన ముంబై నుంచి హైదరాబాద్ కు ఎప్పుడు తిరిగివచ్చారు? అన్న సంగతే తెలియనంతగా అజ్ణాత వాసం చేశారంటే అతిశయోక్తి కాదు. ఇటీవలే ఓ వివాహ కార్యక్రమంలో ఆయన కనిపించారు. ఇక కొడాలి నానిని ఏక్షణంలోనైనా అరెస్టు చేయవచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే కొడాలి నాని కోల్ కతా నుంచి కొలంబో చెక్కేయడానికి విమానాశ్రయానికి చేరుకున్నారు. లుక్ ఔట్ నోటీసులు ఉండటంతో అక్కడ కొడాలి నానిని అడ్డుకుని అదుపులోనికి తీసుకున్నారు. ఆయనను విజయవాడ తరలించే అవకాశాలున్నాయంటున్నారు. 
కోల్ కతా విమానాశ్రయంలో కొడాలి నాని అరెస్ట్!? Publish Date: Jun 18, 2025 10:04AM

ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టుల హతం

ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బుధవారం (జూన్ 18) ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో జరగిన భారీ ఎన్ కౌంటర్ లో ఇద్దరు మహిళా నక్సల్స్ సహా ముగ్గురు మరణించారు.    దేవిపట్నం   పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకావాడగండి గ్రామ సమీపంలో గల కిట్టూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో మరణించిన వారిలో  ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు, ఒక ఏసీఎం ఉన్నట్లు తెలుస్తోంది. మృతులను మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు గాజర్ల రవి అలియాస్ ఉదయ్,  అరుణ, ఏసీఎం సభ్యురాలు అంజుగా గుర్తించారు. సంఘటనా స్థలం నుంచిమూడు ఏకే 47లు స్వాధీనం చేసుకున్నారు.  మరి కొందరు నక్సలైట్లు తప్పించుకున్నారని భావిస్తున్నారు. వారి కోసం గాలింపు కొనసాగుతోంది.  
 ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టుల హతం Publish Date: Jun 18, 2025 9:39AM

ఎముకలను చెదపురుగుల్లా తినేసే ఈ వ్యాధి గురించి తెలుసా?

