అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందానికి తుది గడువుజులై 15!

posted on: Jun 30, 2026 9:28AM

అమెరికా, ఇరాన్ సంక్షోభం ముగింపు దిశగా కీలక ముందడుగు పడింది. ఇరు దేశాల మధ్యా శాంతి చర్చలకు  జూలై 15 తుది గడువుగా ముహూర్తం ఖరారైంది.  ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న అమెరికా, ఇరాన్ దేశాల  శాంతి చర్చలకు సంబంధించి ఈ గడువు అత్యంత కీలకమైనదిగా ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి.  మిడిల్ ఈస్ట్ లో పెచ్చరిల్లుతున్న  ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు ఇరు దేశాల మధ్య ప్రతిపాదిత శాంతి ఒప్పందాన్ని జూలై 15 లోగా పూర్తి చేయాలని  అమెరికా, ఇరాన్ ను వాటంతట అవే  డెడ్‌లైన్‌ను నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు ప్రెసిడెన్షియల్ టాస్క్‌ఫోర్స్ ఆన్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ అండ్ గ్రోత్ (పీటీఏజీ) వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.  ఈ లోగా ఒక  సయోధ్య కుదరకుంటే..  ప్రాంతీయ భద్రత మరింత క్షీణించే ప్రమాదం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఈ చర్చల్లో ప్రధానంగా ప్రపంచ దేశాల వాణిజ్యానికి వెన్నెముక లాంటి హర్మూజ్ జలసంధి   వివాదంపైనే ఇరు దేశాలు ప్రధానంగా దృష్టి సారించాయి. అంతర్జాతీయ ఇంధన రవాణాకు   కీలకమైన  హర్మూజ్ జలసంధి ప్రాంతంలో గత కొంతకాలంగా వాణిజ్య నౌకలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల వల్ల అంతర్జాతీయ చమురు సరఫరాకు తీవ్ర విఘాతం కలుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ నౌకల సురక్షిత ప్రయాణానికి స్పష్టమైన హామీ ఇవ్వడం ఈ చర్చల ప్రథమ లక్ష్యంగా మారింది. దీనితో పాటు  లెబనాన్ సంక్షోభాన్ని శాంతియుతంగా   తగ్గించాలనే కోణంలో కూడా ఇరు దేశాల ఉన్నత స్థాయి సాంకేతిక బృందాలు ఒక నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు సాగుతున్నాయి.

మరోవైపు ఇరాన్   ఎదుర్కొంటున్న ఆంక్షల సడలింపు అంశం కూడా ఈ ప్రతిపాదిత ఒప్పందంలో ఒక ముఖ్యమైన అంశంగా ఉండనుంది. గత కొన్ని రోజులుగా అమెరికా, ఇరాన్ ల మధ్య ప్రత్యక్ష  క్షిపణి దాడులు జరిగినప్పటికీ, యుద్ధ వాతావరణాన్ని పక్కన పెట్టి దౌత్య మార్గాల ద్వారానే ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోవడానికి ఇరుపక్షాల అగ్రనేతలు మొగ్గు చూపుతున్నారు.  

జూలై 15 నాటికి ఇరు దేశాలు ఒకే తాటిపైకి వచ్చి చారిత్రాత్మక శాంతి ఒప్పందంపై సంతకాలు చేస్తాయా, లేదా పశ్చిమాసియా మరో తీవ్ర సంక్షోభంలోకి జారుకుంటుందా అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల ముందున్న అతిపెద్ద ప్రశ్న. 

google-ad-img
    Related Sigment News
    • Loading...