Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తిరుపతిలో జేఎస్ఎస్ క్యాంపస్ ఏర్పాటు
posted on: Jun 18, 2026 6:52PM

మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎంవోయూ...
ప్రజాప్రభుత్వంలో తిరుపతికి మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ తరలిరానుంది. మైసూరుకు చెందిన జేఎస్ఎస్(JSS) మహావిద్యాపీఠం ఆధ్వర్యంలో తిరుపతిలో జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆఫ్-క్యాంపస్ (JSS AHER Off-Campus) ఏర్పాటుచేయనున్నారు. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఏపీ ఉన్నత విద్యామండలి జేఎస్ఎస్(జగద్గురు శ్రీ శివరాత్రీశ్వర మహావిద్యాపీఠం) మహావిద్యాపీఠంతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది.
ఏపీ ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, జేఎస్ఎస్ మహావిద్యాపీఠం టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, జేఎస్ఎస్ ఏహెచ్ఈఆర్ ప్రో ఛాన్స్ లర్ డా.బి.సురేష్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం తిరుపతిలో జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (JSS AHER) ఆఫ్-క్యాంపస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.
మైసూరు హెడ్ క్వార్టర్ గా ఉన్న జేఎస్ఎస్ ఏహెచ్ఈఆర్((JSS AHER) నాక్ నుంచి A++ గుర్తింపు పొందిన డీమ్డ్ విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందింది. ఎన్ఐఆర్ఎఫ్ 2025 ర్యాంకింగ్స్లో విశ్వవిద్యాలయాల విభాగంలో 21వ స్థానం, ఒవరాల్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో 38వ స్థానాన్ని దక్కించుకుంది. 70 ఏళ్ల చరిత్ర కలిగిన జేఎస్ఎస్ విద్యాసంస్థకు ఇది ప్రధాన విద్యాసంస్థగా ఉండగా.. భారత్తో పాటు విదేశాల్లో 300కు పైగా విద్యాసంస్థలను నిర్వహిస్తోంది.
అందుబాటులో 74 కోర్సులు
ప్రతిపాదిత తిరుపతి క్యాంపస్లో ఐదు సమగ్ర విద్యా పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు. అడ్వాన్స్డ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీస్, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ అండ్ బిహేవియరల్ సైన్సెస్, హెల్త్కేర్ అండ్ అలైడ్ సైన్సెస్, మేనేజ్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ టూరిజం, లా, హ్యూమానిటీస్, పాలసీ అండ్ గవర్నెన్స్ ఏర్పాటుచేయనున్నారు.
ఈ క్యాంపస్లో మొత్తం 74 కోర్సులు అందుబాటులో ఉండనుండగా.. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత 10 వేల మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసించే అవకాశం ఉంటుంది. అదనంగా హెల్త్కేర్లో ఏఐ, సెమీకండక్టర్ అప్లికేషన్స్, హెల్త్ పాలసీ అండ్ గవర్నెన్స్, పరిపాలన, ట్రాన్స్లేషనల్ బయోటెక్నాలజీ, హెల్త్కేర్ ఎంటర్ప్రెన్యూర్షిప్, ఏరోస్పేస్ మెడిసిన్ వంటి రంగాల్లో ఆరు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నారు. వీటికి తోడుగా విశాఖపట్నం, చెన్నై, బెంగళూరులో పరిశ్రమల అనుసంధాన కేంద్రాలు కూడా నెలకొల్పనున్నారు.
20వేల మందికిపైగా ఉద్యోగ, ఉపాధి కల్పన
ఈ ఒప్పందం ప్రకారం తిరుపతిలో భూమి కేటాయింపు, అవసరమైన చట్టబద్ధ అనుమతుల కోసం సింగిల్-విండో వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది. క్యాంపస్ అభివృద్ధికి సంబంధించిన మొత్తం వ్యయాన్ని జేఎస్ఎస్ మహావిద్యాపీఠమే భరించడంతో పాటు యూజీసీ నుంచి అవసరమైన అనుమతులను పొందనుంది. అమలు ప్రక్రియను పర్యవేక్షించేందుకు 60 రోజులలోపు జాయింట్ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు.
స్వర్ణాంధ్ర విజన్ కు అనుగుణంగా ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేలకుపైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రంలోని ప్రతిభావంతులైన విద్యార్థులు, పరిశోధకులు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఈ సంస్థ తోడ్పాటును అందించనుంది.
ఈ కార్యక్రమంలో మైసూరు జేఎస్ఎస్ ఏహెచ్ఈఆర్ రిజిస్ట్రార్ డా.బి.మంజునాథ, జేఎస్ఎస్ ఏహెచ్ఈఆర్ డీన్(రీసెర్చ్) డా. ప్రశాంత్ ఎమ్ విశ్వనాథ్, కేపీఎంపీ అడ్వైజరీ సర్వీసెస్ అసోసియేట్ డైరెక్టర్ ఎస్.రాఘవన్, స్పెషలిస్ట్ రోమిత్ రావు తదితరులు పాల్గొన్నారు.