  ఎముకలు శరీరానికి ఊతాన్ని ఇస్తాయి.  ఎముకలు ఎంత బలంగా ఉంటే శరీరం అంత బలంగా ఉంటుందని అర్థం.  అయితే ప్రస్తుత కాలంలో చాలామంది ఎముకల సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎముకలకు సంబంధించి చాలా వ్యాధులు కూడా ఉన్నాయి.  వాటిలో ఒక వ్యాధి ఎముకలను చెదపురుల్లా తినేస్తుంది. ఇంతకీ ఆ వ్యాధి ఏమిటో.. దాన్నుండి బయటపడే మార్గం ఏమిటో.. ఆ వ్యాధి రాకుండా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో.. వివరంగా తెలుసుకుంటే.. ఎముకలు  క్రమంగా బలహీనపడతాయని చాలామందికి తెలియదు. అది కూడా స్పష్టమైన లక్షణాలు లేకుండానే బలహీన పడతాయి.  దీనికి కారణం అయ్యే వ్యాధిని ఆస్టియోపోరోసిస్ అంటారు. ఈ వ్యాధి  ఎముకల బలాన్ని నిశ్శబ్దంగా నాశనం చేస్తుంది. ఆస్టియోపోరోసిస్ లక్షణాలు గుర్తించే సమయానికి, ఎముకలు చాలా బలహీనంగా మారతాయి. చిన్న చిన్న దెబ్బలు కూడా ఎముకల పగుళ్లకు కారణం అవుతాయి. అసలు  ఆస్టియోపోరోసిస్ అంటే ఏమిటి, దాని లక్షణాలు ఏమిటి?  దానిని ఎలా నివారించాలంటే.. ఆస్టియోపోరోసిస్ అనేది ఎముకలు క్రమంగా సన్నగా,  బలహీనంగా మారే వ్యాధి. అవి లోపల నుండి బోలుగా మారుతాయి.  చెదపురుగులు చెక్కను ఆక్రమించినట్లు. బయట నుండి ప్రతిదీ బాగానే కనిపిస్తుంది, కానీ లోపల ఎముకలు బలహీనమవుతాయి.   మహిళలు, ముఖ్యంగా మెనోపాజ్ దశకు చేరుకున్న వారు, 50 ఏళ్లు పైబడిన వారు తక్కువ కాల్షియం,  విటమిన్ డి ఆహారం తీసుకునేవారు ఎక్కువసేపు నిశ్చలంగా ఉండేవారు,  వ్యాయామం చేయనివారు అధికంగా ధూమపానం చేసేవారు లేదా మద్యం సేవించేవారు ఎక్కువ కాలం కొన్ని మందులు  తీసుకునేవారు.. ఇలా వీరందికి ఈ ఆస్టియోపోరోసిస్ వ్యాధి ప్రమాదం ఎక్కువ ఉంటుంది. లక్షణాలు.. ఆస్టియోపోరోసిస్ యొక్క అతిపెద్ద ప్రమాదం ఏమిటంటే ప్రారంభంలో ఎటువంటి లక్షణాలు కనిపించకపోవడమే. ప్రజలు అంతా బాగానే ఉందని అనుకుంటారు కానీ లోపల ఎముకలు బలహీనపడుతుంటాయి. కొన్ని సాధారణ లక్షణాలు కూడా ఉంటాయి. వాటిలో  నిరంతరం వెన్నునొప్పి, నడుము వంగడం ప్రారంభమవుతుంది.  అలాగే  ఎత్తు తక్కువగా మారుతుంద.  చిన్న గాయంలో కూడా చేయి లేదా కాలు ఎముకలు విరిగిపోతాయి. వ్యాధి నిర్థారణ.. ఈ వ్యాధిని BMD (బోన్ మినరల్ డెన్సిటీ) పరీక్ష ద్వారా గుర్తిస్తారు. దీనిని DEXA స్కాన్ అని కూడా అంటారు. ఈ స్కాన్  ఎముకలు ఎంత బలంగా ఉన్నాయో చూపిస్తుంది. నివారణ ఎలాగంటే.. మంచి ఆహారం తీసుకోవాలి.  పాలు, పెరుగు, జున్ను, ఆకుపచ్చ కూరగాయలు, బాదం తీసుకోవాలి. అలాగే వీలైనంత సూర్యకాంతి నుండి విటమిన్ డి లభించేలా జాగ్రత్తలు పాటించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.  ప్రతిరోజూ నడవాలి. తేలికపాటి యోగా చేయాలి. మెట్లు ఎక్కాలి. ఇది ఎముకలను బలపరుస్తుంది . చెడు అలవాట్లను నివారించాలి.  సిగరెట్లు,  ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. ఇవి ఎముకలను త్వరగా బలహీనపరుస్తాయి. వైద్యులు ఏమంటున్నారంటే.. ఆస్టియోపోరోసిస్ త్వరగా వచ్చే వ్యాధి కాదు. నెమ్మదిగా ప్రభావితం చేస్తుంది. కానీ అది దాని ప్రభావాన్ని చూపించే సమయానికి చాలా ఆలస్యం అవుతుంది. కాబట్టి ఇప్పటి నుండే  ఎముకలను జాగ్రత్తగా చూసుకోవాలి. రోగం వచ్చాక వైద్యం చేయించుకోవడం కంటే రోగం రాకుండా జాగ్రత్త పడటం మంచిది.                       *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఎముకలను చెదపురుగుల్లా తినేసే ఈ వ్యాధి గురించి తెలుసా? Publish Date: Jun 18, 2025 9:30AM

క్రమశిక్షణ ఎక్కువగా ఉన్న వారిలో కనిపించే లక్షణాలు ఇవే..!

క్రమ శిక్షణ ప్రతి వ్యక్తి జీవితాన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దుతుంది.  క్రమశిక్షణతో ఉన్నవారికి,  క్రమశిక్షణ లేనివారికి మధ్య తేడాను గమనిస్తే ఇది ఇట్టే అర్థమైపోతుంది.  క్రమశిక్షణ  ఉన్న వ్యక్తులు జీవితంలోని ప్రతి విషయంలో ఒక స్పష్టమైన దారిని అనుసరిస్తారు. వీరి ప్రవర్తన, ఆలోచనలు, పనితీరు, ఆచరణ.. all reflect their structured mindset అని చెప్పవచ్చు. క్రమశిక్షణ ఎక్కువగా ఉన్న వ్యక్తులు బోలెడు మంది ఉంటారు.  వీరిలో ఉండే లక్షణాలు స్పష్టంగా తెలుసుకుంటే.. సమయపాలన (Time Management).. క్రమశిక్షణ గల వ్యక్తులు సమయాన్ని చాలా విలువైనదిగా భావిస్తారు. వారు ఎప్పటికప్పుడు ప్లాన్ ప్రకారమే పనిచేస్తారు. అపాయింట్‌మెంట్లు, డెడ్‌లైన్లు, సమావేశాలు.. ఇవన్నీ సమయానికి ముందుగానే పూర్తి చేస్తారు. లక్ష్యాలు స్పష్టంగా ఉండటం (Clarity of Goals).. క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు వారి జీవిత లక్ష్యాలు, దాని చేరుకునే దారులు స్పష్టంగా ఉంటాయి. వీరు చిన్న చిన్న లక్ష్యాలుగా విడగొట్టి దశల వారీగా సాధించడానికి ప్రయత్నిస్తారు. అంతే తప్ప పెద్ద లక్ష్యాలను ఒకే సారి సాధించాలి అనుకోరు. ఆత్మ నియంత్రణ (Self-Control).. క్రమశిక్షణ ఎక్కువగా ఉన్న వ్యక్తులు ఇష్టాయిష్టాలు, ప్రలోభాలపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు. పని సమయాల్లో ఫోన్, సోషల్ మీడియా వంటి ధ్యాసలను దూరంగా ఉంచగలుగుతారు. ఏ పని చేసేటప్పుడు ఆ పని మీద మాత్రమే ఏకాగ్రత నిలపగలుగుతారు.   స్థిరత్వం (Consistency).. చాలా మంది అదేవిధంగా పని చేయాలంటే ఒత్తిడి లేదా అసహనానికి లోనవుతూ ఉంటారు. కాన క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు మాత్రం ఒకే విధంగా నిరంతరం పని చేయడానికి ఎప్పుడూ సిద్దంగా ఉంటారు. ఇదే  వీరిలో ప్రత్యేకత. అదేవిధంగా రోజూ వ్యాయామం, చదువు, పని మొదలైన వాటిని నిరంతరంగా చేస్తూ ఉంటారు. బాధ్యత (Responsibility).. క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు ఏదైనా పనిని ఇతరులు చెప్పేవరకు అలాగే నిరీక్షిస్తూ కూర్చోరు.  ఇతరులతో చెప్పించుకోకుండా తమ పని తామే చేసుకుంటారు. తప్పులు జరిగినప్పుడు తప్పును ఒప్పుకుని పరిష్కరించడానికి ముందుంటారు. శ్రమతో కూడిన జీవితం (Hardworking Nature).. క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు ఎక్కువగా కష్టాన్ని నమ్ముకుంటారు.  చేయాల్సిన పనులను వెంటనే చేసేతారు తప్ప పనుల్ని వాయిదా వేసే గుణం అస్సలు ఉండదు.  శ్రమించడం వల్ల ఎంత సమయం, శక్తి పోతుందన్న భయం ఉండదు. క్రమబద్ధత (Organization).. క్రమ శిక్షణ కలిగిన వ్యక్తులు తమ వస్తువులను కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు.   టేబుల్, గదులు, డాక్యుమెంట్లు ఇలా చాలా అన్ని సమర్థవంతంగా పెట్టుుంటారు. వీరితో ఏవైనా చర్చలు జరిపితే ఆ చర్చల్లోనూ, రచనలలోనూ స్పష్టత, క్రమబద్ధత కనిపిస్తుంది. ఆరోగ్యపరమైన శ్రద్ధ (Health Discipline).. ఆహారం, నిద్ర, వ్యాయామం శరీరానికి ఎంత అవసరమో చక్కగా అర్థం చేసుకుంటారు. ఆరోగ్యం బాగుంటేనే క్రమశిక్షణగా ఏ పనిని అయినా చేసుకోగలుగుతాం అని వీరు నమ్ముతారు.  అందుకే ఎప్పుడు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరు. చెడు అలవాట్లు అంటే వీరికి అసహ్యం. అదేవిధంగా సోమరితనంగా ఉండేవారు,  చెడు అలవాట్లు కలిగిన వారు అంటే వీరికి గిట్టదు. ఇలాంటి వారికి దూరంగా ఉంటారు. స్వీయ ప్రేరణ (Self-Motivation).. ఎవరూ చెప్పకుండానే తాము ముందుగా ప్రేరణ పొందడం వీరిలో గొప్ప లక్షణం. ఎవరో వచ్చి వీరిని ఉత్సాహ పరిచి ముందుకు నెట్టాల్సిన అవసరం లేదు.   ఒక పని పూర్తి చేయాలనే ఉత్సాహం లోపల నుంచే వస్తుంది. ఎప్పటికప్పుడు మెరుగుదల (Continuous Improvement).. క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు ఎప్పుడూ చేసే పని  పట్ల ఉదాసీనంగా ఉండరు.  ఈ పనిని ఇంకా బాగా చేయవచ్చా? ఈ పని గురించి ఇంకా విభిన్న కోణాలు ఉన్నాయా?  వంటి ఆలోచనలు వీరిలో ఉంటాయి. తద్వారా వీరు ఎప్పటికప్పుడు తమ పనితీరును, జీవితాన్ని మెరుగుపరుచుకుంటూనే ఉంటారు.                                             *రూపశ్రీ.
క్రమశిక్షణ ఎక్కువగా ఉన్న వారిలో కనిపించే లక్షణాలు ఇవే..! Publish Date: Jun 18, 2025 9:30AM

మేమెంతో మాకంత అయ్యే పనేనా?

తెలంగాణలో కులం కుంపట్లు రాజుకుంటున్నాయా? ఇంతవరకు ఒక లెక్క ఇకపై మరో లెక్క అన్నట్లుగా రాజకీయ సమీకరణాలు, కుల సమీకరణలుగా మారి పోతున్నాయా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. బీసీ కులగణన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన మేమెంతో మాకంత (జనాభా ప్రాతిపదికన పదవుల పంపకం) నినాదం  జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు మేలు చేస్తుందో ఏమో కానీ, రాష్ట్రంలో రెంటికి చెడిన రేవడి చేస్తుందా అనే మీమాంస కాంగ్రెస్ వర్గాల్లో మొదలైంది.  ముఖ్యంగా.. ఇటీవల చేపట్టిన మంత్రివర  విస్తరణలో  రెడ్డి సామాజిక వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టడం.. అలాగే, పీసీసీ కార్యవర్గంలో ముందెన్నడూ లేని విధంగా సింహా భాగం (68) శాతం పదవులు ఎస్సీ,ఎస్టీ, బీసీ వర్గాలకు ఇవ్వడంతో.. కాంగ్రెస్ పార్టీకి హక్కుదారులం అనుకునే రెడ్డి సామాజిక వర్గంలో అసంతృప్తి  మొదలైందని అంటున్నారు.  కేవలం పదవులు ఆశించి భంగ పడిన నాయకుల్లోనే కాదు..  ఇప్పటికే పదవుల్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గం  నాయకుల్లోనూ రేపటి గురించిన గుబులు, తమ రాజకీయ భవిష్యత్ గురించిన ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది.   సామాజిక న్యాయం మంచిదే  కానీ, సన్నాయి నొక్కులు నొక్కుతున్న కాంగ్రెస్ పార్టీ రెడ్డి నాయకులు దశాబ్దాలుగా పార్టీకి అండగా నిలిచిన తమ సామాజిక వర్గాన్ని పూర్తిగా ఉపేక్షించడం, మరీ పూచిక పుల్లలా తీసి పారేశారన్న అభిప్రాయం జనంలోకి వెళ్ళడం పార్టీకి మంచిద కాదని అంటున్నారు. నిజానికి.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులే కాదు.. కాంగ్రెస్ అభిమానులు, విశ్లేషకులలోనూ అదే మాట విన వస్తోంది.    అయితే..  ఇప్పటికిప్పుడు తొందర పడితే ప్రయోజనం ఉండదని, స్థానిక  ఎన్నికల తర్వాత మంత్రి వర్గంలో  మిగిలిన మూడు ఖాళీల భర్తీతో పాటుగా, మంత్రివర్గ  పునర్వ్యవస్థీకరణ ఉంటుందని అంటున్న నేపధ్యంలో ఆ క్రతువు కూడ పూర్తయ్యే వరకు ఆగుదామని, రెడ్డి  నాయకులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.  మరో వంక, పార్టీకి దూరమైన వర్గాలను దగ్గర చేసుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంటున్న కులగణన, బీసీ, ఎస్సీలకు మంత్రి పదవులు, పీసీసీలో బడుగులకు పెద్ద పీట..వంటి నిర్ణయాలను అమలు చేసిన రాష్ట్ర నాయకత్వం, చేసిన మంచిని చెప్పుకోవడంలో వెనక పడిందని అంటున్నారు. నిజానికి.. ఒక విధంగా బలవంతపు బ్రాహ్మనార్ధం అన్నట్లుగా..  అధిష్టానం ఆదేశాలను పాటించిన  రాష్ట్ర నాయకత్వం బడుగులకు జరిగిన మేలును జనంలోకి తీసుకెళ్ళే విషయంలో అంతగా శ్రద్ధ చూపడం లేదని అంటున్నారు. ఫలితంగా, ఆశించిన రాజకీయ ప్రయోజనం ఏ మేరకు దక్కుతుందనే విషయంలో అనుమానాలు  ఆందోళనలు  వ్యక్తమవుతునాయి.  మరో వంక.. కాంగ్రెస్ ప్రభుత్వం అగ్రకుల పేదలకు అన్యాయం చేస్తున్నదనే ఆందోళన పురుడు పోసుకుంది. ఈ నేపధ్యంలోనే..  ఈబీసీ జాతీయ అధ్యక్షుడు, అగ్ర కుల నిరుపేదల సంఘాల జేఏసీ చైర్మన్‌ వల్లపురెడ్డి రవీందర్‌ రెడ్డి తెలంగాణలో ఈబీసీ కమిషన్‌ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. కమిషన్‌ ఏర్పాటుతో పాటు ఈబీసీల అభివృద్ధికి మంత్రిత్వ శాఖ, ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే..  బడుగుల్లోనూ మున్నూరు కాపు, లంబాడ సహా ఇంకా మంత్రివర్గంలో స్థానం, పార్టీ పదవులు దక్కని  కులాలు చాలానే ఉన్నాయి. దీంతో.. ఆ వర్గాల వారు  మామాటేంటని అడుగుతున్నారు.  అలాగే..  ముస్లిం మైనారిటీలు.. ఇతర మైనార్టీ వర్గాలు కూడా.  దీంతో.. మేమెంతో మాకంత  నినాదం  ఆచరణ  సాధ్యమేనా? అనే అనుమనాలు వ్యక్తంవుతున్నాయి. అనుమానాలు కాదు, సాధ్యం కాదని కూడా అంటున్నారు. అలాగే.. కాంగ్రెస్ పార్టీకి పట్టు కొమ్మగా ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసుకుంటే, దీర్ఘ కాలంలో పార్టీ నష్టపోతుందని అంటున్నారు. ఒక విధంగా..  కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది  అన్నట్లు అవుతుందా అనే అనుమానాలు, అపశ్రుతులు కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
మేమెంతో మాకంత  అయ్యే పనేనా? Publish Date: Jun 18, 2025 7:04AM

కుప్పం బాధితురాలికి చంద్రబాబు పరామర్శ..రూ.5 లక్షల సాయం

  చిత్తూరు జిల్లా కుప్పం ఘటన బాధితురాలు శిరీషను ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నరు. ఇలాంటి ఘటనలను సహించబోమని ఆమెతో ముఖ్యమంత్రి తెలిపారు.గతంలో ఎప్పుడైనా వారి నుంచి వేధింపులు ఎదురయ్యాయా అని అడిగారు. పలు సందర్భాల్లో తమను ఇబ్బందిపెట్టారని ఆమె చెప్పారు. ఈ ఘటనలో పిల్లలు, తాను భయపడుతున్నామని ముఖ్యమంత్రికి బాధితురాలు గోడు వెళ్లబోసుకున్నారు. ఇలాంటి ఘటన దురదృష్ణకరమని, ఇలాంటి వాటిని సహించే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.  మానవత్వం లేకుండా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శిరీష పిల్లలు ఏం చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు.ఈ సందర్భంగా బాధితురాలికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. పిల్లల చదువుకు హామీ ఇచ్చారు. అన్నివిధాలా అండగా ఉంటానని, ధైర్యంగా ఉండాలని సీఎం భరోసా ఇచ్చారు.చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురంలో అప్పు తీర్చలేదన్న కారణంతో శిరీషా అనే మహిళను చెట్టుకు కట్టేసి సంగతి తెలిసిందే  
కుప్పం బాధితురాలికి  చంద్రబాబు పరామర్శ..రూ.5 లక్షల సాయం Publish Date: Jun 17, 2025 10:25PM

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు

  టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ఉండగా, మీడియా ముందు ఆధారాలు లేని ఆరోపణలు చేసినందుకు టీపీసీసీ చీఫ్‌కు మాజీ మంత్రి లీగల్ నోటీసులు పంపారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హామీలు అమలు చేయడం చేతకాని కాంగ్రెస్ సర్కారు తన చేతికానీతాన్ని కప్పిపుచ్చేందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి రాద్ధాంతం చేస్తోందని దుయ్యబట్టారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా తమపై, తమ పార్టీ నేతలపై ఇంతటి  దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. వెంటనే బేషరతుగా మహేష్ కుమార్ గౌడ్ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.  చట్టాలను గౌరవించే వ్యక్తులుగా అక్రమంగా పెట్టిన కేసు విచారణకు సైతం హాజరై సహకరించామని తెలిపారు. ఆరు గ్యారెంటీలను, 420 హామీలను పూర్తిగా గాలికొదిలేసి ఇలాంటి దిక్కుమాలిన చర్యలకు పాల్పడితే సహించే ప్రసక్తే లేదని  కేటీఆర్ హెచ్చరించారు. అడ్డగోలుగా మాట్లాడితే బీఆర్ఎస్ శ్రేణులు కూడా చూస్తూ ఊరుకోబోరని తెలిపారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అత్యంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేతలకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని తేల్చిచెప్పారు.స్థానిక ఎన్నికల్లో ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనే దురుద్దేశంతోనే మరోసారి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు తప్ప, ఈ లొట్టపీసు కేసుతో ఒరిగేదేమీ లేదని పేర్కొన్నారు.  ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ అబద్ధాలు చెప్పడంలో పోటీపడుతున్నట్టు కనిపిస్తోందని, రాష్ట్రాన్ని నడిపించే సత్తా, సామర్థ్యం లేకపోవడంతోనే ఇలాంటి అటెన్షన్ డైవర్షన్ కుట్రలతో కాలం వెల్లదీసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేవలం రాజకీయంగా పబ్బం కడుక్కునేందుకు చేసే ఇలాంటి దుర్మార్గపూరిత వ్యాఖ్యల పైన మహేష్ కుమార్ గౌడ్ లాంటి నాయకులను కోర్టులకు ఈడుస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ఇప్పటికైనా పరిపాలన పైన దృష్టి పెట్టి, అటెన్షన్ డ్రైవరేషన్ డ్రామాలను పక్కన ప్రతిపక్ష నాయకుల పైన  ప్రాపగాండా చేయడం మానాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రజలకు మంచి చేసే అంశాల పైన దృష్టి సారించాలని హితవు పలికారు.
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు Publish Date: Jun 17, 2025 9:28PM

ప్రముఖ నటి రమ్యశ్రీపై కత్తితో దాడి

  ప్రముఖ నటి రమ్యశ్రీపై దాడి జరిగింది. ఆమె సోదరుడు ప్రశాంత్ వీడియో తీస్తున్నారని సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు  అనుచరులు దాడికి పాల్పడ్డారు. హైదరాబాద్  గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఎఫ్.సి.ఐ. లేఅవుట్లో ఓనర్స్ సమక్షంలో హైడ్రా అధికారులు రోడ్లు మార్కింగ్ చేశారు. వీడియో తీస్తున్న నటి రమ్యశ్రీ సోదరుడు పై సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు అనుచరులు దాడి ప్లాట్ యజమానురాలైన సినీనటి రమ్యశ్రీ, ఆమె సోదరుడు ప్రశాంతపై  కత్తి, క్రికెట్ బ్యాట్ తో దాడికి పాల్పడ్డారు.  శ్రీధర్ రావు అనుచరులు గాయాల పాలైన  సినీనటి రమ్యశ్రీ, ఆమె సోదరుడు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ ఎదురుగానే పట్టపగలు దుండగులు.. తమపై  హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించారని  సినీ నటి రమ్యశ్రీ వాపోయారు. సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు ఆగడాలకు అడ్డుకట్ట వేసే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రముఖ నటి రమ్యశ్రీపై కత్తితో దాడి Publish Date: Jun 17, 2025 9:11PM

ఫోన్ ట్యాపింగ్ కేసు..రేపు సిట్ ముందుకు బీజేపీ ఎంపీలు

  ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిమణం నెలకొంది. రేపు సిట్ ముందుకు బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు హాజరు కానున్నారు. తమ ఫోన్లు ట్యాప్ చేశారని బీజేపీ నేతల ఫిర్యాదు నేపథ్యంలో అధికారులు వారి వాంగ్మూలాన్ని తీసుకోనున్నారు. 2023 నవంబర్ 15న 600 మంది నేతల ఫోన్ల ట్యాప్ చేసినట్లు అధికారులు గుర్తించారు.బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావు ఈ ట్యాపింగ్ ఆపరేషన్‌ను నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి.  ఆయన బీజేపీ నేతల రాజకీయ ప్రణాళికలు, ఆర్థిక సహాయం అందించే వ్యక్తుల గురించి సమాచారం సేకరించి, ఈ వివరాలను అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు చేరవేశారని, భుజంగరావు ఈ సమాచారాన్ని బీజేపీ నేతల నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ నాయకులకు ఇచ్చి, రాజకీయంగా ఎదుర్కొనేందుకు ఉపయోగించారని సిట్ విచారణలో తేలింది.ఈ కేసులో ప్రభాకర్ రావు, భుజంగరావు, డీఎస్పీ ప్రణీత్ కుమార్‌లతో పాటు ఇతర పోలీసు అధికారులు కూడా పాల్గొన్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు
ఫోన్ ట్యాపింగ్ కేసు..రేపు సిట్ ముందుకు బీజేపీ ఎంపీలు Publish Date: Jun 17, 2025 8:59PM